నేడే జగన్ అనంతపూర్ పర్యటన..! ఎన్నికల సమర శంఖారావానికి శ్రీకారం..!!
అనంతపురం/ హైదరాబాద్: ఆంద్ర ప్రదేశ్ లో బహిరంగ సభల సీజన్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. జనసైన అధినేత పవన్ కళ్యాణ్, ఏపి సీయం చంద్రబాబు, బీజేపి తో పాటు ప్రతిపక్ష పార్టీ వైసీపి కూడా బహిరంగసభలు నిర్వహించి ప్రజలకు చేరువయ్యే ప్రణాళికలు రచిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహనరెడ్డి సోమవారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు అనంతపురం నగరానికి చేరుకుని శ్రీ7 కన్వెన్షన్ హాల్ కు చేరుకుంటారు. ఆ కన్వెన్షన్ హాల్లో అనంతపురం జిల్లాకు చెందిన వివిధ రంగాలకు చెందిన తటస్తులతో వైఎస్.జగన్ సమావేశమవుతారు.
అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు బెంగుళూరు రోడ్డులో ఉన్న అశోక్ లేల్యాండ్ షోరూమ్ ఎదురుగా ఉన్న స్ధలంలో జరిగే సమర శంఖారావం సభలో పాల్గొంటారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ సభ్యులతో సమావేశమవుతారు. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరపున వ్యవహరించాల్సిన వ్యూహాలపై వారితో చర్చిస్తారు. బూత్ కమిటీ సభ్యులకు, వైసీపీ కార్యకర్తలకు జగన్మోహనరెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే చిత్తూరు, కడప జిల్లాల్లో సమర శంఖారావ సభలు పూర్తి చేసిన జగ్మోహనరెడ్డి సోమవారం అనంతపురం జిల్లాలో ఎన్నికల సమర శంఖం పూరించనున్నారు.