సిఎం సొంత జిల్లాలో ప్రవేశించిన జగన్ ప్రజాసంకల్పయాత్ర....ఎలా సాగుతుందో?...సర్వత్రా ఆసక్తి
Recommended Video
చిత్తూరు: వైఎస్ఆర్ సీసీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన ప్రజాసంకల్పయాత్ర గురువారం చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించింది. చిత్తూరు జిల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా కావడంతో ఈ జిల్లాలో జగన్ పాదయాత్ర ఏ విధంగా సాగుతుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ప్రజాసంకల్పయాత్ర పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర 46వ రోజు అనంతపురం జిల్లా బలిజపల్లి శివారు నుంచి ప్రారంభమైంది. అనంతరం కొంత సమయం వ్యవధిలో చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలం ఎద్దులవారి కోట గ్రామంలోకి జగన్ ప్రవేశించాడు.
జిల్లాలో పాదయాత్ర వివరాలు...
చిత్తూరు జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ 260 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. ఎద్దులవారి కోట నుంచి ఎద్దుల వేమన్నగారి పల్లి, ఆర్ఎన్ తండా, కొట్టాల క్రాస్ మీదుగా వసంతపురం మీదుగా గురువారం జగన్ పాదయాత్ర కొనసాగనుంది. జిల్లాలోని తంబళ్ళపల్లి, మదనపల్లి, పీలేరు, పుంగనూరు, చంద్రగిరి, పూతలపట్టు, నగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో పాదయాత్ర ఉంటుంది. వసంతాపురంలో ప్రజలతో వైఎస్ జగన్ సమావేశం కానున్నట్లు తెలిసింది. శ్రీకాళహస్తి నుండి నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించటం ద్వారా రాయలసీమ జిల్లాల పర్యటన పూర్తవుతుంది.
సర్వత్రా ఆసక్తి...
చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులోకి ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశించడంపై రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ జిల్లాలో సుమారు 22 రోజుల పాటు జగన్ పాదయాత్ర కొనసాగుతుంది. జిల్లాలోని 9 నియోజకవర్గాల గుండా సాగే పాదయాత్రలో జగన్ దాదాపు 250 కిలోమీటర్లు నడుస్తారు. కడప సొంత జిల్లా కాబట్టి జగన్ పాదయాత్రకు జనాల స్పందన బాగానే ఉందన్నారు. అయితే కర్నూలు జిల్లాలోను తర్వాత అనంతపురం జిల్లాలో కూడా జగన్ పాదయాత్రకు మంచి స్పందనే లభించిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో జగన్ పాదయాత్రకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో ఎలాంటి స్పందన లభిస్తుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
విజయవంతం చెయ్యాలని...
సిఎం సొంత జిల్లాలో ఇక్కడ జగన్ ప్రజాసంకల్ప యాత్రను విజయవంతం చెయ్యాలని వైసిపి సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టుదలతో ఉన్నారు. జగన్ పాదయాత్రను గ్రాండ్ సక్సెస్ చేయాలనేది తన అభిమతమని పెద్దిరెడ్డి మొదట్నుంచి చెబుతున్నారు. అందుకనే స్థానిక వైసిపి నేతలందరూ జగన్ పాదయాత్రను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్విరామంగా కృషి చేస్తున్నారు.
గతంలో వైసిపిదే పైచేయి...
గత ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని 14 నియోజవకవర్గాల్లో వైసిపి 8 నియోజకవర్గాలు గెలుచుకున్నది. చంద్రబాబు సొంత జిల్లా అయినా మెజారిటీ సీట్లు వైసిపి గెల్చుకోవడం గమనార్హం. అయితే ఆ తరువాత పలమనేరు ఎంఎల్ఏ అమరనాధరెడ్డిని టిడిపిలోకి తెచ్చుకోవడం ద్వారా ఈ జిల్లాలో ఇరుపార్టీల బలాబలాలు సమానమయ్యాయి. మరోవైపు ఎంపి స్థానాల్లోనూ ఇద్దరి బలాలు సమం కావడం గమనార్హం. చిత్తూరు జిల్లాలో ఉన్న రెండు పార్లమెంటు స్ధానాల్లో చిత్తూరులో టిడిపి గెలవగా, తిరుపతిలో వైసిపి గెలిచింది. ఈ నేపథ్యంలో జగన్ పాదయాత్రకు స్పందన విషయమై అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తితో గమనిస్తున్నాయి.