పోలవరం నిధుల వినియోగంపై కేంద్రం ఆరా: సందర్శనకు కేంద్రమంత్రి: స్వీయ పర్యవేక్షణ
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన నిధుల కోసం రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (ఆర్థికం), పీ అనిల్ కుమార్ యాదవ్ (జలవనరులు) హస్తినకు బయలుదేరి వెళ్లారు. దేశ రాజధానిలో జల్శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్, ఇతర అధికారులతో సమావేశం అయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇప్పటిదాకా రూపొందించిన సవరించిన అంచనాలు, డీపీఆర్ ఆమోదం పొందడానికి వారు కేంద్రమంత్రితో భేటీ అయ్యారు.
సవరించిన అంచనాల వివరాలను ఆయనకు అందజేశారు. వాటిని ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై వారు గజేంద్ర సింగ్ షెఖావత్కు వినతిపత్రాన్ని అందజేశారు. మరో ఏడాదిలోగా ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకుని రావాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని వివరించారు. లక్ష్యాన్ని చేరుకోవాలంటే సకాలంలో నిధులను మంజూరు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 2017-18లో అప్పటి సవరించిన అంచనాలను ఆమోదించాలని వారు కోరారు.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అంచనాల పెంపు, డీపీఆర్ ఆమోదానికి సంబంధించిన ప్రతిపాదనలు కొంతకాలంగా ఆర్థిక శాఖ మంత్రిత్వశాఖక వద్ద పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) మార్గదర్శకాలకు అనుగుణంగా పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిధుల బకాయిల విడుదల, సవరించిన అంచనాల ఆమోదం కోసం ఇప్పటికే తాను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ను కలిశానని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు.
ఏడాది నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నందున.. పనులను పర్యవేక్షించడానికి రావాలంటూ వారు గజేంద్ర సింగ్ షెఖావత్కు విజ్ఞప్తి చేశారు. దీనికి ఆయన అంగీకరించారు. 15 రోజుల్లో తాను ఏపీకి వస్తానని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చినట్లు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని విడుదల చేయడానికి కేంద్రమంత్రి అంగీకరించారని వివరించారు.