మోడీ బలానికి బాబు వ్యూహాలకు వైసీపీ చెక్..సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా మారుతున్న జగన్
దేశ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయా...? బీజేపీకి ఎవరి మద్దతు లేకపోయినప్పటికీ తమ అవసరాలను సాధించేందుకు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పార్టీలు ఏకమయ్యాయా..? మొన్నటి వరకు దక్షిణాది రాష్ట్రాలను ఏకం చేసేందుకు పావులు కదిపారు కేసీఆర్...తాజాగా ఈ బాధ్యతను ఎవరు తీసుకున్నారు..?
దక్షిణాది రాష్ట్రాలు అంతా కలిసే ఉన్నాయనే సంకేతాలు
దేశ రాజకీయాలు అంటేనే ఉత్తరాది రాష్ట్రాలు అన్నట్లుగా ఇప్పటివరకు పరిస్థితి ఉండేది. కానీ 2019 సార్వత్రిక ఎన్నికలతో ఒక్కసారిగా అందరి చూపంతా దక్షిణాది రాష్ట్రాలపై పడింది. సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే అత్యధిక లోక్సభ స్థానాలు సాధించగా... వైసీపీ 22 స్థానాలు సాధించింది. అయితే బీజేపీకి పెద్ద సంఖ్యలో సీట్లు రావడంతో కొందరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బీజేపీని డిమాండ్ చేయలేని పరిస్థితి వచ్చింది. ఇందుకోసమే బీజేపీతో పేచీ లేకుండా తమ అవసరాలను తీర్చుకునేందుకు దక్షిణాది రాష్ట్రాల పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయి. ఇందుకోసం జగన్ ప్రమాణ స్వీకారం వేదిక కానుంది.
బీజేపీతో పేచీ పెట్టుకోకుండా స్మూత్గా డిమాండ్ల సాధన
దక్షిణాది ప్రాంతాలను ఒక్కతాటిపైకి తీసుకురావాలని ముందుగా కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పుడు జగన్ ఆ బాధ్యతను తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. బీజేపీకి ఎక్కువ స్థానాలు రావడంతో వారిని కొన్ని విషయాలను డిమాండ్ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇందులో భాగంగానే జగన్ దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పార్టీ అధినేతలను తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. అంతేకాదు ఒకరికొకరం అండగా ఉండి తమ రాష్ట్రాలకు కావాల్సినవి సాధించుకుందామని చెప్పినట్లు సమాచారం. అదే సమయంలో బీజేపీతో పేచీకి పోకుండా అంతా కలిసి తమ డిమాండ్లను స్మూత్గా సాధించుకునేలా ప్లాన్ చేశారు వైసీపీ అధినేత నిశ్చయ సీఎం జగన్. మోడీతో గొడవపడితే సాధించేది ఏమీ లేదని ఆయన వెంటపడి సాధించుకుందామని జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు.
అంతా ఒక్కటిగా ఉన్నామని చాటి చెప్పేందుకు వేదిక కానున్న విజయవాడ
ఇప్పటికే తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా డీఎంకే అధినేత స్టాలిన్కు ఫోన్ చేసిన జగన్...తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను స్వయంగా తన ఇంటికి వెళ్లి ఆహ్వానించారు. మరోవైపు కమ్యూనిస్టుల తరపున సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్ రెడ్డిలకు కూడా ఫోన్ చేసి ఆహ్వానించారు. అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా జగన్ ఫోన్ చేసి ఆహ్వానించారు. ఎన్నికల వరకే రాజకీయ వైరం అని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అందరం కలిసి ఒకే తాటిపై నడుద్దామనే సంకేతాలు జగన్ పంపారు. అంతేకాదు దక్షిణాది రాష్ట్రాలన్నీ ఐక్యంగా ఉన్నాయనే సిగ్నల్స్ కూడా జగన్ కేంద్రానికి పంపుతున్నట్లుగా కనిపిస్తోంది.
పార్లమెంటులో ఒకరికి మద్దతుగా మరొకరు
ఇక పార్లమెంటులో ఇతర దక్షిణాది రాష్ట్రాల సమస్యలు ఏమైనా ఉంటే కచ్చితంగా వారి పోరాటానికి వైసీపీ మద్దతు ఇస్తుందనే సంకేతాలు జగన్ ఇచ్చారు. అదే సమయంలో తమ డిమాండ్ల సాధనకు కూడా ఇతర దక్షిణాది పార్టీలు కూడా మద్దతు ఇవ్వాల్సిందిగా జగన్ కోరినట్లు సమాచారం. ఇక ఏపీకి ప్రత్యేక హోదా తొలి డిమాండ్గా ఉంది. దీనికోసం దక్షిణాది రాష్ట్రాలు మద్దతు అవసరమని జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగానే సంఖ్యాబలం ఎక్కువున్న స్టాలిన్, 8 సీట్లున్న కేసీఆర్లను మద్దతు ఇవ్వాల్సిందిగా జగన్ కోరారు. ఇప్పటికే కేసీఆర్ నుంచి స్పష్టమైన హామీ వచ్చింది. ఇక కర్నాటకను కూడా కలుపుకుంటే బీజేపీకి 26 స్థానాలు దక్కాయి. ఇక కేరళలో కమ్యూనిస్టుల మద్దతు తీసుకుని మొత్తానికి అంతా కలిసి ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా పార్లమెంటు వేదికగా తమ గళం వినిపించే అవకాశం ఉంది. అలాంటి మద్దతు సంపాదించడం కోసమే జగన్ తన ప్రమాణస్వీకారం సందర్భంగా తామంతా ఐక్యంగా ఉన్నామనే పరోక్ష సంకేతాలు మోడీకి పంపనున్నారు. ప్రత్యేక హోదా సాధనలో భాగంగా ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్లతో కూడా జగన్ చర్చించే అవకాశాలు ఉన్నాయి.
దక్షిణాది రాష్ట్రాల సమస్యలు పరిష్కరించుకునేందుకు జగన్ సిద్ధం
ఇక దక్షిణాది రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలున్నాయి. ముఖ్యంగా జలసమస్యలు, సరిహద్దు సమస్యలు ఉన్నాయి. వీటన్నిటినీ సామరస్యంగా పరిష్కరించుకునేందుకు జగన్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ సమస్యలపై కూడా ఆయా రాష్ట్ర పార్టీల అధినేతలతో భవిష్యత్తులో జగన్ చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో జగన్ గెలుపుతో ఏపీ తెలంగాణ మధ్య భవిష్యత్తులో మంచి సంబంధాలు ఉంటాయనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే కచ్చితమైన సమన్వయంతో వెళ్లి ఇరు నేతలు రాష్ట్ర సమస్యలను పరిష్కరించుకుంటారనే అభిప్రాయం విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి జగన్ ప్రమాణ స్వీకార వేదిక కొత్త తరహా రాజకీయాలకు వేదికగా మారనుంది. తామంతా ఒక్కటే అన్న సంకేతాలు కేంద్రానికి వెళ్లేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో కాలమే సమాధానం చెప్పాలి.