పురంధరేశ్వరి బీజేపీని వీడటం కష్టమని తెలిసే ఆఫర్ .. ఏది జరిగినా జగన్ వ్యూహం ఫలించినట్టే !!
వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దగ్గుబాటి వ్యవహారంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఒక పక్క పురంధరేశ్వరి వైసీపీలోకి తీసుకురావాలని రాజ్యసభ పదవిని ఆఫర్ చేస్తూనే, మరోపక్క తీసుకు రా లేకుంటే దగ్గుపాటి ఫ్యామిలీ వైసీపీలో కొనసాగే ప్రసక్తే లేదని సంకేతాలిచ్చారు. దీంతో దగ్గుపాటి ఫ్యామిలీ వైసీపీ లోకి వస్తే ఎలా ఉంటుంది? బీజేపీలోకి వెళితే ఎలా ఉంటుంది? అన్న అంశాలపై చాలా లోతుగా విశ్లేషిస్తున్నారు. రాజకీయ పరమైన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. బీజేపీలో ఉండేందుకే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.
ఏపీ సీఎం వై ఎస్ జగన్ స్ట్రాటజీ
వ్యూహాత్మకంగా పావులు కలపడంలో జగన్ కు జగనే సాటి. దగ్గుపాటి ఫ్యామిలీ విషయంలో జగన్ చేసింది అదే. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి బిజెపిలో కీలక నేతగా ఉన్న దగ్గుబాటి పురంధరేశ్వరి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేస్తున్నారు. పురందేశ్వరి భర్త దగ్గుపాటి వెంకటేశ్వర రావు,కుమారుడు హితేష్ చెంచు రాం ఇద్దరూ వైసీపీలో ఉన్నప్పటికీ పురంధరేశ్వరి చేస్తున్న వ్యాఖ్యలు సీఎం జగన్ కు మింగుడు పడలేదు. అంతేకాదు ఇక పర్చూరు నియోజకవర్గంలో సైతం దగ్గుపాటి వెంకటేశ్వరరావు తీరుపై వైసీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పురంధరేశ్వరికి ఆఫర్ .. నో అంటే కష్టమే
ఇక ఇదే సమయమని భావించిన జగన్మోహన్ రెడ్డి పురంధరేశ్వరి వైసీపీలోకి రావాలని,అలా వస్తే ఆమెకు రాజ్యసభ సీటు ఇస్తానని ఆఫర్ చేశారు. ఒకవేళ పురంధరేశ్వరి రాకపోతే దగ్గుపాటి వెంకటేశ్వర రావు, ఆయన తనయుడు సైతం రాజకీయ పరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అల్టిమేటం జారీ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే వైసీపీలో దగ్గుపాటికి డోర్ క్లోజ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి.
వైసీపీలో చేరటంపై తర్జనభర్జన.. బీజేపీవైపే మొగ్గు
ఇక జగన్ చెప్పిన ఆఫర్ విన్న పురంధరేశ్వరి రాజ్యసభసభ మెంబర్ గా అవకాశమని ఎగిరి గంతెయ్యటానికి అవకాశం లేదు. ఎందుకంటే జాతీయ పార్టీలో ఏపీ కి సంబంధించి మహిళా కీలక నాయకురాలిగా పురంధరేశ్వరి ఉన్నారు.అంతేకాదు ప్రాంతీయ పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజకీయాల నేపథ్యంలో ఆమె వైసీపీలో కొనసాగటం ఒకింత కష్టమే అని ఆమె భావిస్తున్నారట. ఇప్పటివరకు సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన మీద విమర్శలు చేస్తున్న పురంధరేశ్వరి ఒక్కసారిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి కి జై కొట్టే ఆలోచనలోనూ లేరు.
పురంధరేశ్వరి వైసీపీ లోకి వస్తారా? దగ్గుబాటి బీజేపీలోకి వెళ్తారా
ఇక దగ్గుపాటి విషయానికి వస్తే పర్చూరు నియోజకవర్గంలో ఇన్చార్జిగా దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఉన్నప్పటికీ గతంలో వైసీపీలో నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగిన, దగ్గుపాటి రాకతో టీడీపీ లోకి వెళ్ళిన రామనాథం బాబును తిరిగి తీసుకొచ్చి పెత్తనం అప్పగించారు. ఇక అంతే కాదు నియోజకవర్గాల్లో ప్రాధాన్యత కూడా దగ్గుబాటికి పూర్తిగా తగ్గింది. సీఎం జగన్ ని కలవడానికి కూడా అపాయింట్మెంట్ రాని పరిస్థితి ప్రస్తుతం దగ్గుపాటిది. ఇక ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ పురంధరేశ్వరి వైసీపీ లోకి వస్తారా? లేక దగ్గుబాటి బీజేపీలోకి వెళ్తారా ? అని అల్టిమేటం జారీ చేశారు.
పురంధరేశ్వరి బీజేపీని వీడరని తెలిసే జగన్ బంపర్ ఆఫర్
పురంధరేశ్వరి వస్తే రాజ్యసభ సీటు ఇస్తానని కూడా ప్రకటించిన సీఎం జగన్ పురంధరేశ్వరి అంత సామాన్యంగా బిజెపిని వదిలి రారు అన్న నమ్మకం తోనే ఆఫర్ చేసినట్లుగా తెలుస్తుంది. ఒకవేళ వస్తే రాజ్యసభ సభ్యురాలిగా రాజకీయాలపై పట్టు ఉన్న ఆమెకు అవకాశం ఇచ్చినా అది పార్టీకి లాభం అవుతుంది. ఒకవేళ రాకపోతే దగ్గుపాటి వెంకటేశ్వరరావు కూడా పార్టీలో కొనసాగే అవకాశం లేదు. ఆయన కూడా బిజెపి బాట పట్టాల్సి వస్తుంది. వస్తే కీలక రాజకీయ నాయకురాలు తమ పార్టీలోకి వస్తుందని,లేకుంటే దగ్గుపాటి ఫ్యామిలీ మొత్తం వైసిపికి దూరమవుతుందని చాలా వ్యూహాత్మకంగా జగన్ ప్లాన్ చేశారు.
రాజకీయంగా లాభనష్టాలను బేరీజు వేసి బీజేపీ వైపే మొగ్గు ?
అయితే ప్రస్తుతం దగ్గుపాటి ఫ్యామిలీలో ముఖ్యంగా పురంధరేశ్వరి వైసీపీలో చేరే ఆలోచనలో అయితే లేరు. వైసిపి లో ఉన్న ప్రతికూల పరిస్థితుల నేపధ్యంలో, అక్కడ ఉన్న నాయకుల మధ్య ఉండాలంటే అది ఆమెకు కష్టమని భావిస్తున్నారు. అంతేకాదు జాతీయ పార్టీ అయిన బిజెపి పుంజుకుంటుంది అనే భావన ఉన్న క్రమంలో ఆమె వైసీపీలో చేరే అంశంపై ఆసక్తి చూపడం లేదని టాక్ వినిపిస్తుంది. ఇక గతంలో దగ్గుపాటి వెంకటేశ్వర రావు బిజెపిలో పని చేశారు కాబట్టి ఆయన సైతం బిజెపి బాట పడతారని టాక్ వినిపిస్తుంది. జగన్ ప్లాన్ ప్రకారం పురంధరేశ్వరి వైసీపీ లోకి వచ్చినా, దగ్గుపాటి బీజేపీలోకి వెళ్ళినా వైసిపి కి ఏ మాత్రం నష్టం లేదు.