ఏపీ మంత్రులు , ఎమ్మెల్యేలు , అధికారులపై జగన్ నిఘా నేత్రం .. తేడా వస్తే తాట తీసుడే
Recommended Video
జగన్ పాలనలో పారదర్శకత కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారా ? ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలకు అవినీతి చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చిన జగన్ వారిపైన కూడా నిఘా నేత్రాన్ని ఏర్పాటు చేశారా ? ఇక ఏపీలో పాలనకు కీలకమైన సెక్రటేరియట్ లో జగన్ నిఘా టీమ్ నిరంతర పర్యవేక్షణ కొనసాగనుందా ? అంటే అవును అనే సంకేతాలే వినిపిస్తున్నాయి.
అవినీతి రహిత పాలన కోసం జగన్ మాస్టర్ ప్లాన్ .. నిఘా నీడలో ప్రజా ప్రతినిధులు , ప్రభుత్వ యంత్రాంగం
జగన్ తన పాలనను పారదర్శకంగా సాగించాలని స్పష్టమైన విజన్ తో ఉన్నారు. గత టీడీపీ తన అవినీతి పాలన వల్లే దెబ్బ తిందని జగన్ చాలా గట్టిగా నమ్ముతున్నారు. అందుకే అలాంటి పొరబాటు తన పాలనలో జరగకుండా ఇప్పటి నుండే తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఇప్పటికే మంత్రులకు , ఎమ్మెల్యేలకు అవినీతి సహించనని హెచ్చరికలు జారీ చేసిన జగన్ అవినీతి రహితంగా పాలన చేయడానికి మాస్టర్ ప్లాన్ వేసినట్టు ఏపీ అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రంగంలోకి సీక్రెట్ ఆపరేషన్ టీమ్ .. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో జగన్ కు చేరవేత అని ప్రచారం
ఏపీ పాలన కేంద్రమైన సెక్రటేరియట్ లో అవినీతి జరగకుండా ఉండడానికి జగన్ సీక్రెట్ ఆపరేషన్ టీంను ఏర్పాటు చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వీరు ఏపీలోని ప్రతి శాఖ చాంబర్ దగ్గర బట్టన్ కెమెరాలతో తిరుగుతారని , అక్కడ జరిగే ప్రతి అంశాన్ని చాలా లోతుగా పరిశీలిస్తారని ఇప్పుడు సెక్రటేరియట్ లో పెద్ద చర్చ జరుగుతుంది. జగన్ పెట్టిన ఈ నిఘా ఏజెంట్లు ఎప్పటికప్పుడు ఏపీ సెక్రెటేరియట్ లో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు పార్టీ హైకమాండ్ కు, జగన్ కు ఇన్ఫర్మేషన్ ను పంపిస్తున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. ఇక వైసీపీలో, ప్రభుత్వంలో ఏమైనా సీక్రెట్ డీల్స్ జరుగుతున్నాయా? ఎవరైనా అవకతవకలకు పాల్పడుతున్నారా అనే విషయాలను ఇంటెలిజెన్స్ కి ఇస్తున్నారనే చర్చ జోరుగా జరుగుతోంది.
మంత్రులు, ఎమ్మెల్యేలు , అధికారులు ఎవరైనా సరే .. అవినీతి చేస్తే అంతే సంగతి
జగన్ అవినీతి రహిత పాలన అందించేందుకు ఈ సీక్రెట్ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు సెక్రెటేరియట్ సహా కీలక ప్రాంతాల్లో ఈ టీమ్ ఇప్పటికే మోహరించినట్టు సమాచారం. వీరు తమ పరిధిలో ఎక్కడ ఏం జరుగుతుందో జగన్ కు చేరవేస్తున్నారట.. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు ఇక అవినీతికి పాల్పడితే జగన్ వేసిన మూడోకన్నుకు బలికాక తప్పదని కాసింత భయపడుతున్నారని సమాచారం . ఏది ఏమైనా 9 ఏళ్ళ పాటు ప్రతిపక్షంలో ఉండి పాలక పక్షం అవినీతి చూసి నేర్చుకున్నపాఠం కావటంతో జగన్ ఇప్పటి నుండే పాలనలో జాగ్రత్త పడుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. జగన్ టార్గెట్ ఇప్పుడు సీఎంగా ఉండటమే కాదు నెక్స్ట్ ఎన్నికల్లో కూడా వైసీపీదే అధికారం కావటం .. అందుకోసం ఇప్పటి నుండే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని కూడా చర్చ జరుగుతుంది.