నక్కెవరో.. తోడేలెవరో ప్రజలే తేలుస్తారు: కెసిఆర్పై రేణుక
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావుపై సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ తన ఇష్టిమొచ్చినట్లు మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. నక్క నైజమే కెసిఆర్ వైఖరి అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను తోడేళ్లు అని కెసిఆర్ ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే.
కెసిఆర్వన్నీ నక్క వినయాలు.. నక్కజిత్తులు అని జగ్గారెడ్డి ఆరోపించారు. తోడేళ్ల కంటే నక్కలే ప్రమాదమని ఆయన అన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో సీమాంధ్రకు చెందిన ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడుల మోచేతి నీళ్లు తాగలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ వస్తే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పి.. ఇప్పుడు అధికారం కోసం ఆరాటపడుతున్నారని ఆరోపించారు.
తెలంగాణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కాళ్ల మీద పడలేదా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. అప్పుడు టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని చెప్పి కెసిఆర్ మాట తప్పారని ఆరోపించారు. కెసిఆర్ మాటలు తెలంగాణకు నష్టం తెచ్చేలా ఉన్నాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి 15 అసెంబ్లీ స్థానాలకు మించి రావని, ఒక్క ఎంపి సీటు కూడా రాదని జగ్గారెడ్డి జోస్యం చెప్పారు.
కాంగ్రెస్ ఆదేశిస్తే ఖమ్మం నుంచి పోటీ చేస్తా: రేణుక
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వైపే ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుక చౌదరి అన్నారు. నక్కలెవరో.. తోడేళ్లవరో ప్రజలే తేలుస్తారని కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే తాను ఖమ్మం నుంచి పోటీ చేస్తానని చెప్పారు. టిఆర్ఎస్ పార్టీతో పొత్తు కాంగ్రెస్కు అవసరం లేదని తెలిపారు.
తెలంగాణ ప్రజలను కొట్టిన వాళ్లనే టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ తన పార్టీలో చేర్చుకుంటున్నారని కాంగ్రెస్ ఎంపి మధుయాష్కీ ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోనియా గాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని తెలిపారు.