భారతిపై ఛార్జీషీట్లో ట్విస్ట్!: 'ఈడీ ఉద్యోగులు టీడీపీ నేతల బంధువులు', మోడీని లాగిన తమ్మినేని
హైదరాబాద్/అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి పేరును ఈడీ ఛార్జీషీట్లో దాఖలు చేయడంపై తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలకు ఈడీ అధికారులు బంధువులు అని ఆరోపించారు. జగన్ను ఇరికించి ఆయన అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.
Recommended Video
అక్రమాస్తుల కేసులో ముద్దాయిగా భారతి పేరు: ఇంత దారుణమా... షాకైన జగన్
ఈడీ అధికారులను టీడీపీ తన చెప్పుచేతల్లో ఉంచుకుంటోందని తమ్మినేని అన్నారు. ఈడీతో టీడీపీ నాయకులు కలిసి పని చేస్తున్నారని ఆరోపించారు. ఈడీ ఉద్యోగులు టీడీపీ నాయకులకు బంధువులను సంచలన ఆరోపణలు చేశారు. ఏడేళ్ల తర్వాత ఈడీ వైసీపీ అధినేత వైయస్ జగన్ సతీమణి భారతిని ముద్దాయిగా చూపడం సరికాదన్నారు.
మోడీ సమాధానం చెప్పాలి
జగన్ మానసిక స్థైర్యం దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని తమ్మినేని ఆరోపించారు. జగన్ను కేసుల్లో ఇరికించి అడ్డు తొలగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఏడేళ్ల తర్వాత భారతి పేరును ఛార్జీషీటులో ఎలా చేరుస్తారో ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలోనే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్లో విలీనం అవుతుందని జోస్యం చెప్పారు. భారతి పేరు ఈడీ ఛార్జీషీటులో రావడంపై జగన్ కూడా ఆశ్చర్యపోయిన విషయం తెలిసిందే.
భారతి పేరుపై గతంలో ప్రచారం
కాగా, జగన్ అక్రమాస్తుల కేసులో భారతిపై తొలిసారి అభియోగాలు నమోదయ్యాయి. భారతి సిమెంట్స్లో క్విడ్ ప్రోకో పద్ధతిలో జరిగిన పెట్టుబడుల వ్యవహారంలో జగన్తో పాటు భారతిని కూడా నిందితురాలిగా చేరుస్తూ ఈడీ సీబీఐ ప్రత్యేక కోర్టులో ఛార్జీషీటు దాఖలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. భారతి సిమెంట్స్లో పెట్టుబడులపై సీబీఐ మూడు ఛార్జీషీట్లు దాఖలు చేసింది. కానీ భారతి పేరును సీబీఐ పేర్కొనలేదు. కానీ ఈడీ ఆమెను నిందితురాలిగా చేరుస్తారని గతంలోను ప్రచారం సాగింది. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద ఈ ఛార్జీషీటును ఈడీ దాఖలు చేసింది.
భారతిపై అభియోగాలు
కడప జిల్లా ఎర్రగుంట్ల, కమలాపురంల మధ్య దాదాపు 1400 లక్షల టన్నుల సున్నపురాయి నిల్వలు, భూగర్భజలాలు ఉన్నాయి. దగ్గరలోనే ముంబై - చెన్నై రైల్వే లోన్ ఉంది. ఈ ప్రాంతంలో సీ రామచంద్రయ్య.. రఘరాం సిమెంట్స్ ఏర్పాటు చేసుకున్నారు. దీనిని జగన్ టేకోవర్ చేసి భారతి సిమెంట్స్గా మార్చారు. ఇక్కడి ఖనిజ నిక్షేపాల అన్వేషణకు, అధ్యయనం, మైనింగ్కు అంబుజా సిమెంట్స్కు ప్రాస్పెక్టింగ్ లీజును ఇచ్చారు. ఆ తర్వాత దానిని పక్కన పెట్టి భారతి సిమెంట్స్కు రెండువేలకు పైగా ఎకరాల సున్నపురాయి గనుల ప్రాంతాన్ని లీజుకు ఇచ్చారు. దీనిపై అభియోగాలు ఉన్నాయి.
ఈ ఆధారంగా ఛార్జీషీటు
వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓబీసీ బ్యాంకు అధికారులు.. జగన్ నివాసానికి వెళ్లి భారతి సిమెంట్స్ కోసం రూ.200 కోట్ల టర్మ రుణాన్ని మంజూరు చేశారు. ఈ వ్యవహారంలో నాడు ఓబీసీ నామినీ డైరెక్టర్గా ఉన్న విజయసాయి రెడ్డి ఈ రుణం మంజూరులో కీలక పాత్ర పోషించారు. భారతి సిమెంట్స్ ద్వారా జగన్ రూ.5వేలకు పైగా కోట్లు పొందినట్లు సీబీఐ తన ఛార్జీషీటులో పేర్కొంది. దీని ఆధారంగా ఈడీ దర్యాఫ్తు చేపట్టి ఛార్జీషీట్ దాఖలు చేసింది.