కేంద్రంలో జగన్ మద్దతు వారికే ... వ్యూహాత్మకంగా అడుగేస్తున్న జగన్
కేంద్రంలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? కేంద్రంలో హంగ్ వస్తే తానే కింగ్ మేకర్ అవుతానని భావిస్తున్నారా? అందుకే ఎన్డీఏ వైపు కాని, బీజేపీయేతర కూటమి వైపు కానీ, ఫెడరల్ ఫ్రంట్ వైపు కానీ మొగ్గు చూపించకుండా తటస్థంగా ఉన్నారా? అంటే అవును అని సమాధానం చెప్పాల్సి వస్తుంది.
చంద్రబాబుకు జగన్ సూటి ప్రశ్న .. రీపోలింగ్ ఏమైనా అప్రజాస్వామికమా ? రిగ్గింగా ? జంకెందుకు ?
కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న నేతలు ... ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్న జగన్
ఏపీ సీఎం చంద్రబాబు బీజేపీయేతర కూటమి లో కీలక భూమిక పోషిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేంద్రంలో చక్రం తిప్పాలని చూస్తున్నారు. ఇక ఒకవైపు జగన్ సైతం ఫెడరల్ ఫ్రంట్ లో భాగస్వాముల్ని చేయాలని కేసీఆర్ కలలు కంటున్నారు. కానీ జగన్ మాత్రం తాజా పరిణామాలను, భవిష్యత్ పరిణామాలను కూడా అంచనా వేస్తూ ఎన్నికల ఫలితాల తర్వాత ఆచితూచి నిర్ణయం తీసుకోనున్నారు.
ఒకపక్క ఎన్డీఏ అమిత్ షా ను రంగంలోకి దించి జగన్ పార్టీ మద్దతు కూడగట్టాలని భావిస్తుంటే, మరోపక్క సోనియాగాంధీ మే 23న జరిగే సమావేశానికి రావాల్సిందిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ సైతం రాశారు. అయితే మే 23న ఎన్నికల ఫలితాలు ఉన్న నేపథ్యంలో ఆరోజు సమావేశానికి హాజరయ్యే దాఖలాలు కనిపించడం లేదు.
సమయాన్ని బట్టి నిర్ణయం .. ఎన్నికల ఫలితాల తర్వాతే కేంద్రంలో ఎవరికి మద్దతు ఇవ్వాలో తేల్చుకోనున్న జగన్
అంతమాత్రాన యూపీఏతో వైసిపి పొత్తు పెట్టుకోదని కూడా నమ్మకం లేదు. ఇక ఎన్డీఏ కోరికకు సైతం ఓకే చెప్పకుండా తటస్థంగా వ్యవహరిస్తోంది వైసిపి.
అయితే జగన్ వ్యూహాత్మకంగానే తటస్థంగా ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు. ఢిల్లీలో ఏం జరుగుతుందో మినిట్ టూ మినిట్ అబ్జర్వ్ చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి సమయం చూసి రంగంలోకి దిగనున్నారు. ఇప్పటికే పలు సర్వేలు ఏపీలో వైసిపి 20 లోక్ సభ స్థానాలు కైవసం చేసుకుంటుందని వెల్లడిస్తున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, ఆంధ్రప్రదేశ్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని, కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీతో సఖ్యంగా ఉండాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోనున్నారు.
మద్దతు ఇవ్వాలంటే ప్రత్యేక హోదాపై పట్టు పట్టే అవకాశం .. ఇదే జగన్ వ్యూహం
ఒకవేళ ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తే, సర్వేలు చెప్పింది నిజమై 20 స్థానాల్లో లోక్ సభ అభ్యర్థులు విజయం సాధిస్తే వైయస్ జగన్ ఏపీకి రావలసిన ప్రత్యేక హోదా విషయంలో పట్టుబట్టే అవకాశం ఉంది. మొదటినుంచి ఎవరైతే ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో స్పష్టమైన హామీ ఇస్తారో .. ఆ పార్టీకి మద్దతుగా ఉంటానని వైయస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఒకవేళ కేంద్రంలో హంగ్ వస్తే, తప్పనిసరిగా జగన్ సహకారం జాతీయ నేతలకు కావాల్సి వస్తే జగన్ ప్రత్యేక హోదా కోసం పట్టు బిగించే అవకాశం ఉంది. అందుకే ప్రస్తుతానికి సైలెంట్ గా ఉంటున్న జగన్, మే 23 ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో మారే రాజకీయ పరిణామాలను బట్టి జగన్ తన వ్యూహాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. కేంద్రంలో తనకు ఎవరు సహకారాన్ని అందిస్తారని భావిస్తే వారికి మద్దతు తెలిపే అవకాశం ఉంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీకే దాదాపు జగన్ మొగ్గు చూపుతారని భావన.