రేపు సీబీఐ కోర్టుకు హాజరుకానున్న సీఎం జగన్.. బందోబస్తుకు తెలంగాణా పోలీసుల కసరత్తు
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణలో రేపు సీబీఐ కోర్టుకి హాజరుకానున్నారు. సీఎం జగన్ తో పాటు, ఎంపీ విజయసాయి రెడ్డి కూడా కోర్టు ముందు హాజరు అవుతున్నారు. ఇందుకోసం సీబీఐ కోర్టు వద్ద బందోబస్తుకు తెలంగాణా పోలీసులు కసరత్తు చేస్తున్నారు. రేపు సీఎం కోర్టుకు హాజరుకానున్నట్టు ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నుంచి తెలంగాణ పోలీసులకు లేఖ అందింది.
ప్రతివారం మినహాయింపు కుదరదన్న సీబీఐ కోర్టు
అక్రమాస్తుల కేసులో గత కొన్ని నెలలుగా జగన్ విచారణకు హాజరుకావడం లేదు. దీంతో గత వారం జగన్ న్యాయవాదులపై సీబీఐ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణకు హాజరుకావాలని జగన్, విజయసాయిరెడ్డికి ఆదేశాలు ఇచ్చింది. ప్రతివారం హాజరు మినహాయింపు ఇవ్వడం కుదరదని సీబీఐ కోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్, విజయసాయిరెడ్డి రేపు కోర్టుకు హాజరు కానున్నారు.
గతంలోనే వ్యక్తిగత హాజరు మినహాయింపును తోసిపుచ్చిన సీబీఐ కోర్టు
ఏపి సిఎం జగన్ మోహన్ రెడ్డి నేడు సీబీఐ కోర్టులో విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ ఏపీలో వైసీపీ అధికారం చేపట్టన నాటి నుండి ఇప్పటి వరకు ఆయన హాజరు కాలేదు. జగన్ అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలోని సి.బి.ఐ ప్రత్యేక న్యాయస్థానానికి సీఎం జగన్, విజయసాయిరెడ్డి లు హాజరు కావాలి .ఇక ఈ కేసు విషయంలో తనకు వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వమని కోరినా కోర్టు జగన్ అభ్యర్థనను తోసిపుచ్చింది. కచ్చితంగా హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది.
వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్కసారి కూడా కోర్టుకు హాజరుకాని జగన్
అయినప్పటికీ ఇప్పటి వరకు ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావలసిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీలో పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుండి కోర్టులో విచారణకు హాజరుకాకుండా అధికారిక కార్యక్రమాల వంకతో వెళ్ళటం లేదు . ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో కోర్టుకు తప్పకుండా హాజరు కావాలని గత శుక్రవారం హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ఏ1, ఏ2 నిందితులు ప్రతి శుక్రవారం విచారణకు హాజరు కావాల్సిందేనని జగన్ తరఫు న్యాయవాదికి సీబీఐ కోర్టు స్పష్టంగా చెప్పింది .
సీఎం హోదాలో తొలిసారి రేపు సీబీఐ కోర్టుకు జగన్ .. భారీ బందోబస్తు
ఈనెల 10న విచారణకు హాజరై తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. నేరానికి, హోదాకు సంబంధం లేదని కోర్టు పేర్కొంది. ఇక ఈ నేపధ్యంలోనే రేపు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరుకానున్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చాక జగన్ తొలిసారి సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరు కానున్నారు. సీఎం హోదాలో ఆయన తొలిసారి కోర్టుకు హాజరుకానున్న నేపధ్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు తెలంగాణా పోలీసులు.