పెన్షన్ల పెంపు.. రూపాయి జీతం: రాజధాని పైన విచారణ..: జగన్ తొలి ప్రసంగంలో ఇలా..!
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వేల సంచలన ప్రకటనలు చేయనున్నారు. తనను అధికారంలోకి తెచ్చిన నవరత్నాలకు ప్రాధాన్యత ఇస్తూ విశ్వసనీయత చాటుకుంటూనే..పాలనలో విప్లవాత్మక నిర్ణయాల దిశగా జగన్ ప్రసంగం ఉండనుంది. తన ప్రమాణ స్వీకార వేదికగా ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి హోదాలో చేయబోయే తొలి ప్రసంగం పైన రాజకీయ పార్టీలే కాకుండా..సామాన్య ప్రజలు సైతం ఆసక్తితో ఉన్నారు.
పాదచారికి పట్టాభిషేకం..ఇలా : ఇప్పటికే చేరుకున్న అభిమానులు: తరలి వస్తున్న ప్రముఖులు వీరే..!
విశ్వసనీయతకు పట్టం..నవరత్నాలతో
తనను గెలిపించిన నవ రత్నాల అమలుకు జగన్ ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి హోదాలో చేసే తొలి ప్రసంగంలోనే వీటి అమలు పైన ప్రకటన చేయనున్నారు. తాను ఇచ్చిన తొమ్మది హామీలకు సంబంధించి తొమ్మది బోర్డులను ఏర్పాటు చేసి అందులో సమర్ధులను సభ్యులుగా నియమించనున్నారు. అదే విధంగా ప్రతీ హామీ అమలు కమిటీకి ఒక మంత్రి..సీనియర్ ఐఏయస్ కన్వీనర్లుగా ఉంటారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతీ లబ్ది దారుడికి పధకం అమలయ్యేలా గ్రామ స్థాయి నుండి సచివాలయం వరకూ ఈ వ్యవస్థను లింక్ చేస్తున్నారు. అదే విధంగా ..గ్రామ సచివాలయాల ఏర్పాటు పైన ప్రకటన చేయనున్నారు. ఇక, ప్రస్తుతం కొనసాగుతున్న సామాజిక పెన్షన్లను మూడు వేలకు పెంచుతానని ప్రకటించిన ఏడాదికి రూ. 250 చొప్పున పెంచనున్నారు.
విప్లవాత్మకం..
ఏపీలో గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతీ లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేయాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా ఏపీలోని మొత్తం 25 లోక్సభ నియోజకవర్గాలను 25 జిల్లాలుగా ప్రకటించనున్నారు. దీని కోసం పాలనా పరంగా కొత్తగా రెవిన్యూ డివిజనల్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ప్రతీ గ్రామంలోనూ గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తూ..అక్కడి నుండే గ్రామంలోని వారికి కావాల్సిన అన్ని రకాల సేవలు ఒకే కేంద్రం ద్వారా అందించే కీలక చర్యల దిశగా ప్రకటన ఉండనుంది. ఇక, ప్రతీ గ్రామంలో ప్రభుత్వ పధకాల లబ్ది దారుల వివరాలను ఓపెన్గా ప్రకటించనున్నారు. ఏ పార్టీ వారైనా అర్హులైతే వారికి పధకం అమలు చేయాల్సిందే. ఇక, పాలనా పరంగా పారదర్శకం గా..అవినీతి రహిత పాలన అందిస్తానని జగన్ ప్రతిజ్ఞ చేయనున్నారు.
రాజధాని పైన విచారణ..
చాలా కాలంగా అమరావతి రాజధాని పేరుతో అవినీతికి పాల్పడుతోందని జగన్ ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అధికారంలో కి రావటంతో రాజధాని అమరావతిలో భూ వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణ జరపనుంది.ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చేసే ప్రసంగంలో వైఎస్ జగన్మోహనరెడ్డి దీనిపై ప్రకటన చేస్తారని తెలిసింది. ఆ వెంటనే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ప్రభుత్వ అధికారులు కలుసుకొని, న్యాయ విచారణ కోసం సిట్టింగు న్యాయమూర్తిని కేటాయించాలని కోరనున్నారు. అమరావతి కోసం జరిపిన భూసమీకరణ తదితర అంశాలపై వివరాలను ఇవ్వాల్సింది గా ఉన్నతాధికారులు ఇప్పటికే సీఆర్డీయే అధికారులను కోరారు. దీంతో..జగన్ దీని పైన ఎటువంటి నిర్ణయం ప్రకటిస్తారనేది ఆసక్తి కరంగా మారింది.