సచివాలయంలో జగన్ తొలి అడుగు రేపే..! ఇక పాలన పట్టాలెక్కినట్టే..!!
అమరావతి/హైదరాబాద్: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు మొట్టమొదటిసారి సెక్రటేరియట్లో అడుగుపెట్టనున్నారు. రేపు ఉదయం 8.39 గంటలకు సీఎం ఛాంబర్లో జగన్ అడుగుపెట్టనున్నారు.సచివాలయం లోకి సీఎం జగన్ వచ్చిన వెంటనే మొదటి బ్లాక్ వద్ద శృంగేరి పీఠ వేద పండితులు వేద మంత్రాలతో స్వాగతం పలకనున్నారు.ఇప్పటికే సీఎం ఛాంబర్ మొదటి బ్లాక్ ను అధికారులు వాస్తుకు అనుగుణంగా మార్పులు కూడా చేయగా తాజాగా ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం సీఎం ఛాంబర్ ను పరిశీలించారు.
ముందుగా జగన్ సెక్రటేరియట్లో ఉదయం 8.39 గంటలకు అడుగుపెట్టిన తర్వాత, 8.42 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం 8:50 కు జగన్ ముఖ్యమైన ఫైళ్లపై సంతకం చేసి 9.15 కు మంత్రివర్గం ఏర్పాటు కార్యక్రమం అనంతరం 11.49 కి మంత్రుల ప్రమాణస్వీకారం కార్యక్రమానికి వెళ్లనున్నారు.
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్తో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. రేపటి మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి గవర్నర్ ఇప్పటికే విజయవాడ చేరుకోగా, గవర్నర్ను గేట్వే హోటల్లో ముఖ్యమంత్రి జగన్ కలిశారు. రేపు ప్రమాణస్వీకారం చేయబోయే మంత్రుల జాబితాను గవర్నర్కు జగన్ అందజేశారు. శనివారం రోజు ఒకేసారి 25 మంది మంత్రులతో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. సచివాలయం ఆవరణలోని ఖాళీ స్థలంలో మంత్రుల ప్రమాణస్వీకారోత్సవానికి విస్తృత ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో మంత్రుల జాబితాను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.