జగనన్న విద్యా కానుక నెలరోజుల వాయిదా: కేంద్ర మార్గదర్శకాలతో పొడగింపు..
కరోనా వైరస్ వల్ల అన్ లాక్ 4.0 మార్గదర్శకాల్లో భాగంగా ఈ నెల 30వ తేదీ వరకు పాఠశాలల తెరవబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. దీంతో ఆ మేరకు రాష్ట్రాలు కూడా చర్యలు తీసుకుంటున్నాయి. 5వ తేదీ నుంచి పాఠశాలలు పున: ప్రారంభిస్తామని ఏపీ సర్కార్ తెలిపింది. కానీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో వెనక్కి తగ్గింది.
జగనన్న విద్యా కానుక కార్యక్రమం వాయిదా వేశారు. కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర పాఠశాల విద్య డైరెక్టర్ తెలిపారు. అక్టోబరు 5న జగనన్న విద్యా కానుక కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. సెప్టెంబరు 30 వరకు పాఠశాలలు తెరవరాదని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 5న చేపట్టాల్సిన జగనన్న విద్యా కానుక నెల రోజులు పొడగించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సమగ్రశిక్ష ఆధ్వర్యంలో కిట్ల పంపిణీ చేస్తారు. ఒక్కో విద్యార్థికి మూడు జతల యూనిఫాం, నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగులను కిట్ రూపంలో అందజేస్తారు. రాష్ట్రస్థాయిలో కొనుగోలు చేసిన వస్తువులు మండల రిసోర్సు కార్యాలయాలకు అందజేస్తారు.