మరో ఎన్నికల హామీకి రంగం సిద్ధం...జగన్ కీలక నిర్ణయం
అమరావతి: ఏపీ సీఎం వైయస్ జగన్ తాను ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను వెంటవెంటనే అమలు చేస్తున్నారు. తన మేనిఫెస్టోలో ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. తాజాగా పాదయాత్ర సమయంలో, ఎన్నికల ప్రచారం సందర్భంగా రైతులకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని ఇచ్చిన హామీ గురువారం నుంచి అమలు కానుంది. ఈ మేరకు సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. అధికారులను తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 60శాతం ఫీడర్ల ద్వారా గురువారం నుంచే పగటివేళల్లో నిరంతరాయంగా 9 గంటల విద్యుత్ సరఫరా చేయాలని జగన్ ఆదేశించారు. మిగిలిన 40శాతం ఫీడర్ల మరమత్తులకు రూ. 1700 కోట్లను రూపాయలు విడుదల చేస్తున్నట్లు జగన్ చెప్పారు. 2020 జూలై నుంచి మిగతా 40శాతం ఫీడర్ల నుంచి కూడా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు.
వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ను ప్రకటించడంపై వైసీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల సమయంలో రైతులకు పగటిపూట 9 గంటల విద్యుత్ ఇస్తామని చంద్రబాబు చెప్పారని కానీ ఏనాడు ఇచ్చిన పాపాన పోలేదని మండి పడ్డారు. అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే సీఎం జగన్ 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇలా ఒక్క హామీతోనే కాదని అన్ని హామీలను జగన్ నెరవేరుస్తారని నాగిరెడ్డి చెప్పారు.