నవ్విన నాప చేనే పండుతోందా ? జగన్ ఐడియాకు దేశంలో పెరుగుతున్న మద్దతు..
ప్రపంచంలో గొప్ప గొప్ప ఆలోచనలన్నీ తొలుత నవ్వులపాలైనవే అనేది జగమెరిగిన సత్యం. మరీ ఆ స్ధాయిలో కాకపోయినా కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ కారణంగా ఆర్ధిక వ్యవస్దకు ముప్పు రాకుండా చూసుకోవాలంటూ సీఎం జగన్ వ్యక్తం చేసిన అభిప్రాయం ఇప్పుడు సర్వామోదంగా కనిపిస్తోంది. ప్రధానితో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఇప్పుడు దీన్ని సమర్ధిస్తున్నారు. తొలుత జగన్ అభిప్రాయాన్ని విమర్శించిన విపక్ష పార్టీలు సైతం తాజాగా దీనిపై మాట్లాడటమే మానేశాయి.
Recommended Video
కరోనా లాక్ డౌన్ - జగన్ అభిప్రాయం...
కరోనా వైరస్ ప్రభావాన్ని ముందునుంచీ లైట్ తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్నా ఈ మహమ్మారి విషయంలో తన అభిప్రాయాలు నిష్కర్షగా చెప్పడంలో ఏపీ సీఎం జగన్ ఏనాడూ వెనకడుగు వేయలేదు. కరోనా వైరస్ విషయంలో ముందునుంచీ జగన్ ది ఒకే మాట. దీన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మన శరీరంలో ఇతర వైరస్ ల తరహాలోనే ఇది వ్యాప్తి చెందుతుందని, ఒక స్టేజ్ తర్వాత దానంతట అదే వెళ్లిపోతుందనే జగన్ చెప్పారు. అలాగే కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడాన్ని సమర్ధించిన జగన్.. ఓ దశ దాటిన తర్వాత సడలింపులు ఇచ్చి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. ఇదే అభిప్రాయాన్ని ప్రధాని మోడీతో వీడియో కాన్ఫరెన్స్ లోనూ కుండబద్దలు కొట్టారు. అప్పటికి దేశంలో మరే ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత ధీమాగా లాక్ డౌన్ సడలింపులు ఇవ్వాలని మోడీని కోరలేదు. చివరికి పొరుగు రాష్ట్రమైన తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం జగన్ కు పూర్తి విరుద్ధ వాదననే వినిపించారు.
జగన్ వాదనతో ప్రధాని...
కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ విధించడంతో ఆర్ధిక వ్యవస్ధ కుదేలవుతుందని తెలిసినా దాని గురించి జగన్ మాట్లాడే వరకూ ఇతర రాష్ట్రాల సీఎంలు సైతం స్పందించలేదు. ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ లో జగన్ అభిప్రాయం విన్నాక ఆర్ధిక వ్యవస్ద గురించి కూడా మాట్లాడటం ప్రారంభించారు. లాక్ డౌన్ ఎంత ముఖ్యమో ఆర్ధిక వ్యవస్ధను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని ఆ తర్వాత ప్రధాని విస్పష్టంగా ప్రకటించారు. అప్పటివరకూ జగన్ లాక్ డౌన్ పరిమితులను ఎత్తేయాలని కోరినప్పుడు తీవ్రంగా విరుచుకుపడిన ఏపీ విపక్ష పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ కూడా ప్రధాని స్పందన తర్వాత వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇప్పటికీ వారు దీనిపై నోరు మెదపడం లేదు.
ఆర్ధిక వేత్తలు, కార్పోరేట్లు సైతం...
కరోనా కారణంగా లాక్ డౌన్ విధించినప్పుడు అది ఎంత కాలం కొనసాగుతుందో ఎవరికీ తెలియదు. అయితే లాక్ డౌన్ రెండుసార్లు పొడిగించిన తర్వాత కూడా కార్పోరేట్లు, ఆర్ధిక నిపుణులు, ఆర్ధిక వేత్తలు సైతం దీనిపై మాట్లాడేందుకు ముందుకు రాలేదు. కానీ ఎప్పుడైతే జగన్ స్పందన తర్వాత ఆర్ధిక వ్యవస్దకు మద్దతుగా ప్రధాని మోడీ మాట్లాడటం మొదలుపెట్టారో అప్పటి నుంచి ఒక్కొక్కరుగా ఆర్ధిక వ్యవస్ద గురించి స్పందిస్తున్నారు. తాజాగా రెండు రోజులుగా ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తో పాటు ఇన్ఫోసిస్ వ్యవస్ధాపకుడు నారాయణమూర్తి సైతం కరోనా కంటే లాక్ డౌనే ఎక్కువ ప్రాణాలను హరిస్తోందని, సుదీర్ఘ లాక్ డౌన్ మంచిది కాదని విశ్లేషణలు వినిపిస్తున్నారు. దీంతో జగన్ వాదనకు ఆర్ధిక రంగ నిపుణులు సైతం మద్దతునిస్తున్నట్లు అర్ధమవుతోంది.
జగన్ క్యాంప్ హ్యాపీ...
సంపూర్ణ లాక్ డౌన్ కొనసాగింపు కంటే సడలింపులతో ఆర్ధిక వ్యవస్ధను కాపాడుకోవడమే మంచిదన్న జగన్ వాదనకు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతుండటం వైసీపీ క్యాంపులో సంతోషం నింపుతోంది. అన్నింటికీ మించి ప్రధాని, ఆర్ధిక నిపుణులు, వ్యాపారవేత్తల నుంచి లభిస్తున్న స్పందనతో ఏపీలో విపక్ష పార్టీలు సైతం పూర్తిగా వెనక్కితగ్గినట్లు కనిపిస్తోంది. ఇలా ఒక అభిప్రాయానికి ఇంత భారీ మద్దతు పొందడం ఈ మధ్యలో ఎన్నడూ చూడలేదని వైసీపీ ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జగన్ వాదనను తొలుత విమర్శించిన వారు కూడా ఇలా దారిలోకి రావడంతో లాక్ డౌన్ విషయంలో మరింత జాగ్రత్తగా ముందుకెళ్లేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.