వీధి వ్యాపారాలు చేసేవారికి "జగనన్న తోడు": రూ. 10వేల ఆర్ధిక భరోసా..ఈ నెల 25న శ్రీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల విషయంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రాష్ట్రంలో అన్ని వర్గాల వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పిన జగన్ ఇప్పటికే పిల్లల చదువు దగ్గర నుండి వృద్ధుల వరకు ఆర్ధికంగా అండగా ఉండేందుకు పలు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. మహిళలకు కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తూ,తద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేసేలా చేస్తున్నారు. ఇక తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్.
జగనన్న తోడు పేరుతో నవంబర్ 25వ తేదీన పథకానికి శ్రీకారం
రాష్ట్రవ్యాప్తంగా వీధి వ్యాపారాలు చేసుకునే వారికి ఆర్థిక భరోసా కల్పించడం కోసం నిర్ణయం తీసుకున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి దానికోసం ప్రణాళికలు సిద్ధం చేయించారు. ఇందులో భాగంగా వీధి వ్యాపారాలు చేసుకునే వారికి జగనన్న తోడు పేరుతో నవంబర్ 25వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. వారికి 10 వేల రూపాయల ఆర్ధిక భరోసా అందించి, వడ్డీ లేని రుణాల ద్వారా వారి వ్యాపార తోడ్పాటును అందించనున్నారు. ఇక ఈ విషయాన్ని తాజాగా కలెక్టర్లు, ఎస్పీలు, జెసి లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం జగన్ పేర్కొన్నారు.
చిరువ్యాపారులకు వడ్డీ లేని రుణాలు .. వడ్డీ ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లించే ఏర్పాటు
అధికారంలోకి వచ్చినప్పటి నుండి సంక్షేమ పథకాల నిర్వహణకు పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ పథకం ద్వారా వీధులలో చిరు వ్యాపారులకు ఐడి కార్డులు ఇవ్వడంతోపాటుగా పది వేల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలను అందించనున్నారు. చిరు వ్యాపారులకు అందించే రుణాలకు సంబంధించిన వడ్డీని పూర్తిగా ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 6.29 లక్షల దరఖాస్తులు బ్యాంకులకు చేరాయని, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా ఈ పథకం లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకోకుంటే, త్వరితగతిన వారిని గుర్తించి, వారి దరఖాస్తులను సైతం 24వ తేదీలోగా బ్యాంకులతో అనుసంధానం చేసేలా అధికారులు చూడాలని సీఎం జగన్ కలెక్టర్లను ఆదేశించారు.
10 వేల రూపాయలు చిరు వ్యాపారుల ఖాతాల్లో
జగనన్న తోడు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా తోపుడు బండ్లు, రోడ్ల పక్కన వ్యాపారాలు చేస్తున్న చిరు వ్యాపారులను ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్న జగన్ అధికారులకు ఆ దిశగా ఆదేశాలు జారీ చేశారు. లబ్దిదారులను గుర్తించాలని సూచించారు. అర్హులు జాబితాలను గ్రామ, వార్డు సచివాలయం నోటీసు బోర్డులో ఉంచి సామాజిక తనిఖీ నిర్వహించి ఆ తర్వాత వారు అర్హులు అయితేనే వారి ఖాతాలో 10000 రూపాయలు జమవుతాయని తెలుస్తుంది.
Recommended Video
జగనన్న తోడు పథకానికి అర్హతలు ఇవే
జగనన్న తోడు అర్హతలు విషయానికొస్తే గ్రామాలు పట్టణాల్లో సుమారు ఐదు అడుగుల పొడవు , 5అడుగుల వెడల్పు స్థలంలో, లేదా అంతకంటే తక్కువ స్థలంలో శాశ్వత లేదా తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకొని ఉండాలి. అంతేకాదు తోపుడు బండి మీద వ్యాపారాలు చేసేవారు, గంపలో పెట్టుకొని ఇల్లిల్లు తిరిగి విక్రయాలు జరిపేవారు సైకిల్, మోటార్ సైకిల్, ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎవరైనా దీనికి అర్హులే. కుటుంబ ఆదాయం గ్రామాల్లో అయితే నెలకు పదివేల రూపాయలు లోపు పట్టణాల్లో అయితే 12 వేల రూపాయల లోపు కలిగి ఉన్నవారు అర్హులు. 18 ఏళ్ళ వయస్సు నిండిన వారు ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, ప్రభుత్వం జారీ చేసిన ఇతర గుర్తింపు కార్డులు కలిగి ఉన్నవారు ఈ పథకానికి అర్హులని తెలుస్తుంది.