టీడీపీ కంచుకోటకు వైసీపీ గండం: చేజేతులా!, జగన్ పుంజుకుంటున్న సూచనలు?
గరగరపర్రు పర్యటన సందర్భంగా.. జగన్ కు భారీ స్పందనే లభించింది. వెలిని ఎదుర్కొంటున్న కుటుంబాలు, గ్రామస్తులు ఇలా రెండు వర్గాలు జగన్ రాకను స్వాగతించాయి.
ఏలూరు: అధికార పార్టీకి కంచుకోటలా ఉన్న జిల్లాలో ఇప్పుడా పరిస్థితి మారుతోందా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. గత ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన చోట.. భవిష్యత్తులో ప్రతికూల పవనాలు వీచే సూచనలు కనిపిస్తున్నాయి. నాయకుల అవినీతి ధోరణి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి.. వెరసి టీడీపీకి కంచుకోట లాంటి పశ్చిమ గోదావరిలో పొలిటికల్ సీన్ మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
జగన్, పవన్కు వాళ్ల బాధ కనిపించదా?: గరగపర్రు వెలివేతపై మౌనమెందుకు?..
గత సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లాను టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఒకవిధంగా వైసీపీకి అధికారాన్ని దూరం చేసి టీడీపీకి పీఠం దక్కేలా చేసింది ఈ జిల్లాయే అని చెప్పాలి. అంతటి ఆదరణ చూపించిన జిల్లాలో పరిస్థితులపై టీడీపీ అధిష్టానం ఆదమరిచిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కంచుకోటే కదా అన్న ధీమాతో టీడీపీ ప్రదర్శిస్తున్న అలసత్వం.. ఇప్పుడు వైసీపీకి బూస్టింగ్ ఇస్తోందన్న వాదన బలంగా వినిపిస్తోంది.
ఇంతకీ ఏం జరుగుతోంది?:
జిల్లాలో ఉన్న 15అసెంబ్లీ నియోజకవర్గాల్లో 14సీట్లను కైవసం చేసుకున్న టీడీపీ.. ఒక స్థానంలో తమ మిత్రపక్షం బీజేపీ అభ్యర్థిని గెలిపించుకుంది. మూడు లోక్ సభ స్థానాల్లోను రెండు స్థానాలు టీడీపీ ఖాతాలో, ఒక స్థానం బీజేపీ ఖాతాలో చేరాయి. మొత్తంగా జిల్లాలో అసలు వైసీపీకి పాగా వేసే అవకాశమే దక్కలేదు.
అయితే చేజేతులా టీడీపీయే ఇప్పుడా అవకాశాన్ని వైసీపీకి కల్పిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తిరుగులేని విజయం సాధించామన్న ధీమా.. అక్కడి టీడీపీ నేతలను గాల్లో తేలేలా చేసింది. దీంతో ప్రజా సమస్యలను గాలికి వదిలేసి, ఎవరికి వారు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
తమలో తమకే విభేదాలు:
కలిసికట్టుగా పార్టీ పట్టు సడలిపోకుండా జాగ్రత్త పడాల్సిన టీడీపీ నేతలు.. అసలు ఆ విషయాన్నే పట్టించుకున్నట్లు కనిపించడం లేదంటున్నారు. ఎంతసేపు తమలో తమకే అంతర్గత విభేదాలతో సతమతమవుతూ కాలం వెళ్లదీస్తున్నారని, జనం సమస్యలపై దృష్టి పెట్టేంత వారికి ఎక్కడిదని పలువురు ఎద్దేవా చేస్తున్నారు.
దీనికి తోడు అవినీతి ఆరోపణలు కూడా పుష్కలంగానే ఉన్నాయి. నియోజకవర్గాల అభివృద్ది కోసం ఖర్చు చేయాల్సిన నిధులు.. నేతల జేబుల్లో దూరిపోతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటు పార్టీ కార్యక్రమాల పట్ల కూడా వీరంతా అంతగా ఆసక్తి కనబరచడం లేదన్న విమర్శ కూడా ఉంది. మొత్తంగా పార్టీ మంచి-చెడ్డలను ప.గో ఎమ్మెల్యేలంతా గాలికి వదిలేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
గరగపర్రు దెబ్బ:
జిల్లాలోని గరగపర్రు గ్రామంలో దళితులపై వెలివేత విషయంలో టీడీపీ కావాల్సినంత అప్రతిష్టను మూటగట్టుకుందన్న వాదన వినిపిస్తోంది. ఈ విషయంలో టీడీపీ నేతలెవరూ నేరుగా స్పందించడానికి సాహసం చేయలేదు. కులాల మధ్య వ్యవహారం కావడంతో.. ఎవరికి మద్దతుగా నిలిచినా.. మరో వర్గం దూరమయ్యే అవకాశం ఉండటంతో టీడీపీ దీనిపై మిన్నకుండిపోయింది.
అదే సమయంలో వైసీపీ అధినేత జగన్ మాత్రం.. ధైర్యం చేసి గ్రామంలో పర్యటించారు. అటు బాధితులకు భరోసా ఇస్తూనే ఇరు వర్గాల మధ్య సయోధ్య నెలకొనేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో రెండు వర్గాల్లోను ఆయన పట్ల సానుకూల వైఖరి ఏర్పడినట్లు చెబుతున్నారు.
జగన్కు భారీ స్పందన:
గరగరపర్రు పర్యటన సందర్భంగా.. జగన్ కు భారీ స్పందనే లభించింది. వెలిని ఎదుర్కొంటున్న కుటుంబాలు, గ్రామస్తులు ఇలా రెండు వర్గాలు జగన్ రాకను స్వాగతించాయి. దారి పొడుగునా.. ఆయన రాక పట్ల వారు హర్షం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. గరగపర్రు వివాదంలో టీడీపీ పెద్దలు నోరు మెదపకపోవడం జిల్లాలోని మిగతా గ్రామాల ప్రజలను కూడా ఆలోచనలో పడేసిందంటున్నారు. దీంతో టీడీపీ వ్యూహాత్మక మౌనం ఆ పార్టీ పట్ల ప్రతికూలతలను కలిగించేదిగా మారినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో జిల్లాలో టీడీపీకి ఉన్న సానుకూల వాతావరణం కొంతవరకైనా చెదిరిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. జిల్లాలో అసలు ఏమాత్రం పట్టులేని వైసీపీ.. తాజా పరిణామాలతో కొద్ది కొద్దిగా పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. ఇదే స్పీడును కొనసాగిస్తూ.. జిల్లాలో తమ దూకుడును ఇలాగే కొనసాగించాలని వైసీపీ కూడా భావిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో భవిష్యత్తులో టీడీపీ కంచుకోటకు వైసీపీ గండం చుట్టుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.