పాల్వాయికి జైరాం వార్నింగ్: కాంగ్రెస్లోకి శ్రవణ్, కట్టెల
హైదరాబాద్: కేంద్రమంత్రి జైరాం రమేష్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి ఇంటికెళ్లి మరీ వార్నింగ్ ఇచ్చారు. నల్గొండ జిల్లాలోని మునుగోలు నుంచి కాంగ్రెస్ పార్టీ రెబల్గా నామినేషన్ వేసిన పాల్వాయి కుమార్తె స్రవంతి రెడ్డితో నామినేషన్ ఉపసంహరింపచేయాలని జైరాం రమేష్ ఆయనకు సూచించారు.
శనివారం ఉదయం పాల్వాయ్తో ఆయన నివాసంలోనే జైరాం సమావేశమయ్యారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే హైకమాండ్ చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా జైరాం రమేష్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్-సిపిఐ పొత్తులో భాగంగా మునుగోలు సీటును సిపిఐ కేటాయించడంతో కాంగ్రెస్ పార్టీ ఈ స్థానం నుంచి తమ అభ్యర్థిని పోటీకి దింపలేదు.
కాంగ్రెస్లోకి శ్రవణ్, కట్టెల శ్రీనివాస్
కేంద్రమంత్రి జైరాం రమేష్, తెలంగాణ పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో పలువురు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. టిఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడ్ శ్రవణ్, నాయకుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్లను కాంగ్రెస్ కండువా కప్పిన జైరాం రమేష్, పొన్నాల లక్ష్మయ్య పార్టీలోకి ఆహ్వానించారు. వారితోపాటు పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
జానా రెడ్డితో జైరాం భేటీ
కేంద్రమంత్రి జైరాం రమేష్తో మాజీ మంత్రి జానారెడ్డి, పలువురు నాయకులు భేటీ అయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచారం, తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగించే విషయంపై చర్చించినట్లు తెలిసింది. ప్రచారం వేగవంతం చేయాలని జానారెడ్డికి జైరాం సూచించినట్లు సమాచారం.