అమెరికాలోను జగన్ను వెంటాడుతున్న వివాదాలు..కరోనావేళ కొత్త కల్లోలం..రెండుదేశాల్లోను చర్చ
అమరావతి: కొద్ది రోజుల క్రితం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్లో ఏపీ సీఎం జగన్ కరోనావైరస్ నేపథ్యంలో ఒక మెసేజ్ ఇచ్చిన హోర్డింగ్ దర్శనమిచ్చింది. మీరక్కడ క్షేమంగా ఉండండి..మీవారిని ఇక్కడ క్షేమంగా ఉండేలా చూసుకునే బాధ్యత మాది అంటూ ప్రవాసాంధ్రులను ఉద్దేశిస్తూ ఫ్లెక్సీ దర్శనమిచ్చింది. అమెరికాలో ఫ్లెక్సీ వెలిస్తే ఆంధ్రాలో రాజకీయ ప్రకంపనలు వచ్చాయి. అయితే ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన వ్యక్తి దీనిపై స్పష్టత ఇచ్చారు.
న్యూయార్క్లో జగన్ ఫ్లెక్సీ
అమెరికాలో ఫ్లెక్సీ దర్శనమిస్తే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రకంపనలు పుట్టాయి. ప్రస్తుతం కరోనావైరస్ అగ్రరాజ్యం అమెరికాతో పాటు ప్రపంచదేశాలను కబళిస్తున్న వేళ అమెరికాలో ఉంటున్న ప్రవాసాంధ్రుల మేలు కోరుతూ టైమ్స్స్క్వేర్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పేరుతో ఓ ఫ్లెక్సీ వెలిసింది. ఆంధ్రాలో ఉన్న తమ బంధువుల గురించి బాధపడొద్దని అక్కడ క్షేమంగా ఉండాలంటూ సీఎం జగన్ పేరుతో ఓ ఫ్లెక్సీ వెలిసింది. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. కరోనావైరస్ కేసులు ఆంధ్రప్రదేశ్లో పెరుగుతుంటే అమెరికాలో ఫ్లెక్సీల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తోందంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ప్రతి పక్షాల విమర్శలకు ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వ్యక్తి రత్నాకర్ పండుగాయల వివరణ ఇచ్చారు.
సొంత డబ్బులతోనే ఫ్లెక్సీ ఏర్పాటు
ఫ్లెక్సీ తన సొంత డబ్బులతో ఏర్పాటు చేసినట్లు రత్నాకర్ చెప్పారు. దానికి ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా ఏపీ ప్రభుత్వం నుంచి రత్నాకర్ పండుగాయల వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కరోనావైరస్ నియంత్రించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమవుతోందని టీడీపీ ఇప్పటికే విమర్శనాస్త్రాలు ఎక్కుబెట్టింది. ఏపీలో కరోనావైరస్ కట్టడికి ఖర్చు చేయాల్సిందిపోయి అమెరికాలో ఫ్లెక్సీలకు ఏపీ ప్రభుత్వం డబ్బులు ఖర్చుచేస్తోందని ఆరోపణలు చేసింది. అంతేకాదు జగన్ ప్రభుత్వం మాటలకే పరిమితం అవుతోందని చేతల్లో మాత్రం చూపించడం లేదని టీడీపీ విమర్శలు చేసింది.
తెలుగు ప్రజలకు ధైర్యం చెప్పేందుకే..
టీడీపీ విమర్శలపై రత్నాకర్ పండుగాయల వివరణ ఇచ్చారు. ఏపీలో కరోనావైరస్ మహమ్మారి నుంచి విముక్తి కల్పించేందుకు జగన్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు బాగున్నాయని చెబుతూ ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్లో ఫ్లెక్సీని తానే ఏర్పాటు చేయించినట్లు వివరణ ఇచ్చారు రత్నాకర్. అంతేకాదు కరోనావైరస్ న్యూయార్క్ను కబళిస్తున్న వేళ...న్యూయార్క్లో నివసిస్తున్న తెలుగు ప్రజల్లో భరోసా నింపేందుకే ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేసినట్లు రత్నాకర్ తెలిపారు. అంతేకాదు తమ బంధువులు కూడా భారత్లో సురక్షితంగానే ఉంటారని చెబుతూ ఫ్లెక్సీ ద్వారా ధైర్యం నింపే ప్రయత్నం చేశామని రత్నాకర్ వెల్లడించారు. తన సొంత జేబు నుంచే ఫ్లెక్సీ కోసం ఖర్చు చేసినట్లు చెప్పారు.
Recommended Video
టీడీపీకి వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదు
రాష్ట్రం ఈ రోజు దుస్థితిలో ఉందంటే అందుకు కారణం టీడీపీ ప్రభుత్వమే అని రత్నాకర్ విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అనవసరపు ఖర్చులు చేసి ఖజానాను ఖాళీ చేశారని రత్నాకర్ మండిపడ్డారు. వైసీపీ సర్కార్ చేస్తున్న మంచిపనులను తప్పుబట్టే అధికారం టీడీపీకి లేదని ఫైర్ అయ్యారు. నిజనిజాలు తెలుసుకోకుండా ప్రభుత్వంపై బురదజల్లాలనే ప్రయత్నం మాత్రమే టీడీపీ చేస్తోందని చెప్పారు రత్నాకర్. సోషల్ మీడియా వేదికగా కూడా దుష్ప్రచారం చేస్తున్న టీడీపీకి త్వరలోనే బుద్ధి చెబుతామని రత్నాకర్ చెప్పారు.