సీమాంధ్రపై జైరాం లేఖ: జగన్తో కల్సి... కిరణ్పై పెద్దిరెడ్డి
న్యూఢిల్లీ/హైదరాబాద్: కేంద్రమంత్రి, మంత్రుల బృందం సభ్యులు (జివోఎం) జైరామ్ రమేష్ ప్రణాళిక సంఘానికి లేఖ రాశారు. సీమాంధ్రకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని జైరామ్ రమేష్ అందులో పేర్కొన్నారు.
కెవిపిని కలిసిన సీమాంధ్ర మంత్రులు
రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్ర రావును సీమాంధ్ర ప్రాంత మంత్రులు కలిశారు.
కిరణ్ పార్టీపై పెద్దిరెడ్డి సవాల్
కిరణ్ కుమార్ రెడ్డి పెట్టే కొత్త పార్టీ ఒక్క సీటు గెల్చినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మంగళవారం సవాలు విసిరారు. ఆయన చిత్తూరు జిల్లాలో మాట్లాడారు. కిరణ్ కొత్త పార్టీ పెడితే డిపాజిట్లు కూడా రావన్నారు. పార్టీ పెట్టినాక అవమానం జరిగితే రాష్ట్రాన్ని వదిలి ఢిల్లీయో లేక, బెంగళూరో వెళ్లిపోవాలన్నారు. కిరణ్ ఉత్తర కుమార ప్రగల్భాలేనని, జగన్కు మద్దతిచ్చి కిరణ్ చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని హితవు పలికారు.
రాజకీయ అనిశ్చితిపై హైకోర్టులో వ్యాజ్యం
రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి తొలగించాలంటూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పరిణామాలపై కృష్ణదేవన్ అనే న్యాయవాది పిల్ దాఖలు చేశారు. సిఎం రాజీనామా చేసి వారం రోజులు గడుస్తున్నా ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరినీ పిలవలేదని, రాష్ట్రపతి పాలన కూడా విధించలేదని పిల్లో పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్, స్పీకర్, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణలను, టిడిపి చీఫ్ నారా చంద్రబాబు నాయుడులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
టైం లేకుండా పని చేయాలని టిఎన్జీవో
విభజన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సమయంతో సంబంధం లేకుండా పని చేయాలని టిఎన్జీవోలు నిర్ణయించుకున్నారు. మార్చి 15 నుండి 31వ తేదీ వరకు తెలంగాణ పునర్ నిర్మాణ సదస్సులు నిర్వహించనున్నారు. తెలంగాణలో 27 శాతం ఆంధ్రా ఉద్యోగులను భరించలేమని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెసు పార్టీలో విలీనమైతే తెలంగాణ కోసం ప్లాట్ ఫాం ఉండదని వారు అభిప్రాయపడ్డారు.