కాంగ్రెస్ ఖతం: బిజెపితో జగన్ సై, రేపే కొత్త సిఎం: డిఎల్
న్యూఢిల్లీ/హైదరాబాద్: పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును వ్యతిరేకిస్తే తాము గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకైనా వచ్చే ఎన్నికల అనంతరం మద్దతిస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం న్యూఢిల్లీలో అన్నారు.
సమైక్యాంధ్ర కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తోంది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. బిజెపి బిల్లును వ్యతిరేకిస్తే మోడీకైనా మద్దతిచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెసు పార్టీ ఖతమైపోయినట్లేనని వ్యాఖ్యానించారు.
డిఎల్ సంచలన వ్యాఖ్య
మాజీ మంత్రి, మైదుకూరు శాసన సభ్యులు డిఎల్ రవీంద్రా రెడ్డి సోమవారం కడప జిల్లాలో సంచలన వ్యాఖ్య చేశారు. రేపటిలోగా రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి వస్తాడన్నారు.
కొత్త పార్టీ పెట్టినా వెళ్లరు: కొండ్రు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టినా కాంగ్రెసు నేతలు ఎవరు ఆ పార్టీలోకి వెళ్లరని మంత్రులు కొండ్రు మురళి, బాలరాజులు ధ్వజమెత్తారు. పార్టీలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ పెట్టాలని చూడటమేమిటన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వీడితేప్రజలు ఛీ కొడతారన్నారు. సాయంత్రం జరిగే సమావేశంలో తాము అన్ని అంశాలను చర్చిస్తామని చెప్పారు.