న్యాయమూర్తులపై జగన్ పోరు ఏపీలో తొలిసారి కాదా ? మాజీ సీఎం సంజీవయ్య చేసిందేంటి ?
ఏపీలో ప్రజల నుంచి ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ ఆధ్వర్యంలో హైకోర్టుకు చెందిన పలువురు న్యాయమూర్తులు ప్రయత్నిస్తున్నారంటూ సీఎం జగన్ ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ కలకలం రేపుతోంది. ఇలా ఓ వ్యవస్ధకు వ్యతిరేకంగా మరో వ్యవస్ధకు అధినేతగా ఉన్న వ్యక్తి లేఖ రాయడం సరైనదా కాదా అన్న చర్చ తెరపైకి వస్తోంది. దీనిపై ఎవరికి వారు భిన్నవాదనలు వినిపిస్తుండగా.. ఈ లేఖను సమర్ధిస్తూ గతంలో కూడా ఇలాంటివి జరిగాయన్న విషయాన్ని వైసీపీ నేతలు తెరపైకి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఏపీ చరిత్రలో చోటు చేసుకున్న దాదాపు ఇలాంటి సంఘటన వివరాలు ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చాయి.
జగన్ లేఖపై భిన్నవాదనలు..
న్యాయవ్యవస్ధలో కీలకమైన పలువురు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ బాబ్డేకు రాసిన లేఖపై కలకలం కొనసాగుతోంది. దీనిపై న్యాయవర్గాలు, మేథావులు, సమాజంలో ఇతర వర్గాలు కూడా భిన్నవాదనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో కీలకమైన రెండు వ్యవస్ధల్లో ఒకదానిపై మరొకటి అత్యున్నత స్ధాయిలో ఫిర్యాదు చేసుకోవడం సరికాదనే వాదన వినిపిస్తున్నా, ప్రభుత్వ వర్గాలు మాత్రం చివరి ఆప్షన్ గానే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నాయి. వైసీపీ నేతలు కూడా రాష్ట్రంలో గతేడాది కాలంగా చోటు చేసుకున్న పలు పరిణామాలను గుర్తు చేస్తున్నాయి. వీటికి క్లైమాక్స్ అన్నట్లుగానే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నాయి.
న్యాయవ్యవస్ధపై పోరు ఏపీలో తొలిసారి కాదా ?
ఏపీలో న్యాయవ్యవస్ధ ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు ప్రయత్నిస్తోందని గత నెలలోనే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంటు వేదికగా ఆరోపించారు. అప్పట్లో దీనిపైనే విస్తృతంగా చర్చ జరిగింది. తాజాగా సీఎం జగన్ రాసిన లేఖతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది. అయితే ఇలా ఎప్పుడూ జరగలేదా ? ఇదే తొలిసారా అంటే మాత్రం కాదనే సమాధానమే వస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సైతం గతంలో మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఇలాగే న్యాయవ్యవస్ధ తీరుపై తన పదవీ కాలంలోనే కేంద్రానికి లేఖ రాసి కలకలం రేపారు. అయితే అది ఈ తరానికి అంతగా పరిచయం లేని వ్యవహారం. దీంతో వైసీపీ ఇప్పుడు ఆ వ్యవహారాన్ని తెరపైకి తెస్తూ జగన్ లేఖ తొలిసారేమీ కాదు, గతంలో ఇలా చాలా జరిగాయని గుర్తుచేస్తోంది.
అప్పట్లో సంజీవయ్య ఏం చేశారు ?
1960లో దామోదరం సంజీవయ్య అప్పటి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ ఆయన ఎక్కువ కాలం ఆ పదవిలో కొనసాగలేదు. సీఎం పదవి చేపట్టిన రెండేళ్లలో ఆయన పదవి కోల్పోయారు. అప్పట్లో కాంగ్రెస్లో ఉన్న వర్గపోరు కారణంగా సంజీవయ్య తన సీఎం పదవిని పూర్తికాలం నిర్వర్తించలేకపోయారని చెబుతారు. సంజీవయ్య స్ధానంలో నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ సంజీవయ్య పదవిలో నుంచి తప్పుకున్నాక సీఎంగా ఉండగా ఆయన రాసిన ఓ లేఖ బయటికొచ్చింది. అప్పట్లో న్యాయవ్యవస్ధ వ్యవహారశైలికి వ్యతిరేకంగా ఆయన కేంద్ర హోంమంత్రి లాల్ బహదూర్ శాస్త్రికి ఈ లేఖ రాశారు. ఇందులో హైకోర్టు ఛీఫ్ జస్టిస్ చంద్రారెడ్డి విపరీతమైన కులాభిమానం ప్రదర్శిస్తూ సీనియర్గా ఉన్న మరో జడ్జిని అవమానిస్తున్నారంటూ ఇందులో కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. దీని వల్ల ఆయనకు గానీ, ఆయన ప్రభుత్వానికి గానీ ఎలాంటి ఇబ్బంది లేకపోయినా ఓ దళిత జడ్జిని అవమానిస్తున్నారనే కారణంతో ఆయన ఈ లేఖ రాశారని చెబుతారు. కానీ ఈ లేఖపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోకముందే ఆయన పదవి కోల్పోయారు.
Recommended Video
సంజీవయ్య లేఖతో జగన్ లేఖకు పోలిక...
న్యాయవ్యవస్ధ పనితీరుకు సంబంధించి అప్పట్లో మాజీ సీఎం సంజీవయ్య కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేసినా, ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని అస్ధిర పరుస్తున్నారని సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలపై ఛీఫ్జస్టిస్కు లేఖ రాసినా స్ధూలంగా చూస్తే ఈ రెండూ న్యాయ వ్యవస్ధ పనితీరుపైనే కావడం విశేషం. అయితే అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటంటే గతంలో సంజీవయ్య తాను రాసిన లేఖను బయటపెట్టొద్దంటూ హోంమంత్రి లాల్ బహుదూర్ శాస్త్రిని కోరారు. కానీ ఆ తర్వాత అది ఎలాగో లీకయింది. కానీ ఇప్పుడు జగన్ ఛీఫ్ జస్టిస్కు రాసిన లేఖను రెండు రోజుల తర్వాత ప్రభుత్వ సలహాదారుతో ఆయనే బయటపెట్టించారు. కారణాలు ఏవైనా ఇప్పటివరకూ ఏపీలోనే ఇద్దరు సీఎంలు న్యాయవ్యవస్ధ పనితీరుపై ఫిర్యాదులు చేసిన సందర్భాలున్నాయి. ఇదే విషయాన్ని వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు తెరపైకి తెస్తోంది.