నిరూపిస్తావా: పవన్ కల్యాణ్కు సవాల్ విసిరిన జలీల్ ఖాన్
విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో తనపై చేసిన ఆరోపణలను శాసనసభ్యుడు జలీల్ ఖాన్ ఖండించారు. దుర్గగుడి పార్కింగ్ వద్ద తాను డబ్బులు వసూలు చేసినట్లు పవన్ కల్యాణ్ ఆరోపిస్తున్నారని ఆయన అన్నారు.
ఆ ఆరోపణలు వాస్తవమని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన సవాల్ చేశారు. గురువారం ఆసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
బిజెపితో ప్యాకేజీ తీసుకుని...
పవన్ కల్యాణ్పై జలీల్ ఖాన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. బిజెపి వద్ద ప్యాకేజీ తీసుకుని పవన్ కల్యాణ్ హఠాత్తుగా తన వైఖరి మార్చుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్పై చేసిన ఆరోపణలకు పవన్ కల్యాణ్ ఆధారాలు చూపించగలరా అని అడిగారు.
పవన్ సభపై ఇలా అనుకున్నారు...
సభ పెడుతున్నారంటే పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా కోసం బలమైన పోరాటం చేస్తారని అనుకున్నారని, కానీ పవన్ కల్యాణ్ అసలు విషయం వదిలేసి అర్థం లేని ఆరోపణలు చేశారని జలీల్ ఖాన్ అన్నారు. ఒక్కసారి రాజధాని ప్రాంతాన్ని పరిశీలిస్తే అభివృద్ధి ఏమిటో తెలుస్తుందని అన్నారు.
కేంద్రంపై మాట్లాడరేం...
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం మోసం చేసిందని, ఆ మోసంపై పవన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని, ప్రధాని మోడీని నిలదీయలేదని జలీల్ ఖాన్ అన్నారు. జగన్, పవన్ కల్యాణ్, మోడీ కలిసి వచ్చినా తమ తెలుగుదేశం పార్టీకి ఏమీ కాదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
పవన్ అలా మాట్లాడుతున్నారు...
జనసేన కారణంగానే టిడిపి గెలిచిందనే పద్ధతిలో పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని జలీల్ ఖాన్ అన్నారు. జనసేన, బిజెపి మద్దతు లేకుండా టిడిపి పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయం సాధించిందని, సాధారణ ఎన్నికల్లో కన్నా మంచి ఫలితాలు సాధించిందని అన్నారు.