వైయస్ జగన్ అనే నేను..30వ తేదీ జగన్ ప్రమాణ స్వీకార ముహూర్తం ఇదే : ఆయన సూచన మేరకే.. .!
ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీప అధినేత జగన్ ఈ నెల 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు జగన్ స్వయంగా ప్రకటించారు. 30వ తేదీన ప్రమాణ స్వీకార ముమూర్తం సైతం ఖరారైంది. జగన్తో పాటుగా కేబినెట్ మంత్రులు ప్రమాణం చేస్తారని చెబుతున్నా..ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇందుకోసం సీఎస్కు జగన్ సూచనలు చేసారు. ఇటు ప్రమాణ స్వీకార వేదిక తో పాటుగా సచివాలయంలోనూ ఏర్పాట్లు చేస్తున్నారు.
30వ తేదీ ఉదయం ముహూర్తం ఖరారు..
ఏపీ నూతన ముఖ్యమంత్రిగా జగన్ ఈ నెల 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ఈ విషయం స్వయంగా ప్రకటించిన జగన్ ప్రమాణ స్వీకార ముహూర్తాన్ని ఖరారు చేసారు. కొంత కాలంగా ప్రతీ విషయంలోనూ ముహూర్తాలను పాటిస్తున్న జగన్..వాటిని తాను నమ్మిన విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి సూచనల మేరకు నడుచుకుంటున్నారు. తొలుత ఈ నెల26న ప్రమాణ స్వీకారం చేయాలని భావించినా..స్వామి సూచనల మేరకు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసుకున్నారు. అదే విధంగా 30వ తేదీ ఉదయం 11.40 నుండి 12 గంటల మధ్య ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారు చేసారు. ఇదే విషయాన్ని జగన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి స్పష్టం చేసారు. ఇందు కోసం ఆయనతో పాటుగా విజయవాడ పోలీసు కమిషనర్కు జగన్ సూచనలు చేసారు.
20 ఎకరాల స్థలంలో ఏర్పాట్లు...
ప్రమాణ స్వీకారం కోసం అభిమానులు 13 జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇందు కోసం 20 ఎకరాల స్థలం ఉండేలా చూడాలని అధికారులు భావిస్తున్నారు. ఇందు కోసం వారు రెండు మూడు ప్రాంతాలను జగన్ ముందు ఆమోదం కోసం ప్రతిపాదించారు. అందులో విజయవాడ శివారులోని చిన అవుట్పల్లి సిద్దార్ద మెడికల్ కాలేజి ఎదురు స్థలం ఎంపిక చేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు. అయితే, రవాణా పరంగానూ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని జగన్ నిర్దేశించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురు స్థలం సైతం పరిశీలిస్తున్నారు. దీని పైన ఆయంత్రం లేదా రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
సీఎం ఒక్కరేనా..మొత్తం మంత్రులూ చేస్తారా..
అయితే, ఇప్పడు 30వ తేదీన జగన్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారా..లేక మంత్రులతో కలిసి చేస్తారా అనేది ఇంకా స్పష్టత రాలేదు. 2004, 2009 లో వైయస్ గెలిచిన సమయంలో తొలుత ఆయన ఒక్కరే ప్రమాణ స్వీకారం చేసారు. ఇక, ఇప్పుడు జగన్ సైతం అదే తరహాలో ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇక, ఇటు సచివాలయంలో మంత్రుల పేషీలు సైతం సిద్దం అవుతున్నాయి. ఇప్పటి వరకు పేషీల్లో ఉన్న చంద్రబాబు ఫొటోలను తొలిగిస్తున్నారు. ఇప్పటి వరకు మంత్రుల పేషీల్లో పని చేసిన ప్రభుత్వ సిబ్బందిని మాతృ సంస్థలకు పంపాలని సీఎస్ ఆదేశించారు.