కేంద్రం వరమిచ్చినా జగన్ మీనమేషాలు.. అగ్రవర్ణ రిజర్వేషన్ల జాప్యంతో మళ్లీ కాపు ఉద్యమం ?
ఏపీలో అన్నివర్గాలకు సామాజిక న్యాయం చేస్తున్నట్లు చెప్పుకుంటున్న వైఎస్ జగన్ సర్కారు.. కేంద్రం ప్రకటించిన అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లపై మాత్రం ఇంతవరకూ నోరు మెదపడం లేదు. ఇప్పటికే ఈ అంశంపై బీజేపీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. అయితే అగ్రవర్ణ రిజర్వేషన్ల అమలులో ప్రభుత్వం చేస్తున్న జాప్యం మరో ఉద్యమానికి తిరిగి ప్రాణం పోసే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే రాజకీయంగా కూడా వైసీపీ సర్కారుకు ఇబ్బందులు తప్పకపోవచ్చనే ప్రచారం సాగుతోంది. దీంతో వైసీపీ సర్కారు దీనిపై ఏం చేయబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది.
జగన్ డ్రీమ్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్: స్టే ఎత్తివేత.. టెండర్ల ప్రక్రియకు ఓకే: కేంద్రానికి నోటీస్
కేంద్రం వరమిచ్చినా...
దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లను కులాల పేరుతోనే ఇచ్చారు. మరి దేశంలో తరతరాలుగా అగ్రవర్ణాల్లో ఉన్నామనే కారణంగా ఆర్ధికంగా చితికిపోతున్న పేదల పరిస్ధితి ఏంటనే ప్రశ్న ఉండేది. దీనికి సమాధానంగా కేంద్రం 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత వీరికి కూడా రిజర్వేషన్లు కల్పించేందుకు ముందుకొచ్చింది. కేంద్రంలోని మోడీ సర్కార్ గతేడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా ఉన్న అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చారిత్రక చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించింది. అప్పుడు దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా దీనిపై నోరు మెదపలేదు. ప్రస్తుతం ఉన్న 50 శాతం రిజర్వేషన్లకు అదనంగా అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించిన కేంద్రం.. ఇందుకోసం పది శాతం సూపర్ న్యూమరరీ కోటా ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. కానీ ఇప్పటికీ ఏపీ సహా ఎన్నో రాష్ట్రాల్లో ఇది అమలుకు నోచుకోలేదు.
ఏపీలో పెరుగుతున్న డిమాండ్..
అగ్రవర్ణ పేదలకు కేంద్రం పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటులో చారిత్రక చట్టం తీసుకొచ్చినా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఎందుకో దీన్ని అమలు చేసేందుకు సిద్దం కావడం లేదు. రాష్ట్రంలో ప్రతీ పథకానికీ, ప్రాజెక్టుకీ, అభివృద్ధి కార్యక్రమానికి డెడ్ లైన్లు పెడుతున్న జగన్ సర్కార్ అగ్రవర్ణ పేదల కోటాపై మాత్రం నోరు మెదపడం లేదు. కారణమేంటో కూడా ఎవరికీ తెలియదు. స్వయంగా ప్రభుత్వాధినేతే మాట్లాడనప్పుడు మనకెందుకు వచ్చిన సమస్య అంటూ మిగతా నేతలు, ప్రభుత్వం కూడా దీనిపై మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు. దీంతో రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకూ దీనిపై చర్చ ముందుకు సాగలేదు. కానీ తాజాగా విపక్ష బీజేపీ దీనిపై గవర్నర్ హరిచందన్ కు ఫిర్యాదు చేసింది. కేంద్రం ఇచ్చిన రిజర్వేషన్లను అమలు చేయడంలో జగన్ సర్కారుకు ఉన్న ఇబ్బంది ఏంటని బీజేపీ ఆ లేఖలో ప్రశ్నించింది. గవర్నర్ కు ఫిర్యాదు అందినా దీనిపై ఇప్పటికీ చర్యలు లేవు.
కాపు రిజర్వేషన్లపై ప్రభావం...
వాస్తవానికి కాపు ఉద్యమానికి, రిజర్వేషన్లకూ, అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లకూ సంబంధం లేదు. కానీ కాపులు తమను ఎప్పటి నుంచో బీసీల్లో చేర్చాలని ఉద్యమాలు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఈ మేరకు హామీ ఇచ్చినా అమల్లో సాధ్యం కాకపోవడంతో కేంద్రం ప్రకటించిన అగ్రవర్ణ పేదల కోటాలో ఐదుశాతాన్ని కాపులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఇదో అసంబద్ధ నిర్ణయం. ఎందుకంటే కేంద్రం ప్రకటించిన రిజర్వేషన్ అగ్రవర్ణ పేదల ఆర్ధిక పరిస్ధితి ఆధారంగా ఇచ్చింది. కానీ కాపులు కోరుతున్నది తమ సామాజిక పరిస్ధితి ఆధారంగా రిజర్వేషన్లు. అయినా చంద్రబాబు మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు. కానీ తాజాగా అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లు అమలు జరిగితే ప్రస్తుతం అగ్రవర్ణాల్లోనే (ఓసీ) ఉన్న కాపులు తమకు వీటి ఫలితం దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ దాన్ని కూడా జగన్ సర్కారు పట్టించుకోకపోవడంతో ఏదో ఒకటి తేల్చుకునేందుకు వారు సిద్దమవుతున్నారు.
Recommended Video
ముద్రగడ తాజా నిర్ణయం వెనుక కూడా..
అటు గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీ మేరకు బీసీ కోటాలో ఐదుశాతం రిజర్వేషన్ దక్కక, ఇటు కేంద్రం ఇచ్చిన పదిశాతం రిజర్వేషన్లను జగన్ సర్కార్ అమలు చేయకపోవడంతో కాపుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇది అటు తిరిగి ఇటు తిరిగి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంపై ఈ ప్రభావం పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమను దగా చేస్తున్నా ముద్రగడ మాత్రం నోరు మెదపడం లేదని కాపుల్లో ఓ వర్గం తీవ్ర ఆగ్రహంగా ఉంది. గతంలో కాపు ఉద్యమం కోసం ఒంటికాలిపై లేచిన ముద్రగడకు ఇప్పుడు మరోసారి లేవడానికి రెండూ కాళ్లు చచ్చుబడ్డాయా అంటూ సోషల్ మీడియాలో ఈ వర్గం వేస్తున్న సెటైర్లు ఆయనకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. దీంతో తాను ఉద్యమానికి గుడ్ బై చెప్పేస్తున్నట్లు నిన్న ప్రకటించారు. ముద్రగడ గుడ్ బై చెప్పినా కాపుల్లో పెరుగుతున్న ఆగ్రహ సెగలు త్వరలోనే జగన్ సర్కారుకు తాకేలా కనిపిస్తున్నాయి. దీంతో కనీసం అగ్రవర్ణ రిజర్వేషన్లపై అయినా ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్ధితి తలెత్తవచ్చనే అంచనాలున్నాయి.