వాలంటీర్ల వ్వవస్థ రికార్డ్ అంటున్న సీఎం.. మరి ఎంపిక ప్రక్రియలో లోపాల మాటేంటీ ??
అమరావతి : పల్లెలే పట్టుగొమ్మలు, దేశ ప్రగతికి దిక్సూచి అన్న నానుడిని నిజం చేస్తున్నాయి ప్రభుత్వాలు. స్థానిక పరిపాలన కోసం ప్రాధాన్యం ఇస్తూ ముందడుగు వేస్తున్నాయి. ఏపీలో సీఎం జగన్ కూడా గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల నియామకం తీసుకొస్తున్నారు. ప్రభుత్వం ప్రతిస్టాత్మకంగా చేపట్టిన ఈ పథకంతో నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తోందని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఎంపిక ప్రక్రియలో మాత్రం లోపాలు ఉన్నట్టు విమర్శలు వస్తున్నాయి.
యువతకు ఉపాధి ..
గ్రామ సచివాలయాలు, అందులో పనిచేసే వాలంటీర్లు ప్రజలకు ప్రభుత్వ సేవలను అందిస్తారు. వివిధ పథకాలను లబ్ధిదారులకు చేరుస్తారు. వారికి సంక్షేమ ఫలాలు అందించడమే వీరి విధి. అయితే ఇందుకోసం లక్షా 33 వేల 394 మందిని నియమిస్తామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాదు 4.01 లక్షల ఉద్యోగాలు కల్పిస్తునన్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. అంతేకాదు ఇదో చరిత్ర అని .. పరిపాలనలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతున్నామని ట్వీట్ చేశారు.
వాస్తవం విరుద్ధం ..
వాలంటీర్లపై ఏపీ సీఎం జగన్ ఇలా చెప్తుంటే ఎంపిక ప్రక్రియ మాత్రం విమర్శలకు తావిస్తోంది. వాలంటీర్ ఎంపిక తీరుపై అభ్యర్థులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 23 వరకు ఎంపిక ప్రక్రియ జరగాల్సి ఉంది. కానీ ఇప్పటికే వాలంటీర్లను నియామకం పూర్తైనట్టు ప్రచారం సాగుతుంది. అంతేకాదు ఇంటర్వ్యూ చేస్తున్న అధికారులు అభ్యర్థులకు మార్కులు వేయడానికి పెన్సిల్ ఉపయోగిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఆ మార్కుల ఆధారంగానే ఎంపిక చేపడుతామని అధికారులు చెప్తుండగా .. ఆయా పంచాయతీల్లో వాలంటీర్లుగా నియమించేవారిని ఎమ్మెల్యేలే ఫైనల్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్యేలు జాబితా రూపొందించి మండలస్థాయి అధికారులకు అందజేశారని .. ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్వ్యూ మొక్కుబడేనని గుసగుసలు వినిపిస్తున్నాయి.
లోపాలివీ ..
వాస్తవానికి 23వ తేదీ ఇంటర్వ్యూకు డెడ్ లైన్ .. కానీ అనివార్య కారణాల వల్ల హాజరుకాకపోతే 25వ తేదీని ఇంటర్వ్యూ చేస్తామని అధికారులు తెలిపారు. అయితే ఆయా అభ్యర్థులకు వేసే మార్కులే కీలకం. అయితే ముగ్గురు అధికారులు విడిగా మార్కులు వేస్తే .. వాటి యావరేజ్ మార్కులు వారికి తుది మార్కులుగా నమోదవుతాయి. అయితే కొన్ని మండలాల్లో ఒక్క అధికారే మార్కులు వేస్తుండగా .. మరికొన్ని మండలాల్లో కొందరు పెన్నుతో వేస్తున్నారు. అయితే కొన్నిచోట్ల ఎంపీడీవవో, తహశీల్దార్, ఈవోపీఆర్డీవో నేతృత్వంలో కమిటీలు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. మరో కొన్నిచోట్ల దిగువస్థాయి అధికారులు, ప్రధానోపాధ్యాయులతో కమిటీలు ఏర్పాటుచేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. దీంతో ఎంపిక ప్రక్రియపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వాలంటీర్ల ఎంపికపై తుది నిర్ణయం ఎంపీడీవోలదేనని జిల్లా పంచాయతీ అధికారి చెప్తున్నారు. ఇంటర్వ్యూలు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని, తుది ఎంపిక కూడా పారదర్శకంగానే ఉంటుందని చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో జరిగే అంశాలపై మాత్రం క్లారిటీ రావడం లేదు. దీంతో ఎంపిక ప్రక్రియపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.