ఏపి బీజేపి షాక్ ఇచ్చిన జగన్..! చౌరస్తాలో చంటి పిల్లాడిలా మారిని కమలం పార్టీ..!!
అమరావతి/హైదరాబాద్ : వైసీపీ అధినేతకు రాజకీయ అనుభవం లేదని నిన్నటిదాకా చాలా మంది అనుకున్నారు. ఒక్క విజయంతో తానేంటో రుజువు చేసుకున్నారు జగన్. అపర చాణక్యుడు చంద్రబాబుని ఢీ కొట్టి పడకొట్టిన తరువాత జగన్ పొలిటికల్ ఇమేజ్ ఆకాశానికి తాకింది. జగన్ సాధించిన ఈ విక్టరీని చూసి జాతీయ పార్టీలకే కళ్ళు చెదిరాయి. ఇవన్నీ ఇలా ఉంటే జగన్ అటు పాలనలోనూ, ఇటు రాజకీయంలోనూ వేస్తున్న అడుగులు ప్రత్యర్ధులను షాక్ కు గురి చేస్తున్నాయి. ఎక్కడికక్కడ చెక్ పెట్టేలా సాగుతున్న జగన్ వ్యూహం ఎవరికి అంతుచిక్కకుండా తయారైంది. తిరుపతి పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఏపీలో 2024లో మనమే గెలవాలని పిలుపు ఇచ్చారు. ఇది సహజమైన పరిణామమైనా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ దీన్ని బూతద్ధంలో చూశారు. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రలో పాగా వేయడానికి బీజేపీ చూస్తోందని, తెలుగు రాష్ట్రాల సీఎంలూ బహుపరాక్ అని హెచ్చరించారు. ఈ సంగతి ఇలా ఉంటే జగన్ మోదీ వ్యాఖ్యలైపై అప్రమత్తమైనట్టు తెలుస్తోంది.
ఏపీలో ఫిరాయింపులు ఉండవు, మేము ఎవరినీ తీసుకోం, ఎవరైనా తీసుకున్నా వూరుకోం అంటూ అసెంబ్లీ వేదికగా జగన్ చేసిన సంచలన ప్రకటన బీజేపీకి స్ట్రోక్ లా తగిలింది. ఎందుకంటే ఏపీలో ఫిరాయింపులతోనే జీవం పోసుకోవాలని, 15వ అసెంబ్లీలో ఉనికి కోల్పోయిన తమ పార్టీని ఆ విధంగా మనుగడలో ఉంచుకోవాలని కమలనాధులు పన్నుతున్న వ్యూహాలకు జగన్ చేసిన ఒక్క ప్రకటన తల్లకిందులు చేసినట్లయింది. బలంగా వైసీపీ 151 మంది ఎమ్మెల్యేలతో అధికారంలో ఉంది. టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ పార్టీ నుంచి తమవైపుకు వస్తానన్న వద్దు అని జగన్ అంటున్నారు. అదే తన సిధ్ధాంతం అని బాహాటంగానే చెప్పేస్తున్నారు. ఇక బీజేపీలోకి వెళ్ళడానికే తమ్ముళ్ళు మొగ్గు చూపుతున్నారు. కేంద్రంలో ఎటూ అధికారంలొ ఉంది. పార్టీ మారితే ఏకంగా అసెంబ్లీ స్పీకర్ వేటు వేయాలని జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాక రాజకీయాల్లొ తలపండిన తమ్మినేని సీతారాం అసలే వూరుకోరు. ఇలా బీజేపీలోకి జంప్ చేస్తే అలా ఎమ్మెల్యే డిస్ క్వాలిఫై అయిపోతారు. ఓ విధంగా ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ పేరిట తన ప్రతాపాన్ని చూపించాలనుకుంటున్న బీజేపీకి ఇది శారాఘాతమే. ఈ పరిణామంతో ఏపీలో బీజేపీ ఎదగకుండా జగన్ గట్టిగానే చెక్ పెట్టేశారనే చర్చ జరుగుతోంది.