విశాఖ గీతంపై జగన్ సర్కార్ దాడి వెనుక ? టీడీపీ, చంద్రబాబును మించిన టార్గెట్...
విశాఖ గీతం క్యాంపస్లో కూల్చివేతల వ్యవహారంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ భారీ వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో టీడీపీ, చంద్రబాబు పాత్రను బయటపెట్టడం కంటే కూడా వ్యవస్ధలను వాడుకుంటున్న తీరును తవ్వితీయడమే ప్రధాన వ్యూహంగా తెలుస్తోంది.
వైసీపీ పాత టార్గెట్ గీతం క్యాంపస్...
విశాఖలో వేల ఎకరాల్లో విస్తరించిన గీతం విద్యాసంస్ధల క్యాంపస్పై వైసీపీ కన్ను ఎప్పటినుంచో ఉంది. గతంలో చంద్రబాబు అధికారంలో ఉండగా.. గీతం క్యాంపస్ చేసిన కేటాయింపులు, అక్రమాల క్రమబద్ధీకరణ వంటి అంశాలపై వైసీపీ నేతలు పోరాడుతూనే ఉన్నారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ తోడల్లుడు, బాలయ్య రెండో అల్లుడు కూడా అయిన శ్రీ భరత్ గత ఎన్నికల్లో విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేశారు. అప్పట్లోనే ఆయన కుటుంబానికి చెందిన గీతం విద్యాసంస్ధలను, వాటి అక్రమాలను వైసీపీ నేతలు ప్రస్తావించేవారు. భరత్ తాత ఎంవీవీఎస్ మూర్తి స్ధాపించిన ఈ విద్యాసంస్ధలు వాడుకుంటున్న స్ధలంలో గతంలోనే పలు అక్రమాలు ఉన్నట్లు నోటీసులు కూడా వెళ్లాయి. వాటిలో పలు క్రమబద్ఖీకరణలు కూడా జరిగాయి. అయితే వైసీపీ మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత అవకాశం కోసం ఎదురుచూస్తోంది.
అదను చూసి గీతం కూల్చివేతలు..
గీతం క్యాంపస్లో అక్రమాలపై చర్యలకు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వైసీపీ సర్కారు ఇవాళ రంగంలోకి దిగింది. రుషికొండలోని గీతం క్యాంపస్లో 40 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించారంటూ రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గీతం నిర్వాహకులు ఈ భూమిని కబ్జా చేశారంటూ రెవెన్యూ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇవాళ కూల్చివేతలు చేపట్టారు. ఇప్పటికే గీతం క్యాంపస్ పరిధిలో ఊన్న భూములు ఏయే రెవెన్యూ గ్రామాల పరిధిలో ఉన్నాయి, వాటిలో ఎంత మేర ఆక్రమణలు ఉన్నాయనే అంశాన్ని మరోసారి సమగ్రంగా పరిశీలించేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమవుతున్నారు. గీతం ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల మధ్య అనుమతుల్లేకుండా నిర్మించిన అండర్ పాస్పైనా అధికారులు దృష్టిపెట్టారు.
గీతం కూల్చివేతల్లో పైకి కనిపించేది..
గీతం క్యాంపస్లో వైసీపీ సర్కారు చేపట్టిన కూల్చివేతల్లో పైకి అంతా టీడీపీనో, చంద్రబాబునో, ఆయన తోడల్లుడు భరత్ కుటుంబాన్నో లేక బాలయ్యనో టార్గెట్ చేశారనే భావిస్తున్నారు. అసలే విశాఖ రాజధాని అవుతోంది. ఇలాంటి దాడులతో స్ధానికంగా టీడీపీ నేతలను భయభ్రాంతులను చేయడం ద్వారా తమవైపు తిప్పుకోవాలనే వ్యూహం కూడా ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే స్ధానిక ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా తమవైపు తిప్పుకుంటున్న వైసీపీ.. ఇప్పుడు గీతం మూర్తి కుటుంబాన్ని కూడా వైసీపీ వైపు తిప్పుకునేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇదంతా పైకి కనిపించేది. ఆ వెనుక అసలు వాస్తవాలు ఎప్పుడూ ఉంటాయి.
Recommended Video
జగన్ అసలు వ్యూహమిదేనా...
విశాఖలో ప్రతిష్టాత్మక విద్యాసంస్ధ అయిన గీతం క్యాంపస్పై జగన్ సర్కారు కూల్చివేతల పేరుతో దాడికి దిగడం వెనుక భారీవ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి బయటికి చూసేందుకు ఇది టీడీపీ, చంద్రబాబు, మూర్తి కుటుంబంపై దాడిగా కనిపిస్తున్నా.. తెరవెనుక అక్రమాల్లో వ్యవస్దల ప్రమేయాన్ని బయటపెట్టడమే వైసీపీ సర్కారు లక్ష్యంగా కనిపిస్తోంది. వ్యూహాత్మకంగా శనివారం రోజు కూల్చివేతలు నిర్వహించడం వెనుక కూడా కోర్టు సెలవులు, ఇతర కారణాలు కనిపిస్తున్నాయి. వీటికి మించి గీతం అక్రమాలపై ప్రభుత్వ చర్యలను కోర్టులు అడ్డుకుంటే తద్వారా ఆ వ్యవహారాన్ని కూడా జనంలోకి తీసుకెళ్లాలనే భారీ వ్యూహం దాగుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కోర్టులు రాష్ట్రంలో టీడీపీకి, దానికి అనుబంధంగా ఉన్న సంస్ధలు, వ్యవస్ధలకు అనుకూలంగా ఇస్తున్న తీర్పుపై సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్కు లేఖ రాసిన జగన్ మరోసారి టీడీపీకి అనుకూలంగా కోర్టుల నుంచి ఉత్తర్వులు తెచ్చుకుంటే దాన్ని కూడా హైలెట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.