ఆ 7వేల ఎకరాలతో స్టీల్ ప్లాంట్ ప్రాబ్లమ్స్ కు చెక్: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపటానికి సీఎం జగన్ స్కెచ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరించం కుండా అడ్డుకోవడానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్లాన్ ఏంటి ? విశాఖ ఉక్కు కర్మాగారం కష్టాలనుంచి బయటపడడానికి, విశాఖ ఉక్కు ను సంపన్నం చేయడానికి ఏపీ సీఎం జగన్ చేస్తున్న ఆలోచన ఏంటి ? అసెంబ్లీలో విశాఖ ఉక్కు పై తీర్మానం పెడతామని ప్రకటన చేసిన సీఎం జగన్ ప్రధానికి రాసిన లేఖలో ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు ఏమిటి ? అన్నది ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది.
Recommended Video
7 వేల ఎకరాల భూమిని విక్రయించడానికి కేంద్రం అనుమతి కోరిన జగన్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడాన్ని అడ్డుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నానని ప్రకటించారు. పోస్కో సంస్థను విశాఖలో అడుగుపెట్టనివ్వనని ప్రకటించారు. అంతేకాదు లక్షలాది మంది కార్మికులకు జీవనోపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయకుండా కర్మాగారంలో నిరుపయోగంగా ఉన్న 7 వేల ఎకరాల భూమిని విక్రయించడానికి ప్రభుత్వానికి అనుమతిస్తే విశాఖ ఉక్కు సంపన్నమవుతుందని, అప్పుడు దానిని ప్రైవేటీకరించవలసిన అవసరం లేదని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు.
నిరుపయోగంగా ఉన్న విశాఖ ఉక్కు భూమి ప్లాట్లు వేసి విక్రయించేందుకు జగన్ ఆలోచన
విశాఖ ఉక్కు కర్మాగారం లో నిరుపయోగంగా ఉన్న 7 వేల ఎకరాల భూమికి ప్రభుత్వం నుంచి అనుమతి ఇచ్చి లేఅవుట్లు, ప్లాట్ లు వేసి స్టీల్ ప్లాంట్ ద్వారా విక్రయిస్తే ప్లాంట్ కు కావలసిన నగదు నిల్వలు పెరుగుతాయని అప్పుడు దానిని ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదని సీఎం జగన్ ఆలోచిస్తున్నారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాసిన లేఖలో కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారని తెలుస్తుంది .
సొంత గని కేటాయించాలని కేంద్రానికి సూచన
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా చూడడం కోసం ప్రధానికి రాసిన లేఖలో విశాఖ ఉక్కు సమస్యకు తగిన పరిష్కార మార్గాలు వివరిస్తూ స్టీల్ ప్లాంట్ కు ఉన్న అప్పులు, బ్యాంకులకు చెల్లిస్తున్న వడ్డీలు, సొంత గనులు లేకపోవడం వంటి సమస్యలను వివరించానని, ఒడిస్సా లో ఇనుప ఖనిజం పుష్కలంగా ఉందని, అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఒక సొంత గనిని కేటాయిస్తే బాగుంటుందనే ప్రతిపాదన కూడా చేశానని, విశాఖ ఉక్కు నష్టాల నుంచి బయట పడడానికి కావలసిన అన్ని ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభుత్వానికి సూచించానని సీఎం జగన్ స్వయంగా కార్మిక సంఘం నేతలకు తెలిపారు.
ప్లాంట్ లో ఉత్పత్తిపై దృష్టి పెట్టాలని కార్మికులకు విజ్ఞప్తి చేసిన జగన్
అసెంబ్లీలో సైతం విశాఖ ఉక్కు పై కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా బడ్జెట్ సమావేశాల్లో తీర్మానం పెడతామని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నం చేస్తుందని కానీ స్టీల్ ప్లాంట్ ఎక్కడ మూత పడకుండా అంతకంటే మెరుగ్గా నిర్వహించాలని సీఎం జగన్ కార్మికులను కోరారు. కార్మికుల ఆందోళన వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ మూతపడుతుందని, ఉత్పత్తి సక్రమంగా జరగడం లేదన్న మాట రాకుండా చూసుకోవాలని సీఎం జగన్ సూచించారు.
ఆందోళనలు విరామ సమయంలో .. ప్లాంట్ ను కాపాడుకుందామన్న సీఎం
విరామ సమయంలోనే ఆందోళనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. పరిశ్రమలు కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికులందరూ పై ఉందని స్పష్టం చేసిన ఆయన ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. సీఎం జగన్ చేసిన ప్రతిపాదనలు, విశాఖ ఉక్కు విషయంలో తీసుకున్న నిర్ణయాలు, కార్మికులకు చేసిన సూచనలను బట్టి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ విషయంలో జగన్ వ్యూహం ఇట్టే అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ సీఎం జగన్ చేసిన ప్రతిపాదనలను, కేంద్రం ఒప్పుకుంటుందా లేదా? విశాఖ ఉక్కు విషయంలో కేంద్రం నిర్ణయం మార్చుకుంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.