అప్పటి వరకు నిధులు రావు: ‘పోలవరం’పై తేల్చేసిన కేంద్రమంత్రి, ఏపీ ఎంపీల ప్రశ్నలు
న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుపై రాజ్యసభలో కీలక చర్చ జరిగింది. పోలవరం ప్రాజెక్టుకు నిధులు వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలు కేంద్రాన్ని కోరారు. పోలవరంపై కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన సావధాన తీర్మానంపై చర్చలో భాగంగా ఎంపీలు నిధుల కోసం ప్రశ్నించారు.
పోవవరం నిర్మాణంపై కేంద్రం బాధ్యత తీసుకోవాలని కేవీపీ రామచంద్రరావు కోరారు. ఈ క్రమంలోనే రాష్ట్రానికి చెందిన ఇతర పార్టీల ఎంపీలు కూడా పోలవరం నిర్మాణంపై ప్రశ్నలు లేవనెత్తారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ.. 2019 ఏప్రిల్ నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 60-70శాతం వరకు పూర్తయిందని, ఆ తర్వాత నిర్మాణ పనులన్నీ ఆగిపోయాయని తెలిపారు.
ఆరునెలల నుంచి అక్కడ ఏ పనులు జరగడం లేదని రమేష్ చెప్పారు. ఇందుకు కారణాలేంటని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఉన్నట్టుండి నిర్మాణ సంస్థను మార్చేశారని తెలిపారు. అది సీవీసీ నిబంధనలను అనుసరించి తీసుకున్న చర్యేనా అని కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రశ్నిస్తున్నానని తెలిపారు. నిర్మాణ సంస్థ బాగా పనిచేస్తుంటే ఎందుకు మార్చారని ప్రశ్నించారు.
వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు చెల్లించాల్సిన నష్ట పరిహారం, పునరావాస, పునర్నిర్మాణ పనుల కోసం తక్షణమే రూ. 16వేల కోట్లు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
పోలవరం నిర్మాణానికి సంబంధించి సవరించిన అంచనా వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్పై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవడానికి ముందే రూ. 16వేల కోట్ల నిధులను విడుదల చేయాలని కోరతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారని గుర్తు చేశారు. ఎప్పటిలోగా నిధులు విడుదల చేస్తారో చెప్పాని కోరారు. మరో ఎంపీ సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ.. నిధులు ఇవ్వాల్సిన పద్ధతి ఇలావుంటే.. 2021కి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని మీరెలా భావిస్తున్నారని కేంద్రాన్ని ప్రశ్నించారు.
అప్పటి వరకు నిధులు ఇవ్వలేం: కేంద్రమంత్రి గజేంద్ర సింగ్
పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం మరింత క్రియాశీలంగా పనిచేయాల్సిన అవసరం ఉందని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఖర్చుకు సంబంధించిన ఆడిట్ పత్రాలు పూర్తిగా తమకు అందలేదని, అవి వచ్చే వరకు ఎలాంటి తదుపరి నిధులు విడుదల కావని స్పష్టం చేశారు.
పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించముందు రూ. 5వేల కోట్లు ఖర్చు అయ్యాయని, దానికి సంబంధించిన ఆడిట్ పత్రాల్లో కేవలం రూ. 3వేల కోట్లకు సంబంధించిన పత్రాలే తమకు అందాయని గజేంద్ర సింద్ తెలిపారు. పోలవరం తుది డీపీఆర్ ఆమోదంపై రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్స్ కమిటీ ఏర్పాటు చేశామని, ఆ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కొన్ని విషయాలపై వివరణ కోరిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వివరాలు పరిశీలించిన తర్వాత కమిటీ తన నివేదికను అందిస్తుందని కేంద్రమంత్రి వివరించారు.
మరో బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుకు అయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తుందని అన్నారు. గతంలో మంజూరు చేసిన రూ. 6764 కోట్లకు సంబంధించిన ఖర్చుల వివరాలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతుందని ప్రశ్నించారు. పోలవరం నిధులు ఆగకుండా చూడాలని, నిర్వాసితుల సమస్యపై దృష్టిపెట్టాలని కేంద్రాన్ని కోరారు.