ఆ అవినీతి మంత్రులకు సీఎం జగన్ సీరియస్ వార్నింగ్
పారదర్శక పాలన తన లక్ష్యం అని వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తొలినాడే చెప్పారు.ఇప్పటికే పలుమార్లు మంత్రులు, ఎమ్మెల్యేలకు అవినీతి చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చిన జగన్ వారిపైన కూడా నిఘా నేత్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక తాజాగా ఆయనకు పలు మంత్రుల మీద వచ్చిన అవినీతి ఆరోపణలపై నివేదిక అందింది. దీంతో ఏపీ సీఎం జగన్ తీవ్ర అసహనంతో ఉన్నారు. అమరావతిలో సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పేర్లు చెప్పకుండా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
అవినీతి మంత్రులకు క్యాబినెట్ భేటీలో వార్నింగ్ ఇచ్చిన ఏపీ సీఎం
జగన్ తన పాలనను పారదర్శకంగా సాగించాలని స్పష్టమైన విజన్ తో ఉన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా సాగిన అవినీతి వల్లే ఆ పార్టీ చావు దెబ్బ తిందని జగన్ చాలా గట్టిగా నమ్ముతున్నారు. అందుకే అలాంటి పొరబాటు తన పాలనలో జరగకుండా మొదటి నుండీ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఇప్పటికే మంత్రులకు , ఎమ్మెల్యేలకు అవినీతి సహించనని హెచ్చరికలు జారీ చేసిన జగన్ అవినీతికి పాల్పడుతున్న మంత్రులకు క్యాబినెట్ భేటీలో హెచ్చరికలు జారీ చేశారు.
పేర్లు చెప్పకుండా తీరు మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చిన జగన్
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రుల తీరుపై సీరియస్ అయ్యారు. కొందరు మంత్రులు అవినీతికి పాల్పడుతున్నట్లు తన వద్ద ఆధారాలున్నాయని పేర్కొన్న జగన్ వారి పేర్లను బయటకు చెప్పకుండా హెచ్చరించారు. మంత్రివర్గ సమావేశంలో మాట్లాడిన జగన్ " నేను వారి పేర్లను కూడా బహిర్గతం చేయకూడదు అనుకుంటున్నాను. నేను వారిని పిలిచి మాట్లాడాలి అనుకుంటున్నాను. వారు వారి తీరు మార్చుకోకపోతే వారిపై చర్యలు తీసుకోవడానికి నేను వెనకాడనని జగన్ సమావేశంలో పేర్కొన్నారు.
చర్యలు తీసుకుంటే వారికి తనకు కూడా అవమానం అన్న జగన్
జగన్ మంత్రుల తీరు గురించి ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో అందరూ సైలెంట్ గా విన్నారు. ఇక ఇదే విషయమై మాట్లాడిన జగన్ నేను అవినీతికి పాల్పడుతున్న వారిని పిలిచి చర్యలు తీసుకుంటే అది వారికి , తనకు కూడా అవమానం అని ఆయన పేర్కొన్నారు. ఒక పక్క ఎప్పుడు ఏ చిన్న అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూసే ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వకూడదని ఆయన పేర్కొన్నారు. మంత్రులను జగన్ ఈ విధంగా హెచ్చరించటం ఇది రెండో సారి .
జగన్ వార్నింగ్ తో అధికార పార్టీ నేతల్లో చర్చ
జగన్ అవినీతి రహిత పాలన అందించేందుకు చాలా కష్టపడుతున్నారు. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు ఇక అవినీతికి పాల్పడితే జగన్ వేసిన మూడోకన్నుకు బలికాక తప్పదని కాసింత తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలతో అర్ధం అవుతుంది . ఏది ఏమైనా 9 ఏళ్ళ పాటు ప్రతిపక్షంలో ఉండి పాలక పక్షం అవినీతి చూసి నేర్చుకున్నపాఠం కావటంతో జగన్ తన పాలనలో జాగ్రత్త పడుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక జగన్ వార్నింగ్ తో మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలలో పెద్ద చర్చ జరుగుతుంది.