ఢిల్లీ వెళ్లిన 7గురు ఎమ్మెల్యేలు టిడిపిలోకి, జగన్ ఏమివ్వడు: జలీల్
విజయవాడ: వైసిపి అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఢిల్లీ వెళ్లిన వైసిపి ఎమ్మెల్యేల్లో ఏడుగురు టిడిపిలో చేరుతారని ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జలీల్ ఖాన్ కొద్ది రోజుల క్రితం వైసిపి నుంచి టిడిపిలో చేరారు.
బుధవారం నాడు అద్దంకి వైసిపి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనతో పాటు ఇద్దరు ఎంపీపీలు, ముగ్గురు జెడ్పీటీసీలు, గొట్టిపాటి అనుచరులు సైకిల్ ఎక్కారు. ఈ సందర్భగా జలీల్ ఖాన్ మాట్లాడారు.
వైసిపిలో గౌరవం ఉండదన్నారు. అక్కడ కూర్చోవడానికి కుర్చీలు కూడా ఉండవని, తినడానికి ఏం పెట్టరని జలీల్ ఖాన్ నవ్వుతూ వ్యాఖ్యానించారు. టిడిపిలో గౌరవం ఉంటుందని, ఇక్కడ కూర్చోవడానికి కుర్చీలు కూడా ఉన్నాయని, తినడానికి ఎన్నో ఉన్నాయని చెప్పారు.
జగన్ ఢిల్లీ విహారయాత్ర విడ్డూరమన్నారు. తమ జాతికి గతంలో కంటే ఎక్కువ నిధులు కేటాయించారని చెప్పారు. రాబోయే తరాలు బాగుండాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలన్నారు. జగన్ తన ఎమ్మెల్యేల పైన నమ్మకం లేకనే, ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారన్నారు.
జగన్తో ఢిల్లీకి వెళ్లిన ఎమ్మెల్యేలలో ఏడుగురు ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతారని జోస్యం చెప్పారు. చంద్రబాబు లక్ష కోట్లు దోచుకున్నారని జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రతిపక్ష నేతగా జగన్ అసమర్థతను ప్రజలు గుర్తించారన్నారు. 2019 ఎన్నికల్లో వైసిపికి డిపాజిట్లు రావని, జగన్ ముఖ్యమంత్రి కల కలగానే మిగిలిపోతుందన్నారు.
దామచర్ల జనార్ధన్ మాట్లాడుతూ.. వైసిపిలో జగన్ తప్ప ఎవరూ మిగలరని చెప్పారు. వైసిపి నుంచి వచ్చే వాళ్లు ఇంకా ఉన్నారని, వారికి తమ పార్టీ స్వాగతం పలుకుతుందన్నారు. పార్టీ కోసం, ప్రజల కోసం అందరం కలిసి పని చేస్తామన్నారు.