లాక్ డౌన్ లో వైసీపీ ఎమ్మెల్యేల హంగామా వెనుక జగన్ బిగ్ స్కెచ్ ... మాస్టర్ ప్లాన్ లో భాగమేనా !
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. అయితే ఇదంతా సామాన్య ప్రజలకు, విపక్ష పార్టీల నేతలకు మాత్రమే. అధికార వైసీపీ నేతలకు ఇవేవీ వర్తించవు.. ఇప్పటివరకూ కనీసం డజనుకు పైగా ఎమ్మెల్యేలు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి జనంలో విచ్చలవిడిగా పర్యటనలు చేస్తున్నారు. అయితే విపక్ష నేతలు ఇళ్లకే పరిమితమైన వేళ వీరి హడావిడి పర్యటనలు చూస్తుంటే దీని వెనుక ఏదో జరగబోతోందని తెలుస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం...
వైసీపీ ఎమ్మెల్యేల హంగామా...
ఏపీలో ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్నా వైసీపీ ఎమ్మెల్యేలు అవేవీ పట్టించుకోకుండా తమ పర్యటనలు, ప్రారంభోత్సవాలు, నిత్యావసరాల పంపిణీతో పాటు స్ధానిక కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నారు. ఈ జాబితాలో పలమనేరు ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ, నగరి ఎమ్మెల్యే రోజా, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ, పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుతో పాటు మరికొందరు ఉన్నారు. వీరంతా ఇప్పటివరకూ ఏదో ఒక కార్యక్రమంతో లాక్ డౌన్ ఉల్లంఘించి రోడ్లపైకి రావడం తమదైన శైలిలో సమర్ధించుకోవడం జరిగిపోయింది.
జగన్ మౌనమే కారణమా ?
లాక్ డౌన్ ప్రకటిచిన కొత్తలో బయటికి రావాలంటే సాధారణ ప్రజలే కాదు ఎమ్మెల్యేలు సైతం భయపడ్డారు. ఎప్పుడైతే మాస్కులు, ఇతర కిట్లు చేతికొచ్చాయో అప్పటి నుంచి విచ్చలవిడిగా రోడ్లపైకి రావడం మొదలుపెట్టేశారు. దీనికి అధినేత జగన్ మౌనం కూడా్ ఓ కారణంగా తెలుస్తోంది. ఇప్పటివరకూ ప్రజలను ఇళ్ల నుంచి బయటికి రావొద్దని కోరిన జగన్... తన ఎమ్మెల్యేలకు మాత్రం ఈ మాట ఎందుకో చెప్పలేకపోతున్నారు. దీంతో ఇదే అలుసుగా వీరంతా రోడ్లపైకి వస్తున్నారు. వీరు బయటికి వచ్చాక స్ధానికంగా కేసుల సంఖ్య పెరగడం ప్రాధాన్యంగా మారింది.
అసలు ప్లాన్ స్ధానిక ఎన్నికలేనా ?
లాక్ డౌన్ వేళ వైసీపీ ఎమ్మెల్యేల వరుస పర్యటనలు, మార్కెట్లలో హంగామాలు, ప్రారంభోత్సవాల వెనుక అసలు కారణం స్ధానిక ఎన్నికలే. సగంలో వాయిదా పడిన స్ధానిక ఎన్నికలను కరోనా తగ్గగానే వెంటనే నిర్వహించేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారు. అదే జరిగితే తాము సిద్దంగా లేకపోతే, ప్రజలను సన్నద్ధం చేయకపోతే తగిన ఫలితాలు రావు. అదే సమయంలో ఎన్నికల్లో వైసీపీ గెలవకపోతే పదవులు ఊడతాయని జగన్ ఎలాగో టార్గెట్ పెట్టారు. అందుకే నిత్యం ప్రజల్లో తిరిగేందుకు వీరంతా కారణాలు వెతుక్కుంటున్నారు. అధిష్టానం పెద్దల్లో ఒకరైన ఎంపీ విజయసాయిరెడ్డి స్వయంగా విశాఖలో తిరుగుతుండగా.. తాము తిరిగితే తప్పేంటనే భావన వీరిలో కనిపిస్తోంది
Recommended Video
విపక్షాలకు కూడా చెక్...
కరోనా వ్యాప్తి పేరుతో లాక్ డౌన్ విధించాక నిత్యావసరా పంపిణీ పేరుతో రోడ్లపైకి వచ్చిన విపక్ష టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు నచ్చజెప్పి ఇళ్లకు పంపేశారు. ఆ తర్వాత కూడా బయటికి వస్తే కేసులు పెడతామని హెచ్చరికలు చేస్తున్నారు. దీంతో వీరంతా తప్పనిసరిగా ఇళ్లకే పరిమితమవుతున్నారు. అదే సమయంలో వైసీపీ నేతలు మాత్రం జనంలో తిరుగుతూ ఎంచక్కా ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో టీడీపీ నేతలకు కక్కలేని, మింగలేని పరిస్ధితి ఎదురవుతోంది. కానీ వైసీపీ ఎమ్మెల్యేలకు మాత్రం మంచి అవకాశంగా మారింది. ఈ నాలుగు రోజులు జాగ్రత్తగా ప్రచారం చేసుకుంటే స్ధానిక పోరు గట్టెక్కవచ్చన్న భావన వీరిలో కనిపిస్తోంది.