జగన్ ఏడాది పాలన- టీడీపీకి ఓ పీడకల - వరుస షాకులతో నాలుగుదశాబ్దాల పార్టీ కుదేలైందిలా...
ఏపీలో గతేడాది కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఏడాది పాలన ఆ పార్టీ నేతలకు ఏమాత్రం సంతృప్తి నిచ్చిందో పక్కనబెడితే విపక్ష టీడీపీని మాత్రం ఎన్నడూ లేనంత పతనావస్ధకు చేర్చింది. అధికార పార్టీపై పోరాటం దేవుడెరుగు, కనీసం ఉనికి కాపాడుకుంటే చాలనే పరిస్ధితి రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో కనిపిస్తుండటం నాలుగు దశాబ్దాల అనుభవమున్న టీడీపీతో పాటు అధినేత చంద్రబాబుకు సైతం పీడకలగా మారిపోతోంది.
చరిత్ర సృష్టించినా.. వివాదాలు కొని తెచ్చుకున్నా: మంచి సీఎం అయ్యారా: అదే జగన్ మార్క్ పాలన
వైసీపీ రాకతో బీసీలు దూరం....
గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రజంజనానికి ప్రధాన కారణాల్లో టీడీపీ పుట్టుక నుంచీ అండగా ఉంటున్న బీసీలు ఆ పార్టీకి దాదాపుగా దూరం కావడం కూడా ఒకటి. అది జగన్ పై నమ్మకమా, టీడీపీపై కోపమా అనేది పక్కనబెడితే బీసీలు దూరం కావడం టీడీపీ ఎప్పటికీ జీర్ణం చేసుకోలేని అంశమే. ఎన్నికల తర్వాత కూడా బీసీ వర్గాలు తిరిగి టీడీపీ వైపు చూడకుండా జగన్ సర్కారు చేపట్టిన చర్యలు ఆ పార్టీ ఓటు బ్యాంకును వైసీపీకి సుస్ధిరం చేస్తున్నాయి. శాశ్వత బీసీ కమిషన్, నామినేటెడ్ పదవులు, పనుల్లో రిజర్వేషన్లు వంటివి బీసీల్లో జగన్ ప్రభుత్వానికి మంచి మార్కులు వేయగా... టీడీపీకి ఇబ్బందికరంగా మారాయి.
ప్రాజెక్టులు, కాంట్రాక్టులూ దూరం....
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి చూసినా రాష్ట్రంలో భారీ ప్రాజెక్టులు, కాంట్రాక్టుల్లో టీడీపీకి ఆరంభం నుంచి అండగా ఉంటున్న కమ్మ సామాజిక వర్గానిదే పైచేయి. జగన్ రాకతో ఆ పరిస్దితి మారిపోయింది. రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాలతో ఒక్కో ప్రాజెక్టు నుంచి వారి ఆధిపత్యం చేజారిపోతోంది. పోలవరం, కృష్ణపట్నం వంటి ప్రాజెక్టులతో పాటు చిన్నాచితకా ప్రాజెక్టులు, కాంట్రాక్టుల్లోనూ దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
మద్యం షాపులు దూరం...
రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం వైపు వేస్తున్న అడుగుల వెనుక వైసీపీ సర్కారు బహుళ ప్రయోజనాలు పొందుతోంది. గతంలో రాష్ట్రంలో మద్యం దుకాణాల వేలంలో టీడీపీదే ఆధిపత్యం. పలు జిల్లాల్లో నేరుగా టీడీపీ నేతలు, లేదా వారికి సన్నిహితంగా ఉంటున్న ఇతర కులాల వారి చేతుల్లోనే మద్యం దుకాణాలు ఉండేవి. కానీ ప్రభుత్వం మద్య నిషేధం పేరుతో దుకాణాలన్నింటినీ స్వాధీనం చేసుకోవడంతో వాటిపై ఆదాయం, పట్టు అన్నీ టీడీపీ కోల్పోయింది. గతంలో మద్య నిషేధం విధించిన సమయంలోనూ ఇలాంటి పరిస్ధితి లేదని టీడీపీ నేతలే చెబుతున్నారు.
రియల్ ఎస్టేట్ కుదేలు...
ఏపీ వ్యాప్తంగా చేపడుతున్న భారీ ఇన్ ఫ్రా ప్రాజెక్టులతో పాటు అమరావతి రాజదానిలో చేపట్టిన పలు ప్రాజెక్టుల్లోనూ టీడీపీ నేతలు కానీ ఆ పార్టీకి అండగా ఉన్న కమ్మ సామాజిక వర్గానిదే ఆధిపత్యం. చివరికి రియల్ ఎస్టేట్ వెంచర్లలోనూ టీడీపీ నేతలదే ఆధిపత్యం. కానీ ఇప్పుడా పరిస్దితి లేదు. రాష్ట్రంలో ఏకైక రాజధానిగా ఉన్న అమరావతిని మూడు రాజదానులుగా విభజించడం, ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో రియల్ రంగం అనిశ్చితిలోకి జారిపోయింది. ఇప్పట్లో కోలుకునే పరిస్ధితి కూడా లేదు. అమరావతిలో అయితే పరిస్ధితి మరీ దారుణంగా ఉంది. కోట్ల రూపాయలు పెట్టి అమరావతిలో భూములు కొన్న టీడీపీ నేతలు లబోదిబోమంటున్నారు.
