అభివృద్ధి తెలుసా:కెసిఆర్పై జగ్గారెడ్డి, దగ్గుబాటిపై పొన్నం
తెలంగాణ రాష్ట్ర సమితికి ఉన్న రెండు పార్లమెంటు స్థానాలను చూసి కాంగ్రెసు పార్టీ తెలంగాణను ప్రకటించలేదన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలు, ఉద్యోగులు నష్టపోతున్నారని చూసి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని చెప్పారు. అభివృద్ధికి అర్థం తెలియని కెసిఆర్ పునర్ నిర్మాణం అనడం హాస్యాస్పదమన్నారు.
తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలు రానున్న సార్వత్రిక ఎన్నికలలో పట్టం కట్టడం ఖాయమన్నారు. కాంగ్రెసు పార్టీ ఒంటరిగా పోటీ చేసినా 90 సీట్లలో గెలుపొందుతుందని చెప్పారు.
ఎన్టీఆర్ అల్లుళ్లకు వెన్నుపోటు వారసత్వం వచ్చిందని ఎంపి పొన్నం ప్రభాకర్ టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటిలను ఉద్దేశించి అన్నారు. ఎన్టీఆర్కు చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే, దగ్గుబాటి కాంగ్రెసు పార్టీకి పొడిచారన్నారు. కాంగ్రెసు పార్టీ రాష్ట్రాన్ని విభజించిందని చెబుతున్న పురంధేశ్వరికి బిజెపి ఏం చేసిందో తెలియదా అని ప్రశ్నించారు.
తెలంగాణలో టిడిపిని గెలిపించాలని బిసి సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య చెప్పడం విడ్డూరమని నిజామాబాద్ ఎంపి మధుయాష్కీ అన్నారు. తెలంగాణకు ద్రోహం చేసిన టిడిపిని గెలిపించాలని కోరితే బిసిలు ఆయనను చీదరించుకుంటారన్నారు. బిసిల గౌరవాన్ని ఆయన తాకట్టు పెట్టారన్నారు. తాము విలీనం, పొత్తులు కోరుకోవడం లేదని చెప్పారు.
అమరుల వల్లే: విహెచ్
అమరవీరుల త్యాగం వల్లే తెలంగాణ వచ్చిందని మెదక్ జిల్లాలో వి హనుమంత రావు అన్నారు. తెరాస మాత్రమే తెలంగాణ తెచ్చినట్లు కెసిఆర్ ప్రచారం చేయడం విడ్డూరమన్నారు. తెలంగాణ ఇస్తే చాలు రాజకీయాలు అవసరం లేదన్న కెసిఆర్ ఇప్పుడు... కుటుంబ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా తెరాసను కాంగ్రెసులో విలీనం చేయాలన్నారు.