విభజనపై బాబుకి జైరాం సమాచారం, కెసిఆర్కు ఇస్తానని
ఢిల్లీ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు సంబంధించిన సమాచారాన్ని తాను తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కాబోయే ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఇచ్చానని కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేష్ సోమవారం తెలిపారు. జైరామ్ రమేష్, చంద్రబాబులు ఉదయం ఢిల్లీలోని ఎపి భవన్లో కలిశారు.
ఈ సందర్భంగా విభజన అంశంపై గత ప్రభుత్వ చర్యలను చంద్రబాబు అడిగారని, తాను ఎపి నుండి ఎంపీ అయినందున విభజనకు సంబంధఇంచిన సమాచారాన్ని ఆయనకు ఇచ్చానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అడిగినా విభజన సమాచారం ఇస్తానని తెలిపారు.
ఆంధ్రా ఉద్యోగులు వద్దు
ఆంధ్రా ప్రాంత ఉద్యోగులు తెలంగాణ సచివాలయంలో పని చేసేందుకు అంగీకరించేది లేదని తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్ రావు హైదరాబాదులో తెలిపారు. ఏ ప్రాంత ఉద్యోగులు ఆ ప్రాంతంలో పని చేయాల్సిందేనన్నారు. తాత్కాలిక సర్దుబాట్లకు కూడా తాము అంగీకరించమన్నారు. అందుకు ఉన్నతాధికారులు చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తామన్నారు.
తెలంగాణ కోసం ఒక్కరోజు వేతనం
తెలంగాణ నిర్మాణానికి జైళ్ల శాఖ ఉద్యోగులు ఒక్క రోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. తెలంగాణ ప్రిజనర్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు తమ ఒక్క రోజు వేతనాన్ని తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కెసిఆర్కు అందజేశారు. తెలంగాణ భవన్లో కెసిఆర్కు కలిసి విరాళానికి సంబంధించిన పత్రాన్ని అందించారు.
చంద్రబాబుపై భూమన ఫైర్
చంద్రబాబుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత నేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తమ పార్టీ ప్రతిపక్షంలో ఉండటంతో చంద్రబాబుకు భయం పట్టుకుందని, నిద్ర కూడా పట్టడం లేదని ఎద్దేవా చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారని టిడిపి నేతలు, ఎల్లో మీడియా కుయుక్తులకు పాల్పడుతోందన్నారు.