ఇసుక, మైనింగ్ కార్యకలాపాలు..
రాష్ట్రంలో ఇసుక తవ్వకాల కాంట్రాక్టులు, క్వారీలపై టీడీపీ నేతల ఆధిపత్యం ఉండేది. టీడీపీ హయాంలో ఇసుక తవ్వకాల ద్వారా ఆ పార్టీ నేతలు కోట్ల రూపాయలు అర్జించారు. కానీ ప్రభుత్వం ఇసుక క్వారీలను తమ ఆధీనంలోకి తీసుకుని నేరుగా విక్రయిస్తుండటంతో టీడీపీ నేతలు భారీగా ఆదాయాన్ని, పట్టునూ కోల్పోయారు. గతంలో ప్రభుత్వాలు మారినా ఇసుక విషయంలో కాస్తో కూస్తో ప్రయోజనాలు ఉండేవని, అధికార పార్టీ నేతలతో సన్నిహితంగా ఉంటే ఇబ్బందులు ఉండేవి కాదని, కానీ ఇప్పుడు అలాంటి పరిస్ధితి లేదని టీడీపీ నేతలు వాపోతున్నారు.
అమరావతి రాజధాని కల.....
జగన్ సర్కారు ప్రతిపాదిత మూడు రాజదానుల వల్ల టీడీపీ ప్రాయోజిత అమరావతి రాజధాని కలగానే మిగిలిపోనుంది. అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలన్న టీడీపీ ప్రయత్నాలకు వైసీపీ ప్రభుత్వం పూర్తిగా గండికొడుతోంది. ఇప్పటికే అమరావతి ప్రాజెక్టుల నుంచి సింగపూర్ తప్పుకోగా.. అక్కడ భూములు కొన్న టీడీపీ నేతలపై ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో సీబీఐ విచారణకు ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. అదే జరిగితే టీడీపీకి ఎన్నడూ ఊహించని భారీ షాక్ తప్పేలా లేదు. అలాగని అమరావతి రాజధానికి మద్దతివ్వాలని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కోరే పరిస్ధితి లేదు. మూడు రాజధానులతో టీడీపీకి ఆయా ప్రాంతాలతో మద్దతు కరవవుతోంది.
శాసన మండలి రద్దుతో ....
అసెంబ్లీ ఆమోదించిన మూడు రాజధానుల బిల్లులకు అడ్డుపడ్డ శాసనమండలి రద్దుకు వైసీపీ సర్కారు తీసుకున్న నిర్ణయం టీడీపీకి మరో శరాఘాతం కానుంది. మండలిలో 32 మంది సభ్యులతో మెజారిటీలో ఉన్న టీడీపీ.. వైసీపీ నిర్ణయంతో ఉన్న కాస్తో కూస్తో పదవులను కోల్పోనుంది. చంద్రబాబు తనయుడు లోకేష్ కూడా మాజీగా మారాల్సిన పరిస్ధితి. అసలే అధికారం లేకపోతే కనీసం పదవులైనా కావాలని కోరుకునే నేతలున్న నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీలంతా మాజీలుగా మారిపోతే వారిని వచ్చే నాలుగేళ్లపాటు బుజ్జగించడం చంద్రబాబుకు సాధ్యం కాని పరిస్ధితి.
ఎమ్మెల్యేల ఫిరాయింపులు...
151 సీట్ల భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ సుస్ధిర ప్రభుత్వం నడుపుతోంది. విపక్షాల పరిస్ధితి ఎన్నడూ లేనంత ఘోరంగా మారిపోయింది. ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని రాజీనామాలు చేయించాకే వైసీపీలోకి తీసుకుంటామని జగన్ హామీ కూడా ఇచ్చారు కాబట్టి తమకు ఎలాంటి ఇబ్బంది లేదని భావించిన టీడీపీకి ఇప్పుడు మిగిలిన ఎమ్మెల్యేలు 20 మందే. వీరిలోనూ ఏడుగురు ఫిరాయింపుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. నేరుగా వైసీపీలోకి ఫిరాయించకపోయినా ఆ పార్టీకి మద్దతునిస్తారు. అదే జరిగితే టీడీపీకి మిగిలే ఎమ్మెల్యేలు 13 మందే. దీంతో ఆ పార్టీ ప్రధాన విపక్ష హోదా కోల్పోతుంది. అటు చంద్రబాబు కూడా విపక్ష నేత హోదా కోల్పోవాల్సి వస్తుంది. ఈ పరిస్ధితి టీడీపీ కలలో కూడా ఊహించలేదు.