వైఎస్ జగన్ రెండురోజులు అక్కడే : ప్రధానిని తప్ప: అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రులతో!
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హస్తిన పర్యటన మరి కొన్ని గంటల్లో ఆరంభం కానుంది. రెండురోజుల పాటు ఆయన దేశ రాజధానిలోనే ఉంటారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆయన పలువురు కేంద్రమంత్రులతో సమావేశం కానున్నారు. 2014 నాటి రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలు, పునర్విభజన చట్టం అమలు, అందులో పొందుపరిచిన హామీలను అమలు చేయాలని కోరుతూ వైఎస్ జగన్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఈ మధ్యాహ్నమే అమిత్ షాతో వైఎస్ జగన్ సమావేశమౌతారు.
ఈ ఉదయం 10 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో వైఎస్ జగన్ పాల్గొంటారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే ఆయన అక్కడి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి వెళ్తారు. ప్రత్యేక విమానంలో దేశ రాజధానికి బయలుదేరి వెళ్తారు. ఈ పర్యటన సందర్భంగా వైఎస్ జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మినహాయించి, పలువురు కేంద్రమంత్రులను కలుస్తారు. కొద్దిరోజుల కిందటే ఆయన ఢిల్లీకి వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లోనే అమిత్ షాతో వైఎస్ జగన్ భేటీ కావాల్సి ఉంది.
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉన్నందున.. అమిత్ షా అపాయింట్ మెంట్ వైఎస్ జగన్ కు లభించలేదు. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సోమవారం నిర్వహిస్తున్నందున అమిత్ షా అపాయింట్ మెంట్ అదే రోజు దొరికింది. దీనితో వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లాల్సి వస్తోంది. అమిత్ షా సహా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే, ఓడ రేవులు, జలవనరులు వంటి శాఖలను పర్యవేక్షిస్తోన్న మంత్రులను ఆయన కలుసుకోనున్నారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను మరోసారి వారి దృష్టికి తీసుకెళ్లనున్నారు.
ఢిల్లీకి సీఎం జగన్: అమిత్ షాతో భేటీ :కేంద్ర మంత్రులతోనూ సమావేశం..!
తన ఢిల్లీ పర్యటన ముగించుకుని వైఎస్ జగన్ మంగళవారం సాయంత్రం రాష్ట్రానికి తిరిగి రానున్నారు. షెడ్యూల్ ప్రకారం.. సాయంత్రం 7 గంటలకు ఆయన ఢిల్లీ నుంచి విశాఖపట్నానికి వస్తారు. పార్టీకి చెందిన అరకు లోక్ సభ సభ్యురాలు గొడ్డేటి మాధవి, శివప్రసాద్ వివాహ రిసెప్షన్ కు వెళ్తారు. ఆమె గొలుగొండ మండలం కృష్ణదేవీపేటకు చెందిన కునిరెడ్డి శివప్రసాద్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కొయ్యూరు మండలం శరభన్నపాలెంలోని మాధవి స్వగృహంలో ఈ వివాహం జరిగింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు, నర్సీపట్నం ఎమ్మెల్యేలు ఉమాశంకర్ గణేష్, ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.