జగన్ మెచ్చిన ఆ ఐదుగురు మంత్రులు..! పూర్తి స్థాయిలో ఉండేదీ వారేనట..!!
అమరావతి/హైదరాబాద్ : ఏపి పాలనలో సీఎం జగన్ మెహన్ రెడ్డి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో అటు మంత్రులు గాని, ఇటు అదికారులు గాని ఎవ్వరూ కూడా పట్టు తప్పకుండా పకడ్బందీగా పాలన కొనసాగిస్తున్నారు యువ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇక జగన్ మెహన్ రెడ్డి ఏపి పగ్గాలు చేపట్టి వందరోజులు కావస్తున్న తరుణంలో మంత్రుల పనితీరును, ప్రతిపక్ష పార్టీకి ఎవరు సరైన రీతిలో సమాధానం ఇచ్చారు అనే అంశాలపై సీఎం దృష్టి సారించినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రతిపక్షానికి సమాదానం ఇచ్చే క్రమంలో తొందరపడి ప్రభుత్వానికి నష్టం కలిగే ప్రకటనలు చేసిన మంత్రులు ఎవరు అనే విషయంపైన కూడా జగన్ నిఘా పెట్టినట్టు తెలుస్తోంది.
జగన్ మంత్రి వర్గం..! పూర్తి స్థాయిలో ఉండేదెవరనే అంశంపై ఆసక్తికర చర్చ..!!
అంతే కాకుండా మంత్రి వర్గంలో పూర్తి స్థాయిలో ఎవ్వరిని కొనసాగించాలనే అంశంపై కూడా జగన్ తన అత్యంత సన్నిహితులతో లోతుగా చర్చించుకున్నట్టు తెలుస్తోంది. ఆ ఐదుగురు మంత్రులకు రాబోవు ఐదేళ్లు ఎలాంటి ఢోకా ఉండదనే చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే ఆ ఐదుగురు మంత్రులు జగన్మోహన్ రెడ్డికి ఎంత సన్నిహితులో దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డికి కూడా అంతే సన్నిహితులని తెలుస్తోంది. వారి విశ్వసనీయత పట్ల జగన్ కు అచంచల విశ్వాసం ఉండడంతో రాబోవు ఐదేళ్ల వరకు కూడా వారు ఖచ్చింతంగా మంత్రి వర్గంలో కొనసాగుతారనే చర్చ జరుగుతోంది.
కొత్త మంత్రుల పనితీరుపై నిఘా..! జాగ్రత్తగా అడుగులు వేస్తున్న వైసీపి ప్రభుత్వం..!!
తాజాగా సామాజిక కోణంలో మంత్రి పదవులు చేపట్టిన కొత్తవారు - ఇంకొందరి పనితీరుపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గ విస్తరణలో పదవులు కోల్పోవడం గ్యారెంటీ అన్న ప్రచారం వైసీపీలో శ్రేణుల్లో సాగుతోంది. మరి పూర్తి స్థాయిలో కేబినెట్ లో ఉండే మంత్రులు ఎంత మంది అనే చర్చ ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో సాగుతోంది. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, జగన్ తోపాటు ప్రస్తుతం ఉన్న 25మంది మంత్రుల కేబినెట్ లో కేవలం ఐదుగురు మాత్రమే సురక్షితంగా ఉండబోతున్నారని విశ్లేషణలు సాగుతున్నాయి. ఆ ఐదుగురు ఐదేళ్ల పాటు మంత్రులుగా ఉంటారని, మిగతా 20 మంది మారుతారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి జగన్ మెచ్చిన ఆ ఐదుగురు ఎవరనే అంశం మీద కూడా ఆసక్తి నెలకొంది. సీఎం జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడే పూర్తి హామీ లభించిన మంత్రులు ఐదుగురు ఉన్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది.
నమ్మిన నేతలకు ప్రాముఖ్యత..! కొనసాగించే దిశగా సీఎం సమాలోచనలు..!!
ఆ ఐదుగురిలో మొదటి హామీ పొందింది మోపిదేవీ వెంకటరమణ అనే చర్చ జరుగుతోంది. మోపిదేవి వెంకట రమణ మొన్నటి ఎన్నికల్లో గుంటూరు జిల్లా రేపల్లె లో పోటీచేసి ఓడిపోయారు. అయినా పార్టీ పెట్టినప్పటి నుంచి తనతో నడిచిన మోపిదేవీని ఎమ్మెల్సీ చేసి మరీ జగన్ కేబినెట్ లో చోటు కల్పించారు. ఈయన ఐదేళ్లు మంత్రిగా ఉండడం గ్యారెంటీ అన్న సంకేతాలు ఇచ్చారట. ఐదేళ్ల పాటు ఈయన మంత్రిగా ఉంటారని, జగన్ హామీ ఇచ్చినట్టు సమాచారం. ఇక వైఎస్ కేబినెట్ లో మంత్రిగా ఉండి ఆయన మరణానంతరం జగన్ వెంట నడిచిన మరో కీలక నేత పిల్లి సుభాష్ చంద్రబోస్. వివాదరహితుడుగా పేరున్న ఈయనను కూడా జగన్ మంత్రిని చేశారు. పైగా బీసీ నేత కావడంతో ఈయన ఐదేళ్లు గ్యారెంటీ అన్న చర్చసాగుతోంది. ఇక ప్రతిపక్షంలో ఉండగా జగన్ కు ఆర్థికంగా - నైతికంగా మద్దతుగా నిలిచిన చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రరెడ్డి. జగన్ కు అత్యంత సన్నిహిత నేతల్లో ఒకరు. ఈయన ఐదేళ్లు నిస్సందేహంగా మంత్రివర్గంలో ఉంటారనే చర్చ జరుగుతోంది.
ఆ ఐదుగురి పైనే జగన్ గురి..! విశ్వాసానికి పెద్ద పీట వేయనున్న యువ సీఎం..!!
వైసీపీ సీనియర్ నేతల్లో బొత్సా సత్యనారాయణ ఒకరు. వైఎస్ హయాం నుంచి వీరి ఫ్యామిలీకి నమ్మినబంటుగా పనిచేస్తూ వస్తున్నారు. ఈయన ఐదేళ్లు మంత్రిగా ఉండడం గ్యారెంటీనే అన్న చర్చ పార్టీలో సాగుతోంది. ఉత్తరాంద్రలో కీలక నేత కావడంతో ఈయనను మార్చే సాహసం పార్టీ చేయలేదు. అందుకే బొత్స బెర్త్ ఐదేళ్లు పదిలంగా ఉంటుందని పార్టీ శ్రేణులు విశ్వసం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్షంలో, పాదయాత్రలో జగన్ కు తోడుగా నడిచిన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి. జగన్ కుటుంబానికి కూడా దూరపు బంధువు. ఈయనకు కూడా జగన్ మంత్రిగా భరోసా ఇచ్చారని ప్రచారం సాగుతోంది. ఇవే అంశాలను పరిగణలోకి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలొ కేవలం ఐదుగురు మంత్రులే పూర్తి స్థాయిలో ఐదేళ్లు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా మంత్రులందరూ రెండున్నరేళ్ల తర్వాత వారి ప్రతిభను బట్టి మార్పులు చేర్పులు జరుగుతాయనే చర్చ జరుగుతోంది.