జగన్ కు తొలి సవాల్ క్యాబినెట్ కూర్పే..!! సమ న్యాయం చేస్తారా..? సర్ధుకుపొమ్మంటారా..?
Recommended Video
అమరావతి/హైదరాబాద్ : సమరోత్సాహంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డికి సమస్యలు స్వాగతం పలకడంతో పాటు క్యాబినెట్ కూర్పు తలనొప్పిగా పరిణమిస్తోంది. ఏపీలో ఊహించని ఘనవిజయంతో పండుగ చేసుకుంటున్న జగన్ మోహన్రెడ్డికి కేబినెట్ కూర్పు సవాల్గా మారింది. 120-130 వద్ద ఆగిపోతామని భావించి ఫ్యాన్ వేగం 150 దాటడం వైసీపీపై ప్రజల్లో పెరిగిన విశ్వాసానికి నాంది పలుకుతోంది. మంత్రులను సైతం కాదని ఊరూ పేరులేని నేతలను గెలిపించటం వైసీపీని కూడా ఖంగుతినిపించింది. నవరత్నాలు, ఉచిత వైద్యం కంటే కూడా తెలుగుదేశం పార్టీ పై వ్యతిరేకత, కమ్మ, కమ్మేతర వర్గాలుగా విడిపోయిన ఓటర్లు.. టీడీపీను ఓడించాలనే కసితో ఓట్లేసినట్టు నిర్ధారణ అవుతోంది. ఏదేమైనా అనూహ్య మెజారిటీ సాధించిన జగన్ కు క్యాబినెట్ కూర్పు తొలి సవాల్ విసురుతోంది.
జగన్ కు తొలి సవాల్ విసురుతున్న క్యాబినెట్..! సమ న్యాయం ఉంటుందా..!!
దాదాపు అన్ని కులాలు ఏకతాటిపైకి వచ్చాయనేది విశ్లేషకుల అంచనా. 2024లో మరింత తేలికగా గెలవాలని భావిస్తున్న జగన్ మోహన్రెడ్డి చాతుర్యం పరిపాలనకంటే ముందు మంత్రిమండలి కూర్పుతోనే మొదలు కావాల్సి ఉంది. కమ్మ, కాపు, రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలా అన్ని కులాలకు సమాన ప్రాతినిధ్యం ఇచ్చామనే భావన ప్రజల్లో కలిగించాలి. అదే సమయంలో సీనియర్ నేతలకు న్యాయం చేశామనిపించాలి.
పాత కొత్త కలయికతో మంత్రివర్గం..! జగన్ మనసులో ఏముంది..!!
ఇప్పటికే కేబినెట్ లో ఉండబోయే 21మంది పేర్లు బయటకు వచ్చాయి. తెలుగుదేశం పార్టీలో కమ్మ వర్గానికి ప్రాధాన్యతనిచ్చినట్టుగానే వైసీపీతో రెడ్లకు అంతే ప్రాముఖ్యతనివ్వటం ఖాయంగా కనిపిస్తోంది.. మిగిలిన వారికి ఏ శాఖలు కేటాయిస్తారనేది చూడాల్సి ఉంది. డిప్యూటీ ముఖ్యమంత్రులు ఉంటారా! ఉండరా ! అనేది కూడా మరో పాయింట్. ఎందుకంటే గతంలో జగన్ డిప్యూటీ సీఎం పదవిని ఆరోవేలితో పోల్చారు. కాబట్టి తన మంత్రిమండలిలో ఆ పదవే ఉండకపోవచ్చనే చర్చ జరుగుతోంది.
డిప్యూటీ పదవులపై నమ్మకం లేని జగన్..! ఈసారి ఆ పదవులు ఉంటాయా.. ఉండవా..!!
టీడీపీ హయాంలో చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తిలకు డిప్యూటీ పదవులు కట్టెబట్టినా నామమాత్రంగా.. కేవలం శిలాఫలకం వరకూ పరిమితమయ్యాయనే విమర్శలున్నాయి. మంత్రులకు ఎంతవరకూ స్వేచ్ఛనిస్తారనేది కూడా చర్చనీయాంశంగా మారింది. కేబినెట్ విషయానికి వస్తే.. కాపు, రెడ్డి, బీసీ వర్గాల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో కమ్మ, కాపులకు ఎవరికి ప్రయార్టీ ఇస్తారనేది కూడా నేతల్లో ఆలోచన రేకెత్తిస్తోంది.
అన్ని వర్గాలకు న్యాయం చేయాలి..! మహిళా కోటాలో ఎవరెవరికి..?
ఐదేళ్ల తరువాత తమ గెలుపు సునాయాసం కావాలంటే ఇప్పుడే సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉందనే చెప్పాలి. కాపుల్లో బొత్స, పేర్ని, సామినేని, పార్దసారధి మధ్య పోటీ నెలకొంది. అంబటి రాంబాబు వంటి నమ్మిన బంటు ఉండనే ఉన్నాడు. రోజాకు తప్పకుండా కేబినెట్లో బెర్త్ ఉంటుందనే చెప్పాలి. కొత్తగా పార్టీలోకి వచ్చి గెలిచిన వారికీ ప్రాముఖ్యతనిస్తే బావుంటందటూ సీనియర్లు సలహాలిచ్చారట. మరి సీనియర్, జూనియర్ నేతల మధ్య సయోధ్య.. కులాల సమీకరణలతో మంత్రిమండలి ఎలా తీర్చిదిద్దుతారనేది మరొ రెండుమూడ్రోజుల్లో తేలాల్సి ఉంది. ఇదే జగన్ కు పెద్ద సవాల్ గా మారింది.