ఆస్తులు పెంచేందుకే లీజుకు, చందన బ్రదర్స్ ఒప్పందం రద్దు: జలీల్ ఖాన్
విజయవాడ: వక్ఫ్ బోర్డు ఆస్తులు పెంచేందుకు జామా మసీదు ఆస్తులు లీజుకు ఇచ్చామని వక్ప్ బోర్డు చైర్మన్ జలీల్ ఖాన్ మంగళవారం అన్నారు. రాజకీయ కారణాలతో కొందరు దీనిపై ఆందోళన చేస్తున్నారని మండిపడ్డారు. వేలంలో అధికంగా కోడ్ చేసిన వారికే లీజుకు ఇచ్చామని చెప్పారు.
కాపు దెబ్బ: ఇదీ విషయం... వైసీపీ ట్విస్ట్, జగన్ వ్యూహంపై టీడీపీ అప్రమత్తం
చందన బ్రదర్స్తో ఒప్పందం రద్దు చేసుకున్నాం
తాను ఎవరి దగ్గరా డబ్బు తీసుకోలేదని జలీల్ ఖాన్ చెప్పారు. ఎవరి వద్దనైన డబ్బు తీసుకున్నట్లు తేలితో రాజీనామా చేసేందుకు సిద్ధమని సవాల్ చేశారు. వక్ఫ్ బోర్డుకు నిధులు సమకూర్చుకోవాలన్నారు. చందనా బ్రదర్స్తో ప్రస్తుతం చేసుకున్న ఒప్పందం రద్దు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఒప్పందం రద్దు చేసుకొని, తిరిగి బహిరంగ వేలం నిర్వహిస్తామని జలీల్ ఖాన్ స్పష్టం చేశారు.
అన్యాక్రాంతం చేస్తున్నారని నిరసన
కాగా, విజయవాడ నగరంలోని వన్ టౌన్ జామా మసీద్ సెంటర్లో మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. వంద కోట్ల విలువైన స్థలాన్ని అన్యాక్రాంతం చేసేందుకు వక్ఫ్ బోర్డు చైర్మన్ జలీల్ ఖాన్ యత్నం చేస్తున్నారంటూ పలువురు నిరసన తెలిపారు. మసీదు స్థలం వద్ద సీపీఐతో పాటు ముస్లీం సంఘాలు నిరసన తెలిపాయు.
ద్రోహం చేస్తున్నారని నినాదాలు
జలీల్ ఖాన్ ముస్లీంలకు ద్రోహం చేస్తున్నారంటూ వారు నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వచ్చారు. ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసు వాహనాల్లో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. స్థలాన్ని అక్రమంగా తక్కువ ధరకు ఇస్తున్నారని వారు ఆరోపించారు.
చవగ్గా కట్టబెడుతున్నారనే ఆరోపణలతో వెనక్కి
ఓ సంస్థకు కారు చవగ్గా జామా మసీదు ఆస్తులను కట్టబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో జలీల్ ఖాన్ వివరణ ఇవ్వడంతో పాటు వెనక్కి తగ్గారు. సీపీఐ, ముస్లీం సంఘాలతో పాటు ఇతర పార్టీలు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నాయి.