జగన్ నిశ్శబ్ద నిర్ణయాలు..! పక్క రాష్ట్రంలో ప్రకంపనలు..!!
Recommended Video
హైదరాబాద్ : 'వయసు చిన్నది.. బాధ్యత పెద్దది'.. జగన్ ప్రమాణ స్వీకారోత్సవ వేదికపై పెద్దరికంతో చంద్రశేఖర్ రావు అన్న మాట ఇది. టీఆర్ఎస్ పార్టీలోని సీనియర్లు, తెలంగాణలోని రాజకీయ పరిశీలకుల అంతర్గత చర్చల్లో తరచుగా ప్రస్తావనకొస్తున్న అంశమిది. అలా పదే పదే గుర్తుకు తెచ్చుకునేలా దూకుడు పెంచేశారు ఏపీ సీఎం జగన్. బరువు బాధ్యతలు మోయడానికి కావాల్సింది వయసు కాదు... అనుభవం కాదు. ఆలోచన... సమర్థత అన్నట్టుగా, తన ఆచరణతోనే సమాధానమిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే పాలనలో జగన్ దూసుకుపోతున్నారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
వయసు చిన్నదైనా పరిపక్వత పెద్దది..! మార్క్ చూపించుకుంటున్న జగన్..!!
వయసులో చిన్నోడు.. అనుభవం కూడా తక్కువే. మన మాట వింటాడు అని, చంద్రశేఖర్ రావు సహా అనేకమంది తెలంగాణ పెద్దలు అనుకున్నారట. కానీ, తాము ఏమాత్రం ఊహించని రీతిగా జగన్ పనితీరులో వేగం ఉందని, అతగాడి ప్లానింగ్, టైమింగ్ చూస్తుంటే.. చంద్రశేఖర్ రావు కు ముచ్చెమటలు పడుతున్నాయని టీఆర్ఎస్ పెద్దలు గుసగుసలాడుకుంటున్నారు. ఏపీ వ్యవహారాలతో, అక్కడి సీఎం స్పీడుతో మనకేమిటి సంబంధమని అనుకోవడానికి వీల్లేదు. కొన్ని నిర్ణయాలు, విధానాల ప్రభావం... తోటి తెలుగు రాష్ట్రాల మీద పరస్పరం ఎంతగానో పనిచేస్తుంటుంటుంది.
జగన్ నిర్ణయాలపై టీఆర్ఎస్ నజర్..! సంక్షేమంలో కేసీఆర్ కి గట్టి పోటీ ఇస్తున్న ఏపి సీఎం..!!
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దూకుడు నిర్ణయాలతో చంద్రశేఖర్ రావు మైలేజీ అందుకున్నారు. జనామోదం పొందారు. ఆయనకన్నా స్పీడుగా ఇప్పుడు జగన్ ముందుకెళుతున్నాడు. చంద్రశేఖర్ రావు మాదిరిగా హడావుడి ఏమాత్రం లేకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణలో చంద్రశేఖర్ రావు చేయలేని, చేయదల్చుకోని కొన్ని పెద్ద పెద్ద బాధ్యతలను వయసులో చిన్నోడైన జగన్ సునాయాసంగా చేసేస్తున్నారు. వాటిలో ప్రధానమైనది- ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇవ్వాలని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) ఎత్తివేయాలని తీసుకున్న నిర్ణయాలు.
తెలంగాణ పై జగన్ ప్రభావం..! అవాక్కవుతున్న కేసీఆర్..!!
పక్క రాష్ట్రం చేస్తున్న పనినే మీరెందుకు చేయడం లేదనే ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది, ఇప్పటికే వస్తున్నది కూడా. పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీని భారంగా ప్రభుత్వం భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో, దానిని ప్రభుత్వంలో విలీనం చేస్తుందా...? చేయకపోవచ్చు. ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇవ్వడానికి కూడా చంద్రశేఖర్ రావు సుముఖంగా లేరు. సీపీఎస్ ఎత్తివేసేందుకు కూడా సిద్ధంగా లేరు. ఈ మూడు వర్గాల నుంచి సీఎం చంద్రశేఖర్ రావు పై ఒత్తిడి వస్తోంది. పోనీ, ఏపీలో చేశారు కాబట్టి, మనం కూడ చేయకపోతే బాగుండని అనుకుని, నిర్ణయాలు తీసుకున్నారనే అనుకుందాం. అప్పుడు, ఆంధ్రా సీఎం బాటలో తెలంగాణ సీఎం నడుచుకుంటున్నారు అనే మాట వస్తుంది. తీసుకున్న నిర్ణయాలపై సానుకూలత కన్నా కూడా, ఈ ఫాలోయింగ్ కామెంట్లు, వాటి ప్రభావం... ఫలితం... పర్యవసానాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే, జగన్ దూకుడుతో చంద్రశేఖర్ రావుకు ముచ్చెమటలు పడుతున్నాయని టీఆర్ఎస్ సీనియర్లు, రాజకీయ పరిశీలకులు గుసగుసలాడుకుంటున్నారు.
జగన్ సాహసోపేత నిర్ణయాలు..! కేసీఆర్ పై ఒత్తిడి పెంచే అవకాశాలు..!!
అన్ని వర్గాలను సంతృప్తిపరిచే నిర్ణయాలతో తెలంగాణ సీఎం చంద్ర శేఖర్ రావుకు, జగన్ ఇంకెన్ని తల నొప్పులు తెచ్చిపెడతారో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు పార్టీ శ్రేణులు. అందుకే, ఇప్పుడు చంద్రశేఖర్ రావు, జగన్ ఏం చేస్తున్నారు...? ఏ రోజున ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు...? దాని ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై ఎలా ఉండబోతోంది...? అని, ఆసక్తిగా, ఆందోళనగా ఎదురుచూస్తున్నారట. అంతే కాకుండా చంద్రశేఖర్ రావు ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో... అడిగిన వారికి, అడగని వారికి వరాలిచ్చేశారు. ఇప్పటివరకు చిన్నవీ, పెద్దవీ కలిపి దాదాపుగా వందకు పైగా హామీలు ఇచ్చేశారు. వాటిలో ఎన్నింటిని, ఏ మేరకు అమలు చేశారో తెలుసు. చంద్రశేఖర్ రావు, జగన్ నిర్ణయాలలో ఒక్క సామీప్యం కనిపిస్తోంది.