విశాఖలో జగన్ కోటి రూపాయల ప్రకటన- చంద్రబాబు ఫ్రస్టేషన్ ? - బెంచ్ మార్క్ రీజన్
విశాఖ గ్యాస్ లీక్ ఘటన గురించి సమాచారం తెలియగానే.. ఏపీలో రాజకీయ పార్టీల నేతలంతా ప్రభుత్వం ముందు పరిహారం డిమాండ్లు పెట్టారు. కానీ జగన్ వారితో పాటు మృతుల కుటుంబాలను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఏకంగా కోటి రూపాయల పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. అంతేకాదు 24 గంటల్లోనే నిధులు సైతం విడుదల చేస్తూ జీవో కూడా ఇచ్చేశారు. అయితే ఈ వ్యవహారంలో జగన్ స్పీడు టీడీపీ మినహా మిగతా విపక్ష పార్టీల నేతలను ఒకింత షాక్ కు గురి చేసినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. దీనికి చాలా కారణాలు కూడా ఉన్నాయి.
గ్యాస్ లీక్ భయాలు- శ్రీకాకుళానికి విశాఖ జనం- అడ్డుకున్న పోలీసులు..
విపక్షం అడిగిందిదీ... జగన్ చెప్పిందిదీ...
విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఘటనలో గ్యాస్ లీకేజీ ఘటన చోటు చేసుకోగానే.. ఏపీలో విపక్ష పార్టీలైన టీడీపీ 20 లక్షలు, బీజేపీ 25 లక్షలు, సీపీఐ 30 లక్షలు, సీపీఎం 50 లక్షలు డిమాండ్ చేశాయి. అయితే సీఎం జగన్ వీరి అంచనాలన్నీ తలకిందులు చేస్తూ ఏకంగా మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ప్రకటించేశారు. దీంతో అవాక్కవడం వీరి వంతయింది. జగన్ కోటి రూపాయల పరిహారం ప్రకటిస్తారని ఒక్కరంటే ఒక్కరు కూడా ఊహించకపోవడం ఇక్కడ విశేషం.
విపక్షాలన్నీ గప్ చుప్...
విశాఖ గ్యాస్ లీక్ మృతుల కుటుంబాలకు జగన్ ప్రకటించిన కోటి రూపాయల పరిహారం ప్రకటనతో విపక్షాలన్నీ ఒక్కసారిగా సైలెంట్ అయ్యాయి. అప్పటికే మృతుల కుటుంబాలకు 20 లక్షలు, 30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రెస్ నోట్లు రిలీజ్ చేసిన వారంతా ఆ తర్వాత అందులో నుంచి పరిహారం విషయాన్ని తీసేయాలని మీడియాను కోరారంటే పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు. అంటే పరిహారం విషయంలో విపక్షాలన్నీ ఏమీ మాట్లాడలేని పరిస్ధితికి జగన్ వారిని తీసుకొచ్చారని తెలుస్తోంది.
చంద్రబాబు ఫ్రస్టేషన్ వెనుక....
వాస్తవానికి ఏదైనా రాష్ట్రంలో ఓ ప్రమాదం జరిగినప్పుడు, ప్రజలు చనిపోయినప్పుడు వారికి తగిన పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాలను ప్రతిపక్ష నేతలు కోరడంలో తప్పేమీ లేదు. గతంలో ఎన్నో సందర్భాల్లో విపక్షాల డిమాండ్లకు ప్రభుత్వాలు అంగీకరించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈసారి టీడీపీ 20 లక్షల పరిహారం కోరితే సీఎం జగన్ ఏకంగా కోటి రూపాయలు ఇవ్వడంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు నోట మాట రావడం లేదు. దీంతో ఏదో ఒకటి విమర్శించాలన్న చందంగా కోటి రూపాయలతో ప్రాణాలు తిరిగొస్తాయా అన్న మొక్కుబడి విమర్శలకు దిగారు. అయితే వాటికీ స్పందన రాకపోవడంతో ఐఏఎస్ అధికారుల కమిటీపై విమర్శలకు దిగారు.
బెంచ్ మార్క్ కానుందా ?
విశాఖ గ్యాస్ లీక్ మృతుల కుటుంబాలకు జగన్ ప్రకటించిన కోటి రూపాయల పరిహారం ఇప్పుడు ఏపీలో బెంచ్ మార్క్ గా మారబోతోందా అన్న భయాలు విపక్ష రాజకీయ పార్టీలకు మొదలయ్యాయి. దీనికి కారణం గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఎప్పుడూ ఇంత పెద్ద పరిహారాన్ని ఏ బాధితుడికీ ఇవ్వలేదు. కృష్ణా నదిలో బోటు మునిగినా, గోదావరిలో పుష్కరాల సందర్భంగా జనం మృత్యువాత పడ్డా 25 లక్షలకు మించి పరిహారం ఎవరికీ ఇచ్చిన చరిత్ర లేదు. అదీ అందరికీ పూర్తి స్ధాయిలో ఇచ్చారా అంటే అనుమానమే. కానీ తాజాగా జగన్ ప్రకటించిన కోటి రూపాయల పరిహారం మృతుల కుటుంబాలకు అందేలా 24 గంటల్లోనే జీవో కూడా వచ్చేసింది. దీంతో ఈ అంశాన్ని విమర్శించడానికి విపక్షాలకు అవకాశమే లేకుండా పోయింది.