ఏపీ పట్ల సానుభూతి, 2 అంశాలే మిగిలి ఉన్నాయి, మీరు కోరింది కాదు: జైట్లీ షాక్, బాబు కోర్టులోకి బంతి
న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం మరోసారి స్పందించారు. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. అయితే హోదా బదులు ఆ స్థాయిలో ప్యాకేజీ ఇవ్వడానికి తాము సిద్ధమని చెబుతున్నామన్నారు. తద్వారా ఆయన బంతిని రాష్ట్రం కోర్టులోకి నెట్టారు.
ప్రత్యేక హోదాతో ఏం ఒరుగుతుంది, 90 శాతం ఇస్తున్నాం, మేం అలా చెప్పామా: జైట్లీ
కేంద్రం వద్ద నిధుల వరద పారడం లేదన్నారు. కేంద్రం వద్ద నిధులు లేవని, విపరీతంగా వచ్చి పడటం లేదని జైట్లీ చెప్పారు. 2013-14 లెక్కల ప్రకారం రెవెన్యూ లోటు రూ.4వేల కోట్లు మంజూరు చేశామని చెప్పారు. 2014-16కు రెవెన్యూ లోటును లెక్కించాల్సి ఉందని చెప్పారు. పన్ను ప్రోత్సాహకాలు తొలి రెండు బడ్జెట్లలో కేటాయించామని చెప్పారు.
ఏపీపై సానుభూతి ఉంది
రాష్ట్ర విభజనతో ఏపీ నష్టపోయిందని తెలుసునని జైట్లీ చెప్పారు. అందుకు సానుభూతి ఉందని తెలిపారు. చట్టంలో పొందుపర్చిన ప్రతి అంశాన్ని అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎన్ని నిధులు ఇవ్వాలో ఫైనాన్స్ కమిషన్ నిర్ణయిస్తుందన్నారు. హోదాతో సమానమైన ప్యాకేజీ ఇస్తున్నామన్నారు. ఏపీ కోరుకున్న విభజన కాదన్నారు.
ఏపీతి ప్రత్యేక పరిస్థితి, 29 రాష్ట్రాల బాధ్యత
లోటు బడ్జెట్ పైన జైట్లీ మాట్లాడుతూ.. ఇప్పటికే దాదాపు రూ.4వేల కోట్లు చెల్లించామని, మిగతా లెక్కిస్తే చెల్లిస్తామని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఆనవాయితీగా వచ్చేదే అన్నారు. కానీ ఇప్పుడు అది లేదని, 90:10 శాతం నిధులు ఇస్తున్నామన్నారు. ఏపీది ప్రత్యేక పరిస్థితి అని చెప్పారు. కేంద్రానికి 29 రాష్ట్రాల బాధ్యత ఉందన్నారు.
హోదా ఉన్న రాష్ట్రాలు లేవు
పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటికే రూ.5వేల కోట్లు ఇచ్చామని జైట్లీ చెప్పారు. ప్రస్తుతం ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు లేవని చెప్పారు. రెవెన్యూ లోటును పూడ్చాలని విభజన చట్టంలో ఉందన్నారు. ఈఏపీ సాయాన్ని నాబార్డు ద్వారా ఇవ్వాలని జనవరిలో ఏపీ కోరిందని, అలా ఇస్తే ఏపీ రుణసామర్థ్యం తగ్గుతుందని చెప్పారు. నిధుల కోసం ఎస్పీబీని ఏర్పాటు చేయాలని రాష్ట్రానికి సూచించామన్నారు. విదేశీ సంస్థల ద్వారా నిధులు తెచ్చుకుంటే కేంద్రం తొంబై శాతం చెల్లిస్తుందన్నారు.
కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమే
కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమేనని జైట్లీ చెప్పారు. హోదాతో సమానంగా సాయం అందిస్తున్నామని, పోలవరం నిర్మాణం వేగం పుంజుకోవాలన్నారు. పోలవరంకు రూ.5వేల కోట్లు, అమరావతికి రూ.2500 కోట్లు ఇచ్చామని చెప్పారు. రెవెన్యూ లోటును ఏ ప్రాతిపదికన నిర్ణయించాలనేది ప్రభుత్వం తేల్చుకోవాలని ఏపీ ప్రభుత్వం కోర్టులోకి నెట్టారు.
మిగిలినవి రెండు అంశాలు
రెవెన్యూ లోటు, కేంద్ర పథకాలకు 90 శాతం ఆర్థిక సాయంఈ రెండు అంశాలు తేలితో మిగిలినవి అన్నీ పరిష్కారం అయినట్లేనని అరుణ్ జైట్లీ తేల్చి చెప్పారు. కాగా, ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఇస్తున్నామని, ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చినట్లు 90:10 శాతం నిధులు ఇచ్చేందుకు సిద్ధమని, విదేశీ సంస్థల నుంచి తీసుకున్న వాటిలో 90 శాతం కేంద్రం భరిస్తుందని.. ఇలా చెప్పి జైట్లీ బంతిని ఏపీ కోర్టులోకి నెట్టారు. కాగా, జైట్లీ పాతపాటే పాడారని, గ్రాంట్ రూపంలో ఇవ్వకుండా క్లిష్టతరమైన పద్ధతిలో ఇవ్వండే సరికాదని, ఎఫ్ఆర్బీఎం పెంచలేదని టీడీపీ నేతలు అంటున్నారు.