తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జగన్ .. ఈ రోజు జగన్ షెడ్యూల్ ఇలా
Recommended Video
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీకి కాబోయే సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠ క్యూ కాంపెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామి వారిని దర్శించుకున్నారు. ఏపీలో కాబోయే సీఎం వైయస్ జగన్ కు ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామీ వారిని దర్శించుకున్న అనంతరం కడప వెళ్లనున్నారు జగన్.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జగన్ .. ప్రత్యేక పూజలు1
వైయస్ జగన్ వెంట వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, రోజా, అవంతి శ్రీనివాస్ లు తిరుమలలో స్వామి వారిని దర్శించుకున్నారు .జగన్ తో పాటు ఎమ్మెల్యేలు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు సైతం శ్రీవారిని దర్శించుకున్నారు. వైయస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర పాదయాత్ర చేపట్టబోయే ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే ప్రజాసంకల్పయాత్ర ముగింపు అనంతరం వైయస్ జగన్మోహన్ రెడ్డి కాలినడకన స్వామి వారిని దర్శించుకున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న తరుణంలో మరోసారి స్వామివారిని దర్శించుకున్నారు.
కడపలో పలు కార్యక్రమాలలో పాల్గొననున్న జగన్ .. కడప దర్గాలో, సీఎస్ ఐ చర్చిలో ప్రార్ధనలు
శ్రీవారి దర్శనం అనంతరం వైయస్ జగన్ కడప జిల్లా వెళ్లనున్నారు. కడపలో పలు కార్యక్రమాల్లో జగన్ పాల్గొననున్నారు. కడపలోని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చెయ్యనున్నారు జగన్ . అనంతరం పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్నారు . అలాగే గండి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు .
వైఎస్ఆర్ ఘాట్ లో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించనున్న జగన్
తర్వాత ఇడుపులపాయలోని వైఎస్ ఆర్ ఘాట్ లో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు. రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యనున్న తరుణంలో ఆయన తన తండ్రి సమాధిని సందర్శించనున్నారు. ఆ తర్వాత సాయంత్రానికి తాడేపల్లిలోని స్వగృహానికి చేరుకోనున్నారు. ఇక గురువారం మధ్యాహ్నాం 12.23 నిమిషాలకు వైయస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చెయ్యనున్నారు . జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న తరుణంలోఅన్ని మతాలకు ప్రాధాన్యతనిస్తూ సర్వమత ప్రార్థనలు చెయ్యనున్నారు.