ఆగస్ట్ 15 వేడుకలపై జగన్ సంచలన నిర్ణయం .. అమరావతిలో కాకుండా అక్కడే ఎందుకంటే
Recommended Video
ఏపీ సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసి నెలన్నర అయిపోయింది. అయితే ఆయన ముఖ్యమంత్రి హోదాలో అధికారుల నుండి గౌరవ వందనం స్వీకరిస్తే చూడాలని తెగ ఎదురు చూస్తున్నారు వైసిపి నేతలు, జగన్ అభిమానులు. ఆగస్టు 15 వేడుకల సందర్భంగా నిర్వహించే జెండా ఆవిష్కరణ కార్యక్రమాలలో సీఎం జగన్ పాల్గొంటే వైసీపీ నేతల కోరిక తీరుతుంది. అయితే ఈసారి ఆగస్టు 15 వేడుకల పైన పార్టీ వర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అందుకు కారణం ఈసారి స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జరుపుకునే ఆగస్టు 15 వేడుకలు నిర్వహించేది అమరావతిలో కాదట..
తోలిసార్ సీఎం హోదాలో ఆగష్టు 15 వేడుకల్లో పాల్గొననున్న జగన్
సుదీర్ఘ పోరాటం తర్వాత అధికారాన్ని దక్కించుకొని ఏపీ ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన జగన్ పాలన సాగిస్తున్న తొలిరోజు నుండి అన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధినేతగా ఆగష్టు 15 వేడుకల్లో దశాబ్ద కాలంగా పాల్గొంటూనే ఉన్నారు జగన్ అయితే సీఎం హోదాలో మాత్రం తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జగన్ పాల్గొనబోతున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత నిర్వహించబోతున్న తొలి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది వైసిపి సర్కార్. అయితే ఈసారి నిర్వహించబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఏపీ రాజధాని అమరావతి లో కాదట.. సాగర తీరంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించాలని జగన్ సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఏపీ రాజధాని అమరావతిలో కాకుండా విశాఖ కేంద్రంగా ఆగష్టు 15 వేడుకలు
ఏపీ రాజధాని అమరావతి కాబట్టి సహజంగానే అమరావతి లోనే ప్రభుత్వం నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. జరగాలి .. కానీ ఏదో ఒక ప్రాంతానికే అభివృద్ధి పరిమితం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో పాటు అన్ని ప్రాంతాలు తమకు సమానమనే సందేశం ఇవ్వటానికే సాగర తీరంలో ఆగస్టు 15 వేడుకలు నిర్వహించాలని జగన్ ప్రభుత్వం భావిస్తోందట. అమరావతి మాత్రమే కాదు ఏపీ లోని అన్ని ప్రాంతాలు సమానమే అనే విషయం చెప్పడానికే వైసిపి సర్కారీ నిర్ణయం తీసుకుందని సెక్రటేరియట్ వర్గాలు చెబుతున్నాయని సమాచారం. ఇప్పటికే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించి విశాఖ జిల్లా అధికార యంత్రాంగం బిజీగా ఉందట . ఇప్పటికే సెక్రటేరియట్ వర్గాల నుండి ఆగస్టు 15కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమానికి ఏర్పాట్లు చేయవలసిందిగా జిల్లా యంత్రాంగానికి సమాచారం ఇచ్చారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆంధ్ర యూనివర్సిటీ లో ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ పరిశీలించిన అధికారులు
ఈసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగితే ప్రజలు భారీగా ప్రజలు హాజరవుతారు కాబట్టి అనుకూలంగా ఉండే స్థల పరిశీలన చేస్తున్నారు అధికారులు. విశాఖలో ప్రతి సంవత్సరం విశాఖ సిటీ లోని పోలీస్ బ్యారెక్స్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహిస్తారు.
కానీ ఈ సారి వైసిపి ప్రభుత్వం నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆంధ్ర యూనివర్సిటీ లో ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ ను వేదిక గా భావిస్తున్నారు జిల్లా అధికారులు. ఇప్పటికే జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తో పాటు జీవీఎంసీ అధికారులు స్థలాన్ని పరిశీలించారు. సీఎంతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు అలాగే భారీగా వచ్చే ప్రజల కోసం కోసం ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. గతంలో చంద్రబాబు కూడా ఒకసారి వైజాగ్ లో ఆగస్ట్ 15 వేడుకలు నిర్వహించారు. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటికి రెండు పర్యాయాలు వైజాగ్ వెళ్లారు. ఇక త్వరలో జీవీఎంసీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆగస్టు 15 వేడుకలు వైజాగ్ లో నిర్వహిస్తే పార్టీ శ్రేణుల్లో కూడా నూతనోత్సాహం నిండుతోందని, ప్రజల్లోకి ఒక సానుకూల సంకేతం వెళ్తుందని జగన్ భావిస్తున్నారని సమాచారం.
అన్ని ప్రాంతాలు సమానం అన్న విషయం తెలిపేందుకే జగన్ విశాఖ కేంద్రంగా ఆగష్టు 15 వేడుకల నిర్ణయం
ఇక ఈ నేపథ్యంలోనే అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తాం అనే భావన ఉత్తరాంధ్ర వాసులకు కలిగించడంతోపాటు, జీవీఎంసీ ఎన్నికలలో పార్టీ కేడర్ కు నూతనోత్సాహం కూడా నింపినట్టు అవుతుందని జగన్ వైజాగ్ లో ఆగస్టు 15 వేడుకలు నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం .
మరోపక్క రాజధాని అమరావతిలో భూ కుంభకోణం జరిగిందనే వైసీపీ ఆరోపణలు ఒక పక్క , ప్రపంచ బ్యాంకు రుణాలు ఇవ్వమని చేతులెత్తేసి అమరావతి నిర్మాణం పై నీలి నీడలు కమ్ముకున్న వేళ ఆగస్టు 15 వేడుకలు కూడా అమరావతిలో జరపకూడదని, వైజాగ్ కేంద్రంగా నిర్వహించాలని జగన్ తీసుకున్న నిర్ణయం అమరావతిపై జగన్ నిర్లిప్త వైఖరికి అద్దం పడుతుంది అనే భావన రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఏది ఏమైనప్పటికీ ప్రతి విషయంలోనూ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ జగన్ మాత్రం దూసుకుపోతున్నారు. ఎవరేమన్నా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటున్నారు. ఇక ఆగస్టు 15 వేడుకలను అమరావతిలో కాకుండా విశాఖ కేంద్రంగా నిర్వహించనున్నారు.