వైఎస్ షర్మిలతో జగన్ మాజీ సలహాదారు -కేసీఆర్ ఆంధ్రోడేనంటూ రంగారెడ్డి సంచలనం -లోటస్పాండ్ నుంచి ఫోన్లు
తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపుతూ కొత్త పార్టీని ఏర్పాటు చేసే దిశగా వైఎస్ షర్మిల కీలక అడుగులు వేస్తున్నారు. వీకెండ్లో బెంగళూరుకు వెళ్లిపోయిన ఆమె.. సోమవారం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ నివాసమైన లోటస్ పాండ్ వేదికగా షర్మిల ఇవాళ పలువురు కీలక వ్యక్తులు, ముఖ్యనాయకులతో వరుస భేటీలు నిర్వహించారు. ఆమెతో సమావేశం తర్వాత ఒకరిద్దరు నాయకులు.. తెలంగాణ సీఎం కేసీఆర్ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ స్థాపన తేదీపైనా మరికొంత సమాచారం వెల్లడైంది. జగన్తో షర్మిల విభేదాలపై ఆమె ముఖ్య అనుచరులు కీలక ప్రకటన విడుదల చేశారు. వివరాల్లోకి వెళితే..
షర్మిలతో జగన్ మాజీ సలహాదారు
కొద్ది రోజుల గ్యాప్ తర్వాత వైఎస్ షర్మిల తిరిగి హైదరాబాద్ చేరడంతో లోటస్ పాండ్ లో మళ్లీ సందడి వాతావరణం నెలకొంది. పార్టీ ఏర్పాటు దిశగా.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ప్రముఖులు, వైఎస్ అభిమానులతో షర్మిల వరుసగా సమావేశమవుతున్నారు. సోమవారం షర్మిలతో భేటీ అయినవారిలో ప్రముఖ జర్నలిస్టు, జగన్ సర్కారు మాజీ సలహాదారు కె.రామచంద్రమూర్తి కూడా ఉండటం విశేషం. తెలంగాణలో ప్రారంభించబోయే కొత్త పార్టీ విధివిధానాలు, వాటిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే అంశాలపై వీరిద్దరు చర్చించినట్లు తెలుస్తోంది. గతవారం వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా హైదరాబాద్ వచ్చి షర్మిలను కలవడం తెలిసిందే. మరోవైపు..
లోటస్పాండ్ నుంచి నేతలకు ఫోన్లు..
జగన్ సర్కారు మాజీ సలహాదారు రామచంద్రమూర్తితోపాటు ఇవాళ షర్మిలను కలిసివారిలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, నల్గొండ డీసీసీ మాజీ అధ్యక్షుడు తూడి దేవేందర్రెడ్డి తదితర ప్రముఖులు కూడా ఉన్నారు. వైఎస్ అభిమానులుగానో, తాను పెట్టబోయే పార్టీకి సమర్థకులుగానో ముందుకొచ్చే నేతలతో మొదట ఆత్మీయ సమావేశాలు నిర్వహించి, ఆ తర్వాతే పార్టీ ప్రకటన చేయాలని షర్మిల భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతవారం నల్గొండ జిల్లా నేతలతో సమావేశం సందర్భంలో.. లోటస్ పాండ్ కంటే పెద్దదైన ప్రాంగణంలో కార్యకలాపాల నిర్వహణకు షర్మిల హింట్ ఇచ్చారు. కానీ పార్టీ స్థాపన వరకూ అక్కడి నుంచే వ్యవహారాలు నడిపించబోతున్నట్లు తాజాగా వెల్లడవుతోంది. వైఎస్ హయాంలో కీలకంగా వ్యవహరించి, ఇప్పుడు కాంగ్రెస్ సహా వేర్వేరు పార్టీల్లో కొనసాగుతున్న కొందరు నేతలకు లోటస్పాండ్నుంచి ఫోన్లు చేసి (షర్మిల)పార్టీలో చేరాలంటూ ఆహ్వానాలు పంపుతున్నట్లు సమాచారం. కాగా,
రంగారెడ్డి సంచలనం..
