చేనేతపై జగన్ సంచలన నిర్ణయం .. నవంబర్ 1 నుండి ఆన్లైన్ లో చేనేత అమ్మకాలు
చేనేత కార్మికులకు చేయూతను అందించడానికి, చేనేత కార్మికులు చేసిన ఉత్పత్తులను విక్రయించడానికి సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం మారుతున్న పరిస్థితులను బట్టి కాలానుగుణంగా చేనేత ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి ఏపీలోని చేనేత ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
చంద్రబాబుని జైలుకు పంపే ప్రయత్నాల్లో జగన్ ... జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
మార్కెటింగ్ సమస్య పరిష్కారం కోసం ఆన్లైన్ అమ్మకాలు
చేనేత వస్త్రాలకు సరైన మార్కెటింగ్ లేక డిమాండ్ పడిపోతున్న నేపథ్యంలో, కచ్చితంగా మార్కెటింగ్లో దూసుకుపోతే చేనేత పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని భావించి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లతో ఒప్పందం చేసుకొని నవంబర్ 1 నుండి ఆన్లైన్ లో చేనేత వస్త్రాలను విక్రయించాలని నిర్ణయం తీసుకుంది వైసీపీ ప్రభుత్వం. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ‘వైఎస్ఆర్ చేనేత నేస్తం' పేరుతో ఏటా రూ. 24 వేల సాయం అందించేందుకు కూడా చర్యలు చేపట్టారు.
‘వైఎస్ఆర్ చేనేత నేస్తం' పథకం ద్వారా 24 వేల రూపాయల సాయం
ఎన్నికల ముందు చేనేత రంగం అభివృద్ధికి సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు ‘వైఎస్ఆర్ చేనేత నేస్తం' పథకం ద్వారా ప్రతి సంవత్సరం రూ. 24 వేలు సాయం చేనేత కార్మికులకు ఏపీ ప్రభుత్వం అందించనుంది. అంతేకాకుండా అమెజాన్- ఫ్లిప్ కార్ట్ కంపెనీలతో ఆన్లైన్ ద్వారా చేనేత వస్త్రాల అమ్మకానికి ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. నవంబర్ 1వ తేదీ నుంచే అమ్మకాలు సైతం ప్రారంభంకానున్నాయి.
అమెజాన్ , ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలతో ఈ మార్కెటింగ్ కు ఒప్పందం
ఇక చేనేత రంగాన్ని ప్రోత్సహించడానికి అతి పెద్ద సమస్యగా ఉన్న మార్కెటింగ్ పై సైతం దృష్టిసారించిన జగన్ దేశవిదేశాలకు చేనేత ఉత్పత్తులను అందుబాటులో ఉంచేందుకు ఆన్లైన్ మార్కెటింగ్ నిర్ణయాన్ని తీసుకున్నారు. అందరికీ అందుబాటులో ఉండేలా, ఎవరైనా ఎక్కడి నుంచి అయినా కొనుగోలు చేసేలా, పటిష్టమైన మార్కెటింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. తద్వారా చేనేత కార్మికులకు లబ్ది చేకూరేలా చెయ్యాలని ఆలోచించిన సీఎం జగన్ ఆన్లైన్ వ్యాపారం లో దిగ్గజ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకొని ఆన్లైన్ మార్కెటింగ్ లోకి చేనేత పరిశ్రమను దింపనున్నారు.
తొలిదశలో 25 ఉత్పత్తుల విక్రయం ... నవంబర్ 1 నుండే
ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి పట్టు చీరల నుంచి, చొక్కాలు, పంచెల వరకు అన్ని రకాల నాణ్యమైన చేనేత వస్త్రాలన్నీ ఇకపై ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసేలా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకుని,చేనేత సహకార సంఘాల నుంచి వస్త్రాలను ఆప్కో కొనుగోలు చేసి ఆన్లైన్ ద్వారా అమ్మకాలు చేయనుంది. నవంబర్ 1 నుంచి ఈ సేల్స్ ప్రారంభంకానున్నాయి. తొలిదశలో 25 ఉత్పత్తులను అమెజాన్ ద్వారా విక్రయించనున్నారు. నవంబర్ చివరి వారం నుంచి ఫ్లిప్ కార్ట్లోనూ చేనేత వస్త్రాలు అందుబాటులోకి వస్తాయి.
ధరలపై కూడా ప్రత్యేకమైన దృష్టి
అలాగే ధరల విషయంలోనూ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. మధ్యతరగతి వారికి కూడా అందుబాటులో ఉండే విధంగా రూ.500 నుంచి కూడా చేనేత వస్త్రాలు అందుబాటులో ఉంటాయి. ఇక మాక్సిమం రూ.20,000 వరకు ధరలు ఉంటాయని తెలిపింది ప్రభుత్వం. చేనేత కార్మికులు ఉత్పత్తి చేసిన చేనేత వస్త్రాలను ఈ మార్కెటింగ్ చేయడం ద్వారా చేనేత పరిశ్రమకు ప్రపంచవ్యాప్త గుర్తింపు వస్తుందని, అలాగే చేనేత పరిశ్రమ కు అతి పెద్ద సమస్య గా ఉన్న మార్కెటింగ్ సమస్య పరిష్కారం అవుతుందని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.