ఓటు వేయని వారు బాధపడేలాగా: ఇక నుండి ఇంటికే పెన్షన్లు: చంద్రబాబు ఇలా చేసారు...సీఎం జగన్..!
మీ బిడ్డను. కడప గడ్డకు వచ్చాను. నాలో ఉన్నదీ నాన్న రక్తమే. ఆయన రైతు పక్షపాలి. నేను సైతం రైతుల కోసం ఎందాకైనా వెళ్తాను..అంటూ ముఖ్యమంత్రి జగన్ జమ్మలమడుగులో రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెన్షన్ రూ.2250కు పెంచామని..మూడు వేల వరరకు పెంచుతూ పోతామని స్పష్టం చేసారు. సెప్టెంబర్ నుండి పెన్షన్లు ఇంటి వద్దకే వస్తాయని ప్రకటించారు. రైతు సంక్షేమం కోసం నెల రోజుల కాలంలోనే అనేక నిర్ణయాలు తీసుకున్నాం ..ఇంకా అమలు చేయాల్సినవి చాలా ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. కడప జిల్లా ప్రజలకు ముఖ్యమంత్రి హోదాలో జగన్ వరాలు ప్రకటించారు.
వైయస్సార్ భరోసా ఆరంభం..
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ముఖ్యమంత్రి జగన్ పెన్షన్లను పెంచుతూ తీసుకున్న నిర్ణయం మేరకు పంపిణీ ప్రారంభించారు. నవరత్నాలను కడప గడపనుండే ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. వైఎస్సార్ పెన్షన్ పథకం కింద అవ్వాతాతలకు రూ.2,250, దివ్యాంగులకు రూ.3వేలు, డయాలసిస్ పేషంట్లకు రూ.10 వేలు మంజూరు చేస్తున్నా మని అన్నారు. వైఎస్సార్ జిల్లాకు గతంలో కంటే రెట్టింపుగా రూ.70 కోట్లు పెన్షన్గా ఇస్తున్నామని చెప్పారు. పెన్షన్ పథకానికి రూ.15,676 కోట్లు కేటాయించామన్నారు. పెన్షన్ రాని అర్హులు నేరుగా సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేయ చ్చని సూచించారు. ఫిర్యాదు కోసం ప్రత్యేక నెంబర్ను ఏర్పాటు చేస్తామని అన్నారు. తప్పులు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే సంక్షేమ పథకాల అమలుకు చర్యలు తీసుకున్నామని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో కులాలు, మతాలు, వర్గాలు పరిగణించమని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు.
ఇక ఇంటికే పెన్షన్లు..
తన ప్రభుత్వంలో ఇక నుండి ఇంటికే పెన్షన్లను అందిచే కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. సెప్టెంబర్ 1 నుండి ఈ కార్యక్రమం అమలు చేస్తామని వెల్లడించారు. ఇకపై వృద్దులు తమ పెన్షన్ ల కోసం లంచాలు ఇవ్వవలసిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. జన్మభూమి కమిటీల మాఫియాతో పని లేదని.. ఇందుకోసం వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని,..వీరు ఎవరైనా లంచం తీసుకుంటే వారిని తీసి వేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. ప్రతి పధకం ప్రజలకు డోర్ డెలివరి చేస్తామని.. ఇందులో కులం..మతం.. ప్రాంతం.. రాజకీయం వంటివి చూడబోమని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వం చివరి ఏడాదిలో రైతులకు విత్తనాల కోసం ఇవ్వాల్సిన నిధులను సైతం విడుదల చేయలేదని చెప్పుకొచ్చారు. అదే విధంగా ఉచిత విద్యుత్ కోసం 1600 కోట్లు అవసరమైతే వెంటనే విడుదల చేయాలని ఆదేశించామని వివరించారు. ఖచ్చితంగా 9 గంటల పగటి పూట ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పుకొచ్చారు.
ఇతర పార్టీలకు ఓటు వేసినవారైనా...
తమ ప్రభుత్వంలో ఏ పార్టీకి ఓ టు వేశారన్నది చూడకుండా ఈ స్కీములు అమలు చేస్తామని జగన్ తెలిపారు.గతంలో ఓటు వేయని వారు కూడా ఓటు వేయాలన్నది తమ ఉద్దేశమని జగన్ అన్నారు.రైతులందరికీ సున్నా వడ్డీకే రుణాలం దిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైతుల బాధల్ని గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందని ఉద్ఘాటించారు. ఆక్వా రైతులకు రూ.1.50కే విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పారు. వైఎస్సార్ పంటలబీమా పథకానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఖరీఫ్, రబీలలో సాగు చేసే 27 రకాల పంటలకు రైతులు చెల్లించాల్సిన ప్రీమియం వాటాను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ఇక కడప జిల్లాకు ముఖ్యమంత్రి హోదాలో వరాలు ప్రకటించారు. త్వరలోనే చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీని మళ్లీ తెరిపిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. డిసెంబర్ 26న స్టీల్ప్లాంట్కు శంకుస్థాపన చేస్తానని సీఎం ప్రకటించారు.