జగన్ టార్గెట్ తో మంత్రుల ఉక్కిరిబిక్కిరి- స్ధానిక పోరులో టీడీపీపై దాడులకు కారణమిదేనా ?
ఏపీలో స్ధానిక ఎన్నికల పోరు హింసాత్మకంగా మారుతోంది. స్ధానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం జగన్ ఓడితే పదవులు కోల్పోతారంటూ మంత్రులు, నేతలకు పెట్టిన టార్గెట్ ఇప్పుడు వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. దీంతో విపక్షాన్ని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు పలుచోట్ల ఏకంగా దాడులకు దిగుతున్నారు. వైసీపీ దాడులను అడ్డుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీ సవాంగ్ కు లేఖ రాశారు.
ఏపీలో హింసాత్మకంగా స్ధానిక పోరు
ఏపీలో గతంలో స్ధానిక ఎన్నికల సమయంలో గ్రామాల్లో పాతకక్షల కారణంగా దాడులు చేసుకునే వారు లేదా ప్రత్యర్ధి బలంగా ఉన్నప్పుడు ఓడిపోతామనే భయంతో దాడులకు దిగేవారు. ఇప్పుడు ఈ రెండో అంశం గ్రామాలు దాటి పట్టణాలు నగరాలకు విస్తరించింది. గతేడాది 151 సీట్లతో అసెంబ్లీ పోరును గెలిచిన వైసీపీ ఇప్పుడు స్ధానిక పోరులో క్లీన్ స్వీప్ కోసం తహతహలాడుతోంది. ఇందుకోసం ప్రత్యర్ధి పార్టీల నేతలను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, వారిపై దాడులు చేస్తోంది.
జగన్ టార్గెట్ వల్లేనా
ఏపీలో గతేడాది అసెంబ్లీ ఎన్నికల ఫీట్ ను రిపీట్ చేయాలనుకుంటున్న సీఎం జగన్ తన మంత్రులకు, పార్టీ నేతలకు భారీ టార్గెటే పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి టీడీపీ ప్రభుత్వంపై ఉన్న ప్రజావ్యతిరేకతకూ, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతకూ పోలిక లేకున్నా అసెంబ్లీ తరహాలో క్లీన్ స్వీప్ అంటే సాధ్యం కాని పని. అయితే దీన్ని సుసాధ్యం చేసే క్రమంలో మంత్రులు, నేతలకు జగన్ పెట్టిన టార్గెట్ ఇప్పుడు వారికి చెమటలు పట్టిస్తోంది. దీంతో వారు టీడీపీ నేతలను నామినేషన్లు కూడా వేయకుండా అడ్డుకుంటున్న పరిస్ధితి కనిపిస్తోంది.
మంత్రుల వ్యూహం ఫలిస్తుందా
క్షేత్రస్ధాయిలో విపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన నేతలను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం ద్వారా ఎన్నికలను ఏకపక్షం చేయాలని వైసీపీ మంత్రులు భావిస్తున్న అదంత సులువుగా కనిపించడం లేదు. పైపెచ్చు దాడులతో విపక్షాలపై ఓటర్లపై సానుభూతి పెరిగే అవకాశాలే మెండుగా ఉన్నాయి. ప్రభుత్వ విధానాల విషయంలో ప్రజా తీర్పుకు అవకాశం ఇవ్వకుండా కేవలం దాడులతోనే ఎన్నికల్లో భయభ్రాంతులను చేయాలని చూస్తే వారు తిరగబడే ప్రమాదం కూడా ఉంటుంది. అది అంతిమంగా వైసీపీకే నష్టం చేకూర్చవచ్చు.
ఓవైపు చేరికలు- మరోవైపు దాడులు
స్ధానిక ఎన్నికల నేపథ్యంలో ఓవైపు విపక్ష టీడీపీ నేతలను పార్టీలో చేర్చుకుంటూనే మరోవైపు పార్టీలో చేరని వారిపై దాడులకు వైసీపీ నేతలు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పల్నాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. చాలా సందర్భాల్లో స్ధానిక పోరు ముసుగులో దాడులకు భయపడే టీడీపీ నేతలు వైసీపీకి క్యూ కడుతున్నారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో స్ధానిక పోరు కూడా అసెంబ్లీ తరహాలోనే రసవత్తరంగా మారే పరిస్ధితులు కనిపిస్తున్నాయి.
Recommended Video
గెలుపే టార్గెట్ అంటున్న జగన్
స్ధానిక పోరులో గెలవకపోతే పదవులు పోగొట్టుకోవడం ఖాయమని కేబినెట్ లోనే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసిన సీఎం జగన్ దాన్ని కచ్చితంగా అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలాగో మండలి సభ్యులుగా ఉన్న ఇద్దరు మంత్రులు రాజ్యసభకు వెళ్తున్న నేపథ్యంలో రెండు స్ధానాలు ఖాళీ అవుతాయి. స్ధానిక పోరులో వెనుకబడితే సదరు మంత్రులను కూడా ఇంటికి పంపి వారి స్ధానంలో కేబినెట్ ప్రక్షాళన ఉంటుందని వైసీపీ పెద్దలు చెబుతున్నారు.