లోటస్ పాండ్ లో వైఎస్ షర్మిలను కలిసిన తర్వాత కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ తెలంగాణకు బద్ధ వ్యతిరేకి అని, ఆయన సమైక్యవాదాన్ని మోస్తోన్న షర్మిలకు ఇక్కడ రాజకీయంగా ఆదరణ ఉండబోదంటూ కొందరు కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు చేస్తోన్న కామెంట్లపై రంగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ ఈ లోకంలో లేకపోయినా, వారి పిల్లలు ప్రజల కోసం మంచి పనులు చేస్తున్నారని కితాబునిచ్చారు. వైయస్ ఎంతో మంది ప్రజాప్రతినిధులను తయారు చేశారని, తెలంగాణకు ఎన్నో మంచి పనులు చేశారని చెప్పారు. వైయస్ బతికున్నప్పుడు ఆయన కాళ్లు, ఏళ్లు పట్టుకుని తిరిగిన నేతలు ఇప్పుడు ఆయనను విమర్శించడం సరికాదని అన్నారు. అంతటితో ఆగకుండా..
జయలలిత కేరళ.. కేసీఆర్ ఆంధ్రా..
''షర్మిల కొత్త పార్టీని ఆహ్వానిస్తున్నాం. రాజకీయాలు ఎవరి సొత్తూ కాదు. ఎవరైనా పార్టీ పెట్టవచ్చు. తెలంగాణలో పనిచేసేందుకు వస్తున్న మహిళను ప్రజలు స్వాగతించాలి. దేశంలో ఎక్కడ పుట్టినా.. ఎక్కడైనా పనిచేయవచ్చు. తమిళనాడు సీఎంగా పనిచేసిన జయలలిత స్వస్థల కేరళ. షర్మిల మాజీ సీఎం కుమార్తె. షర్మిల తెలంగాణ బిడ్డ. ఈ గడ్డ మీదే పుట్టింది. నిజానికి కేసీఆర్ తెలంగాణ బిడ్డ కాదు. టీఆర్ఎస్ కీలక నేత, ఎంపీ కేశవరావు(కేకే) తండ్రి కూడా ఆంధ్ర నుంచి వలస వచ్చారు. కాబట్టి షర్మిల గురించి అవాకులు చెవాకులు పేలడం, ఇష్టానుసారంగా మాట్లాడటం మానుకోవాలి'' అని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి అన్నారు. ఇక..
కొత్త పార్టీకి ముహుర్తం ఖరారు?
షర్మిల కొత్త పార్టీ ప్రకటనకు సంబంధించి రెండు తేదీలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వైఎస్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మే 14 తేదీనగానీ, వైఎస్సార్ జయంతి అయిన జూలై 8నగానీ కొత్త పార్టీని ప్రకటించాలని షర్మిల యోచిస్తున్నట్లు తెలుస్తోంది. జులై వరకు ఆగడం కంటే, మే 14న పార్టీని ప్రకటించేసి, వెనువెంటనే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర కూడా ప్రారంభిస్తే బాగుంటుందని షర్మిలను కలిసిన నేతలు ఆమెకు సలహా ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, షర్మిలకు సంబంధించి వార్తలను ముందుగానే బ్రేక్ చేసిన ఓ మీడియా సంస్థ మాత్రం ఏప్రిల్ లోనే ప్రకటన ఉండొచ్చని చెబుతోంది. మరోవైపు..
జగన్తో గొడవలపై టీమ్ షర్మిల క్లారిటీ
తెలంగాణలో జరుగుతున్న కొత్త రాజకీయ పరిణామాలకు వైఎస్ కుటుంబంలో విభేదాలే కారణమని, సోదరుడు జగన్ తో గొడవల కారణంగానే ఆయనతో విభేదించి షర్మిల కొత్త పార్టీకి సిద్ధమయ్యారంటూ ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్ న్యూస్ చానల్ చేస్తున్న ప్రచారాన్ని షర్మిల ముఖ్య అనుచరుడు కొండా రాఘవరెడ్డి ఖండించారు. తెలంగాణ ప్రజల కోసం షర్మిల చేస్తున్న ఆలోచనలకు.. కుటుంబ విభేదాలను అంటగట్టడమంటే అది ప్రజల్ని, వైఎస్ అభిమానుల్ని కించపర్చడమేనని రాఘవరెడ్డి అన్నారు. అంతేకాదు, తెలంగాణలో వైఎస్ షర్మిల తీసుకోబోతున్న నిర్ణయానికి ఏపీ సీఎం జగన్ ఆశీస్సులు, వైఎస్ కుటుంబీకుల దీవెనలు కూడా ఉంటాయని రాఘవరెడ్డి వ్యాఖ్యానించారు.
వైఎస్ షర్మిలకు సీఎం సీటు ఆఫర్ -వైసీపీ ఎంపీ సాయిరెడ్డికి వార్నింగ్ -తాజాగా మరో సంచలనం