కేవీపీ ఇంట్లో మంతనాలు: అరుణ్ జైట్లీపై బాంబు పేల్చిన జైరాం రమేశ్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా ఇవ్వొద్దని 14వ ఆర్ధిక సంఘం సిఫారసు చేయలేదని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా కోరుతూ రాజ్యసభలో ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై చర్చించేందుకు బుధవారం కేవీపీ ఇంట్లో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో భాగంగా జైరాం రమేశ్ మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వొద్దని 14వ ఆర్ధిక సంఘం ఎవరికీ చెప్పలేదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు 14వ ఆర్ధిక సంఘానికి సంబంధించిన డాక్యుమెంట్ను సైతం మీడియాకు అందజేశారు. మంగళవారం రాత్రి ఆర్ధిక సంఘం ఛైర్మన్తో మాట్లాడటం జరిగిందని చెప్పారు.
పన్నుల వసూళ్ల అనంతరం రాష్ట్రాలకు కేటాయించే వాటాలను 32 శాతం నుంచి 42 శాతానికి మాత్రమే పెంచిందని, ప్రత్యేకహోదా గురించి ఎక్కడా ప్రస్తావించలేదని ఆయన పేర్కొన్నారు.కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆదాయాలు, పంపకాలపైనే అధికంగా ఆర్థిక సంఘం సిఫార్సులు చేస్తుందని ఆయన గుర్తు చేశారు.సహజంగానే కొన్ని రాష్ట్రాలు వీటిని అంగీకరిస్తాయని వెల్లడించారు.
ప్రత్యేక హోదా అంశాన్ని ఆర్థిక సంఘం రద్దు చేయలేదన్నారు. అందుకు సంబంధించిన మెయిల్ను జైరాం రమేష్ బయటపెట్టారు. గత వారంలో రాజ్యసభలో ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై జరిగిన చర్చలో ఆర్ధిక మంత్రి నిబంధనలను సాకుగా చూపి ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వలేమని తేల్చేసిన దానిపై కూడా ఆయన స్పందించారు.
రాజ్యసభలో జరిగిన చర్చలో అరుణ్ జైట్లీ రాజ్యాంగం పేరు చెప్పి సభను తప్పుదోవ పట్టించారని ఆయన మండిపడ్డారు. సభలో జైట్లీ చెప్పినవన్నీ అబద్దాలేనని ఆయన తేల్చి చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు విభజనకు అంగీకరించిన తర్వాతనే తాము ఏపీ విభజన చేసినట్లు ఈ సందర్భంగా చెప్పారు.
కేవీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లుపై చర్చించేదుకు ఆయన ఇంట్లో జరిగిన సమావేశానికి ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరారెడ్డితో పాటు పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు ఆగస్టు 5న మరోసారి చర్చకు రానున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నేతలు సమావేశమయ్యారు.
కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లను ద్రవ్య బిల్లు అని అరుణ్ జైట్లీ తెల్చిన నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాంపై ఈ సమావేశంలో చర్చించారు. మరోవైపు కేవీపీ బిల్లుపై ఆగస్టు 4వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. రాజ్యసభలో అనుసరించాల్సిన వ్యూహాంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.